ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఆభరణాల కంపెనీ ఇండియాలోనే ఉందని మీకు తెలుసా?
గతేడాది ఫార్చూన్ 500 జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఈ కంపెనీ గురించి చాలా మందికి తెలిసింది. ఇంత స్థాయికి ఎదిగిన ఈ సంస్థ, దాని వ్యవస్థాపకుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
ఫోర్బ్స్ ధనవంతుల్లో చాలా మంది పేర్లు మీరు విని ఉండొచ్చు. కానీ ఈ పేరు ప్రత్యేకం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వ్యాపారం కంపెనీ అధిపతి ఆయన. ఆయనే రాజేశ్ ఎక్స్పోర్ట్స్ వ్యవస్థాపకులు రాజేష్ మెహతా. బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థను తన సోదరుడు ప్రశాంత్ మెహతాతో కలిసి 1989లో స్థాపించారు. ఈ సంస్థ రెవెన్యూ రూ.2,42,132 కోట్లు కాగా, నిర్వహణ ఆదాయం రూ.1,65,211 కోట్లుగా ఉంది. గతేడాది ఫార్చూన్ 500 జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఈ కంపెనీ గురించి చాలా మందికి తెలిసింది. ఇంత స్థాయికి ఎదిగిన ఈ సంస్థ, దాని వ్యవస్థాపకుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
వ్యాపార ప్రస్థానం మొదలు
అన్నదమ్ములు ఇద్దరూ రాజేష్ మెహతా, ప్రశాంత్ మెహతా 1988లో కుటుంబ రిటైల్ వ్యాపారంలో ప్రవేశించారు. 1990లో భారతదేశంలో మొట్టమొదటి వ్యవస్థీకృత బంగారు ఆభరణాల తయారీ వ్యాపారాన్ని వీరు ప్రారంభించారు. 1991లో బంగారం వ్యాపారం రంగంలో పరిశోధన, అభివృద్ది కేంద్రాన్ని మొదలుపెట్టారు. ఇది దేశంలోనే ప్రప్రథమం.
బంగారు ఆభరణాల వ్యాపారంలో దిగ్గజంగా
మామూలుగా దేశంలో బంగారం పరిశ్రమకు ముంబయి పెట్టింది పేరు. అయితే బెంగుళూరు నివాసి అయిన మెహతా విజన్తో బెంగుళూరులో బంగారం ఆభరణాల తయారీ, ఇక్కడి నుంచే పలు రాష్ట్రాలకు, దేశాలకు ఆభరణాలు పంపాలని నిర్ణయించి కంపెనీ ప్రారంభించారు. ఆ విధంగా 1994 కల్లా భారతదేశంలోనే బంగారు ఆభరణాల వ్యాపారంలో దిగ్గజంగా ఎదిగారు.
ఎగుమతులు
బంగారం నియంత్రణ చట్టంలో చిన్న లూప్హోల్ ఆధారంగా చేసుకుని మొదట్లో ఎగుమతులు చేశారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఒమన్, కువైట్, ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఎస్, పలు యూరోపియన్ దేశాలకు ఎగుమతులు చేశారు. ప్రస్తుతం రాజేష్ ఎక్స్పోర్ట్స్ మైనింగ్; రిఫైనింగ్, తయారీ, రిటైల్, హోల్సేల్, ఎగుమతులు మొదలైన వ్యాపారాలు చేపడుతోంది. ఈ కంపెనీ దేశంలోని రెండు స్టాక్ ఎక్స్చేంజీల్లోనూ లిస్ట్ అయింది.
బంగారం తయారీ
బంగారం ఆభరణాల తయారీలోకి ఈ కంపెనీ 1990ల్లో ప్రవేశించింది. తర్వాత నెమ్మదిగా పరిశోధన, అభివృద్దిని సైతం ప్రారంభించారు. 2000 సంవత్సరానికల్లా ప్రపచంలోనే అతిపెద్ద బంగారం తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. 2012లో శుభ్ జువెలర్స్ పేరిట ఫ్రాంచెజీల్లా బంగారు అమ్మకం కేంద్రాలను మొదలుపెట్టడం వీరికి టర్నింగ్ పాయింట్? ఈ బ్రాండ్ ప్రారంభం నుంచి రెండేళ్లలోపే కర్ణాటక వ్యాప్తంగా 80 షోరూంలను తెరిచారు.
నిధుల సేకరణ; విస్తరణ
ఏ రంగంలోనైనా పెద్ద ఎత్తున వ్యాపారాన్ని విస్తరించడానికి నిధుల సేకరణ అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీ 1995లో ఐపీవోలోకి వచ్చింది. తద్వారా వచ్చిన నిధులను తయారీ రంగంలో పెట్టాలనేది ప్రణాళిక. ఈ ఐపీవోకు విపరీతమైన స్పందన వచ్చింది. తర్వాత బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనే రెండు ఎక్స్చేంజీల్లోనూ ఇది చేరింది. 2006వ సంవత్సరంలో 1 బిలియన్ డాలర్లుగా ఉన్న దీని అమ్మకాలు 2010 సంవత్సరానికి 4 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి
వల్కాంబి కొనుగోలు
రాజేష్ ఎక్స్పోర్ట్స్ చరిత్రలోనే మరో మైలు రాయి ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ వల్కాంబి కొనుగోలు. 2015 నాటికే 400 టన్నుల సామర్థ్యం ఆ సంస్థ(వల్కాంబీ)కి ఉంది. వల్కాంబి ముఖ్యంగా చిన్న సైజ్ గోల్డ్ బార్; 500 టన్నుల కేజీ బార్లను తయారీ చేస్తుంది. ఈ బార్లన్నింటికీ లండన్లోని బులియన్ మార్కెట్ అసోషియేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది.ఇలా ప్రతిదశలోనూ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అంచెలంచెలుగా ఎదిగింది. 2016 నాటికి రాజేష్ ఎక్స్పోర్ట్స్ టర్నోవర్ రూ.1,61,000 కోట్లుగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం తయారీ, ప్రాసెసింగ్ కంపెనీగా ఉంటూ 35% బంగారం నిర్వహించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తోంది. డిజైన్లలో సైతం అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంది. దాదాపు 29 వేల డిజైన్ల డేటాబేస్ దీనికి ఉంది.
రాజేశ్ మెహతా గురించి
మెహతా చాలా సాదా సీదా జీవన శైలిని కలిగి ఉంటారు. స్మార్ట్ ఫోన్ లేకుండా కేవలం 3 ఫీచర్ ఫోన్లనే వాడతారు. టయోటా ఇన్నోవా వాహనం వాడతారు. అతని ఉద్యోగులకే ఆయన కంటే ఖరీదైన కార్లు సైతం ఉన్నాయంటారు. ప్రస్తుత సాంకేతిక ప్రాముఖ్యం తెలిసినప్పటికీ ఇప్పుడున్న సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్లు విసిగిస్తాయని తద్వారా తన ఏకాగ్రతను దెబ్బతీస్తాయని మెహతా చెబుతున్నారు. చాలా తక్కువగా విదేశాలకు వెళ్లే ఆయన దాదాపు రోజుకు కార్యాలయంలోనే 14 గంటలు గడుపుతారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ నిర్ణయాలన్నీ చాలా పకడ్బందీగా జరగడంతో పాటు కేవలం కుటుంబ సభ్యుల, ఆయన అంగీకారంతోనే తుది ప్రణాళిక అమలు చేస్తారు.