రైతు ఆత్మహత్యల నివారణకు రుణ మాఫీలే పరిష్కారమా?
మహారాష్ట్రలో ఇదివరకే జరిగిన రైతుల ఆందోళనలు, ఆ సందర్భంగా జరిగిన కాల్పులను చాలా మంది రైతులు మరిచిపోలేదు. 2016లో రైతులు పంటలు బాగానే పండించినా దిగుమతుల కారణంగా కొన్ని ఉత్పత్తుల ధరలు బాగా త
రుతుపవనాల విస్తరణతో దేశంలో పలు చోట్ల ఖరీప్ సీజన్ ప్రారంభమైంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు విత్తన సరఫరా చేస్తున్నాయి. అయితే తమిళనాడు రైతులు ఢిల్లీలో చేస్తున్న దీక్షలు మాత్రం ఆగడం లేదు. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకే జరిగిన రైతుల ఆందోళనలు, ఆ సందర్భంగా జరిగిన కాల్పులను చాలా మంది రైతులు మరిచిపోలేదు. 2016లో రైతులు పంటలు బాగానే పండించినా దిగుమతుల కారణంగా కొన్ని ఉత్పత్తుల ధరలు బాగా తగ్గినట్లు ఇండియాస్పెండ్.కామ్ నివేదించింది. మహారాష్ట్రలో రైతుల ఆందోళనల తర్వాత దేశవ్యాప్తంగా రైతన్నల పరిస్థితి, వ్యవసాయ రుణాల మాఫీ వంటి విషయాలు చర్చకొచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం సైతం తన విశ్లేషణను కలిగి ఉంది. అయితే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇండియా స్పెండ్ తనదైన వివరాలను సేకరించి, సమస్య మూలాల్లోకి వెళ్లింది. అది నివేదించిన కొన్ని విషయాలు పాఠకుల కోసం...
1. చిన్న కమతాల సమస్య
దేశంలో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడానికి ఉన్న ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది కమతాలు చిన్నగా ఉండటం. చాలా మంది రైతులు కుంచించుకుపోతున్న పొలాల విస్తీర్ణం మీదే ఆధారపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక్కో రైతు వద్ద సగటున 5.5 హెక్టార్లుగా ఉంది. ఒక్కో రైతు దేశంలో చాలా తక్కువ విస్తీర్ణంలోనే పంటలు పండించాల్సి వస్తోంది. 1951 నాటికి ఒక్కో రైతు వద్ద ఉన్న సగటు భూమి 0.5 హెక్టార్ల నుంచి 2011 నాటికి 70% తగ్గి 0.5 హెక్టార్లకు పడిపోయిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశ వ్యాప్తంగా చిన్న, మధ్య స్థాయి కమతాల శాతమే 85%గా ఉంది. చిన్న కమతాల్లో ఆధునిక యంత్ర సామాగ్రి ఉపయోగించడం కష్టం. ఒక పక్క కూలీల ఖర్చు ఎక్కువవుతోంది కాబట్టి కూలీలను సైతం ఉపయోగించి పొలాల కలుపు తీయించడం, చిన్న చిన్న పనులు చేయించేందుకు సైతం ముందడుగు వేయలేని స్థితి. మరో వైపు కూలీలు సైతం గిట్టుబాటు కాక చిన్న పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్న పరిస్థితి. దీనికి తోడు కౌలు రైతులకు, చిన్న రైతులకు రుణాలు దొరకడం కూడా కష్టం.
