minimum wages: కనీస వేతనంపై ఆలస్యం చేయబోం
కనీస వేతనం(మినిమం వేజ్) అంశాన్ని కాలయాపన చేసే ఉద్దేశ్యంలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఆదాయాలు తగ్గడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వంటి వివిధ కారణాల నేపథ్యంలో ప్రయివేటు రంగంలోని ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వ కనీస వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అందరికీ కరువు భత్యం పెంచుతున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఈ పెంపు ఏప్రిల్ 21వ తేదీ నుండి వర్తిస్తుంది.
ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. కనీస వేతనం అంశాన్ని ఆలస్యం చేసే ఉద్దేశ్యం లేదని లేబర్ మినిస్ట్రీ వెల్లడించింది. కనీస వేతనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రముఖ ఎకనమిస్ట్ అజిత్ మిశ్రా నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ నిపుణుల కమిటీ కాలపరిమితి మూడేళ్లు.
ఇప్పుడు కనీస వేతనాలపై ఢిల్లీ ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చింది. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. కేవలం కాలయాపన చేసేందుకే అజిత్ మిశ్రా కమిటీ వేశారని విమర్శలు వచ్చాయి. దీనిపై కేంద్రం స్పందించింది. కమిటీ పేరుతో కాలయాపన చేయబోమని కనీస వేతనాలపై త్వరగా నిర్ణయం తీసుకుంటాని తెలిపింది. కనీస వేతనాలకు సంబంధించి జూన్ 14వ తేదీన ఓసారి సమావేశమైంది. జూన్ 29వ తేదీన రెండోసారి సమావేశం కావాల్సి ఉంది.