చిన్న పరిశ్రమల కోసం ఎస్బీహెచ్ 'శుభ్ లాభ్'
హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ‘శుభ్ లాభ్' అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
ఇందు లో భాగంగా ఎస్ఎంఇలకు తక్కువ వడ్డీరేట్లకే రుణాలివ్వడం, ప్రాసెసింగ్ చార్జీలు, ముందస్తు ఫీజుల్లో రాయితీ కల్పిస్తోంది. రుణం తీసుకుని కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారికి, ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న యూనిట్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది.
ఇతర ఆర్థిక సంస్థలు/బ్యాంకుల్లో అధిక వడ్డీరేట్లకు రుణాలు తీసుకున్న పారిశ్రామిక వేత్తలు తమ రుణాలను ఎస్బీహెచ్కి బదిలీ చేసుకుని శుభ్ లాభ్ ప్రయోజనాలు వినియోగించుకోవాలని కోరింది.
వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, యంత్రాలు, పరికరాలు, వాణిజ్య వాహనాలు, నిర్మాణ రంగంలో ఉపయోగపడే పరికరాలు కొనుగోలు చేసేందుకు ఎస్బిహెచ్ రుణాలు ఇస్తోంది. ఈ పథకం డిసెంబర్ 31 వరకూ ఉంటుంది.