2. కరువులు, వర్షపాతం లేక ఉత్పత్తిపై ప్రభావం; ఉత్పత్తి ఉన్నా సరైన ధరలు రాలేదు
2014,2015లో సరైన వర్షపాతం లేక చతికిల పడిన వ్యవసాయ ఉత్పత్తి 2016లో పడిన వర్షాల వల్ల కొద్దిగా ఫర్వాలేదనిపించింది. 2014-15లో వ్యవసాయ వృద్ది 0.2% ఉండగా, 2015-16 లో వ్యవసాయ వృద్ది 1.2% ఉండగా, 2016-17 సంవత్సరంలో వ్యవసాయ ఆర్థిక వృద్ది 4.1% వరకూ పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ మార్కెట్లు కంది బేళ్ల ఉత్పత్తితో కళకళలాడాయి. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అత్యధిక వృద్ది సాగింది. ప్రోటీన్లకు ముఖ్య వనరు ఇవే కావడం విశేషం కాగా భారత్ ప్రపంచంలోనే అత్యధిక పప్పు ధాన్యాల ఉత్పత్తిదారుగా ఉంది. అయితే సరిగా మన ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చిన సమయంలోనే మయన్మార్, టాంజానియా, మొజాంబిక్, మలావి నుంచి రెండు త్రైమాసికాల్లో వచ్చిన దిగుమతులు 20% పెరిగిన కారణంగా మన రైతులకు గిట్టు బాటు ధర తగ్గింది.
3. ధరల మార్పు ఇలా...
డిసెంబరు, 2015లో క్వింటాలు కంది పప్పు ధర రూ. 11వేలు ఉండగా అది తర్వాతి సంవత్సరానికి 63% పడిపోయి క్వింటాలుకు 3800-4000 వరకూ పలికింది. ఇది కనీస మద్దతు ధర కన్నా 20% తక్కువ కావడం శోచనీయం. డిసెంబరు, 2016 నాటికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5050(బోనస్ రూ.425తో కలిపి) వరకూ ఉంది. ఈ ధరలను ఏప్రిల్ 12,2017న ఇండియా స్పెండ్ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఇస్తున్నాం. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు ప్రభుత్వం కందిపప్పు మద్దతు ధరను 2017లో క్వింటాలుకు రూ.6 వేలుగాను, 2018లో రూ.7 వేలుగాను ప్రకటించాల్సి ఉంది. మార్చి, 2017 నాటికి సైతం మద్దతు ధర కమిటీ సూచన కంటే 20% తక్కువగా రూ.5050గా ఉంది.
4. రైతులపై నోట్ల రద్దు, ప్రభుత్వ నిర్ణయాలు, అవినీతి ప్రభావం
మే 18 మధ్యాహ్నం 30 ఏళ్ల ప్రశాంత్ లాండే నిండు వేసవిలో తన 800 క్వింటాళ్ల కంది పప్పును అమ్మేందుకు మహారాష్ట్రలో ఉండే అమరావతి వ్యవసాయ ఉత్పత్తి కమిటీ దగ్గరకు వచ్చాడు. ఇది ముంబయికి 664 కి.మీ దూరంలో ఉంటుంది. ప్రభుత్వం తమ ప్రాంతంలో కొనుగోలు కేంద్రం ఉంచినా అక్కడ ఉన్న ఇబ్బందుల కారణంగా అమ్మేందుకు సిద్దంగా లేడు లాండే. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్ద రూ.5050 వరకూ క్వింటాలుకు వస్తున్నా లాండే అమరావతికి వచ్చి అక్కడ మార్కెట్లోనే రూ.4 వేల లోపు క్వింటాల్ అమ్మేందుకు సిద్దపడ్డాడు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తన ఉత్పత్తిని అతడు అమ్మకుండా ఉండేందుకు చెప్పిన కారణం నెల రోజులు దాని కోసం పడిగాపులు కాయాలంట. లైన్లో నించుని మొదట టోకెన్ తీసుకుని తన డబ్బు, తన చేతికి వచ్చే సరికి దాదాపు నెల రోజులు పడుతుందని లాండే వాపోయాడు. చెల్లింపులు ఆలస్యమయ్యేందుకు ఒక విధంగా పెద్ద నోట్ల రద్దు కూడా కారణం అయింది. కర్ణాటక, తమిళనాడులోని టమోటా రైతులు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని ఉల్లి రైతులు సైతం తమ ధరలు 60-85% తగ్గాయని వాపోయారు. ఉత్పత్తులకు సరైన అమ్మకం ధర లేని రైతు అప్పుల పాలవుతున్నాడు. దీంతో ఆత్మహత్యలు ఆగడం లేదు. 2015 సంవత్సరంలో మహారాష్ట్రలో 4291రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2014లో 4004 మంది కన్నా ఇది 7% ఎక్కువ. అదే 2015లో కర్ణాటకలో 1569 మంది, తెలంగాణలో 1400 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.
