Swiss Bank black money: కుప్పలు తెప్పలుగా: కేంద్రం చెప్పిన 5 కారణాలు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ఈ ఏడాది కాలంలో భారతీయుల కోట్ల రూపాయల కొద్దీ నల్లడబ్బును కూడబెబ్టుకున్నారని, వాటిని స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచి పెట్టుకున్నట్లుగా వార్తలు వెల్లువెత్తాయి. నెలల తరబడి సాగిన లాక్డౌన్ తరహా పరిస్థితుల్లో దేశ ప్రజలు ఉద్యోగాలు, ఉపాధిని, జీవనాధారాలను కోల్పోయినప్పటికీ.. కొందరు బడా బాబులు మాత్రం బ్లాక్ మనీని ఆర్జించారని, స్విస్ బ్యాంకులో అమాంతంగా పెరిగిన డిపాజిట్లే.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.
ఎంత పెరిగింది..
స్విస్ బ్యాంక్లో జమ చేసిన కొందరు వ్యక్తులు, వ్యాపార సంస్థలు నల్ల డబ్బు డిపాజిట్లు ఒక్కసారిగా పెరిగాయంటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ వెల్లడించిన విషయం తెలిసిందే. స్విస్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. 2020లో స్విస్ బ్యాంకులో భారతీయులు, భారతీయ కంపెనీల డిపాజిట్లు మొత్తం రూ.20,706 కోట్లకు పెరిగినట్లు ఆ నివేదిక పేర్కొంది. మొత్తంగా 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్లు వేర్వేరు ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు తెలిపింది. 13 సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో ఎప్పుడూ భారతీయుల డిపాజిట్లు ఈ స్థాయిలో పెరగలేదని స్పష్టం చేసింది.
తోసిపుచ్చిన కేంద్రం..
దీనికి సంబంధించిన వార్తలు, కథనాలు దేశీయ మీడియాలో విస్తృతంగా పబ్లిష్ అయ్యాయి. ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు స్పందించింది. స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు భారీగా పెరిగినట్లు వచ్చిన కథనాలు సరికాదని తెలిపింది. వాటిని తోసిపుచ్చుతున్నట్లు స్పష్టం చేశారు ఈ శాఖ అధికారులు. ఆ కథనాలకు సంబంధించిన పూర్తి సమాచారం, నివేదికలను తాము స్విట్జర్లాండ్ నుంచి తెప్పించుకుంటున్నామని వివరించారు.
భారతీయుల డిపాజిట్లు లేవు..
స్విస్ నేషనల్ బ్యాంక్ వెల్లడించిన నివేదికలో పొందుపరిచిన డిపాజిట్ల మొత్తంలో భారతీయులు లేదా భారతీయ సంస్థలు, ప్రవాస భారతీయులు వివరాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేశారు. థర్డ్ పార్టీ కంట్రీ పేర్ల మీద కూడా భారతీయులు డిపాజిట్ చేసినట్లు వివరాలు లేవని అన్నారు. 2019లో స్విస్ బ్యాంక్లో భారతీయుల డిపాజిట్ల జమా ఖర్చుల మొత్తం సగానికి సగం తగ్గిందని చెప్పారు. బాండ్లు, సెక్యూరిటీస్ వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో స్విస్ బ్యాంకులో భారతీయులు చేసిన డిపాజిట్లు పెరిగినట్లు తెలిపారు.
కేంద్రం చెప్పిన అయిదు కారణాలు..
స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు పెరగలేదనడానికి కేంద్రం అయిదు కారణాలు వివరించింది. ఒకటి- స్విట్జర్లాండ్ కేంద్రంగా పని చేస్తోన్న భారతీయ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీల వల్ల డిపాజిట్లు పెరిగాయని తెలిపింది. రెండు- భారత్లోని స్విస్ బ్యాంక్ శాఖా కార్యాలయాల్లో ఆర్థిక లావాదేవీలు పెరగడం కూడా ఓ కారణంగా పేర్కొంది. మూడు- భారతీయు బ్యాంకులు-స్విస్ బ్యాంకుల మధ్య చోటు చేసుకున్న ఇచ్చిపుచ్చుకునే విధానం, ఇతర లావాదేవీలు డిపాజిట్లు పెరగడానికి కారణం అయ్యాయి. నాలుగు- భారత్ను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తోన్న స్విస్ కంపెనీల మూలధనంలో వృద్ధి. అయిదు- అవుట్ స్టాండింగ్ డెరియేటివ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లల్లో సెక్యూరిటీస్ పెరగడం వంటి చర్యల వల్ల అవి మెరుగుపడినట్లు కేంద్రం తెలిపింది.