5. రైతు రుణ మాఫీలు
2014 ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్లో రైతు రుణ మాఫీ పర్వం ప్రారంభమైంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉత్తరప్రదేశ్ భాజపా ప్రభుత్వం రూ. 30,792 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. మొదట్లో రైతు రుణాలను మాఫీ చేసేందుకు సిద్దంగా లేని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం గత నెలలో 34 వేల కోట్ల రూపాయలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం సైతం కేవలం సహకార బ్యాంకు రుణాలను మాఫీ చేసింది.
6. సమస్య ఎక్కడ?
6.26 కోట్ల మంది వారు సంపాదిస్తున్నా దాని కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అదేలాగా అంటారా హెక్టారుకు సగటున రైతు ఎంత ఉత్పత్తి సాధించగలడు, దాని ఖర్చులు, అమ్మితే వచ్చే సొమ్ము ఎంత అనే దానిపై ఎన్ఎస్ఎస్వో జరిగిన రైతు కుటుంబ గణాంకాల్లో 2013లో ఇది బయటపడింది. కేవలం 3.5 లక్షల మంది రైతుల పరిస్థితి భిన్నంగా ఉంది. 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి కలిగిన వీరు నెలకు రూ.41,338 సంపాదిస్తుండగా, దాదాపు రూ.14,447 వరకూ ఖర్చుపెడుతున్నారు. అంటే నెలకు దాదాపు రూ.26,941 వరకూ మిగులుతోంది.
దేశంలో అందరూ రైతులను తీసుకుంటే రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి కలిగిన వారు 85% ఉన్నట్లు ఎన్ఎస్ఎస్వో డేటా వెల్లడించింది. వీరందిరిలో 30% కంటే తక్కువ మందికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు అందుతున్నాయి.
7. అందరి కంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రైతుకే అప్పులు ఎక్కువ
వ్యవసాయ రుణగ్రస్తత పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పుల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్(93%), తెలంగాణ(89%), తమిళనాడు(82.1%), కేరళ(77.7%), కర్ణాటక(77.3%) ఈ వరుసలో అప్పులు తీసుకున్న వారి సంఖ్య ఉంది. 2015లో రైతులు ఆత్మహత్యకు కారణమైన వాటిలో 55% మందికి సంబంధించి మొదటి కారణం అప్పుల పాలవడమే అని తేలింది. 1995 నుంచి 2015 వరకూ దాదాపు 3 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డట్లు ఇండియాస్పెండ్ రిపోర్ట్ చేసింది.
8. వాతావరణ మార్పుల ప్రభావం
భారతదేశంలో ఎక్కువ వ్యవసాయదారులు వర్షంపైనే ఆశలతో పొలం సాగు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులు అడపా దడపా ఉన్నప్పటికీ, పూర్తికానివి ఎక్కువగా ఉంటూ, అవినీతి వంటి కారణాల వల్ల వర్షంపైనే ఎదురుచూపులతో బతుకీడుస్తున్నారు. 52% సాగుబడి ఇంకా సీజన్ల వారీ వర్షపాతంపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం వాతావరణ మార్పులతో సమయానికి వానలు కురవడం లేదు. అతివృష్టి, అనావృష్టి వంటి కారణాల వల్ల దిగుబడులపై ప్రభావం పడుతోంది. మహారాష్ట్ర ప్రాంతంలో 2014,2015లో గ్రామీణ ప్రాంతాల్లో కరువులు రాగా, 2016లో ఎక్కువ వర్షాలు పడ్డాయి. సమయం కాని సమయంలో కురిసే వర్షాల వల్ల ప్రభుత్వం అనుకున్న ప్రణాళికలను రైతుల కోసం అమలు చేయలేకపోతోంది. స్వాతంత్రం వచ్చి దాదాపు 7 దశాబ్దాలయినా కేవలం సగం వ్యవసాయ భూమికే నీటి వసతి కల్పించారని 2015-16 వ్యవసాయ నివేదిక చెబుతోంది.
9. ప్రభుత్వ ప్రణాళికలు ఖర్చులు
ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులు, వరద నియంత్రణ చర్యల కోసం 1951-56 మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 2006-11 లోని 11వ పంచవర్ష ప్రణాళిక వరకూ దాదాపు రూ.3.51 లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. ఇవన్నీ పన్నెండో పంచ వర్ష ప్రణాళిక లెక్కల ద్వారా తెలుస్తున్నాయి. జులై 1, 2015న ప్రధాన మంత్రి క్రిషి సించాయ్ యోజన అనే పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా పొలాలకు సాగునీటి వసతి పెంచాలని రూ.50 వేల కోట్ల బడ్జెట్ ఐదేళ్ల(2015-16 నుంచి 2019) కాలానికి కేటాయించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ప్రతి పొలానికి నీటి సతి, ప్రతి నీటి చుక్క వల్ల ఎక్కువ ఉత్పత్తి సాధించడం. 2015-16 సంవత్సరంలో సూక్ష్మ నీటి వసతి(మైక్రో ఇర్రిగేషన్)కి రూ.1000 కోట్లు కేటాయిస్తే ఏప్రిల్ 2016 నాటికి సైతం అందులో విదిల్చింది 312 కోట్లయితే ఖర్చు పెట్టింది రూ.48.3 కోట్లని ఇక నివేదిక తెలిపింది. అదే 2016-17 విషయానికి వస్తే మైక్రో ఇర్రిగేషన్ విషయమై రూ.1763 కోట్ల కేటాయింపులు లక్ష్యంగా పెట్టుకోగా దీనికి సంబంధించి గణాంకాలే అందుబాటులో లేవు.
10. కేవలం రుణమాఫీలే పరిష్కారం కాదు
రైతుల కష్టాలను చూసిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణ మాఫీ బాటన పడుతున్నాయి. వ్యవసాయంలో ఇంత మంది అప్పుల పాలవుతున్నారనే దానిపై 2007లో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా దేశంలో వ్యవసాయ సంక్షోభానికి అప్పులు ఒకటే మూల కారణం కాదని తేల్చింది. ప్రముఖ ఆర్థిక వేత్త ఆర్ రాధాకృష్ణ నేతృత్వంలోని కమిటీ సగటు భూమి కలిగిన రైతు మరీ ఎంత పెద్దగా అప్పులు చేయట్లేదని నివేదించారు. వ్యవసాయంలో ఒక రకమైన స్తబ్దత ఏర్పడటం, ఉత్పత్తి పెరగకపోవడం, మార్కెటింగ్ కష్టాలు, సంస్థాగత ఏర్పాట్లు, ఇతర వృత్తుల ద్వారా బతికేందుకు ఏర్పాట్లు లేకపోవడం వంటి కారణాలను ఎత్తిచూపారు. రైతుకు ఏటా నీటి వసతి కోసం చేసే ఖర్చు, ఎరువులు, పురుగు మందులపై ఖర్చు, విత్తనాల ఖర్చు ఇబ్బడిముబ్బడిగా మారడం వ్యవసాయానికి గుదిబండగా మారుతోంది. ప్రభుత్వం వాస్తవిక స్థాయిలో మద్దతు ధర ఇవ్వడం, సరైన మార్కెట్ సదుపాయాలు కల్పించడం, వేర్హౌస్లు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు వంటివి ప్రస్తుత వాస్తవిక అవసరాలు. మరో వైపు 85% రైతులు బీమా చేయించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. అందుకే ఒక్క రుణ మాఫీ ఎప్పుడో ఒకసారి చేసేసి ప్రభుత్వాలు చేయి దులుపుకోకుండా, ఆయా సమస్యలపై మూలం నుంచి పోరాడితే తప్ప ఈ వ్యవసాయ రణక్షేత్రం నుంచి రైతును ఆదుకునే మార్గాలు కనబడవు.