త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించిన రిలయన్స్
పన్ను కట్టకముందు వచ్చే ఆదాయంలో గతేడాదితో పోలిస్తే 9% వృద్దితో రూ.10,522 కోట్ల రాబడి రావడం శుభసూచకమే. రిలయన్స్ ఫలితాలకు సంబంధించి పలు అంశాలను తెలుసుకుందాం.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలను రిలయన్స్ ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.1087 కోట్ల ఏకీకృత నికర లాభం వచ్చింది. పన్ను కట్టకముందు వచ్చే ఆదాయంలో గతేడాదితో పోలిస్తే 9% వృద్దితో రూ.10,522 కోట్ల రాబడి రావడం శుభసూచకమే. రిలయన్స్ ఫలితాలకు సంబంధించి పలు అంశాలను తెలుసుకుందాం.
1. రిలయన్స్ ఫలితాలపై ముకేశ్ అంబానీ స్పందన
మా సంస్థ మరో త్రైమాసికంలో మంచి ఫలితాలను సాధించింది. ఇది విశ్లేషకులు అంచనా వేసినదాని కంటే ఎక్కువ. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 28% వృద్దితో రూ.9108 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మా పరిశ్రమ పోర్ట్ఫోలియో ఎక్కువగా రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారంలో పట్టు కలిగి, దాని ద్వారా మంచి లాభాలు వచ్చాయి. రిటైల్ వ్యాపారం గతేడాదితో పోలిస్తే వార్షిక వృద్ది రేటు 74% గా ఉంది. దేశ టెలికాం రంగంలోనూ, డేటా వాడకంలోనూ రిలయన్స్ జియో కొత్త ఒరవడిని సృష్టించింది.
2. ఆర్థిక వివరాలు
జూన్30,2017 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రెవెన్యూ రూ.90,537 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ71,451 కోట్లతో పోలిస్తే 26.7% వృద్ది ఉంది. ఇంధన, పెట్రోలు రంగంలో మంచి గణాంకాలు ఉండటం, రిఫైనింగ్ సామర్థ్యం పెరగడంతో పాటు పెట్రో కెమికల్ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల కంపెనీ రాణించగలిగింది. రిటైల్ రంగంలో కంపెనీ 73.6% వృద్ది సాధించి రూ.11,571 కోట్ల రెవెన్యూను రాబట్టగలిగింది. 2017లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 45.6 డాలర్లుగా ఉండగా ; ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బ్యారెల్కు సగటున 49.9 డాలర్లకు పెరిగింది.
3. పెట్రో కెమికల్ వ్యాపారం
అందరూ ఊహించినట్లుగానే పెట్రో కెమికల్ వ్యాపారం బాగా రాణించడం వల్ల మొత్తంగా ఎవరినీ నిరాశపరచలేదు. గతేడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే పెట్రో కెమికల్స్ ఎబిటా(పన్ను, లాభాలకు ముందు ఆదాయం) 43.7% వృద్దితో రూ.4031 కోట్లుగా నమోదయింది. ఎక్కువగా ఉత్పత్తులు విస్తరించడం, ఎక్కువ ఉత్పత్తి జరగడం వల్ల ఇది సాధ్యమైంది. కేవలం పెట్రో కెమికల్స్కు సంబంధించి ఎబిటా మార్జిన్ 15.8% గా నమోదయింది.
4. నిర్వహణ లాభం
ఇతర ఆదాయాలు, కోతలు లేకుండా వచ్చే నిర్వహణ లాభం క్రితం సంవత్సరంతో పోలిస్తే 11.9% పెరిగి రూ. 12,554 కోట్లుగా ఉంది.
5. మొత్తం కంపెనీ అప్పులు
రిలయన్స్ ఇండస్ట్రీస్కు సంబంధించి జూన్ 30,2017 నాటికి అప్పులు రూ.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. మార్చి 31,2017 నాటికి ఉన్న రూ.1.96 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి కాస్త ఎక్కువే. కంపెనీ ఖర్చుల్లో గతేడాది రూ.1206 కోట్లతో పోలిస్తే ఈసారి త్రైమాసికంలో రూ.1119 కోట్లు కాస్త మంచిగానే అనిపించింది. నగదు, నగదుకు సమానమైన లావాదేవీలు 7% తగ్గి గతేడాది అదే త్రైమాసికంతో పోలిస్తే రూ. 72,107 కోట్లకు తగ్గాయి. ఇవి బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, కన్వర్టబుల్ డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, ఇతర మార్కెట్ సెక్యూరిటీల్లో ఉన్నాయి.
6. స్థూల రిఫైనింగ్ మార్జిన్
చమురు శుద్ది ఉత్పత్తికి సంబంధించి అంచనాలను మించి రాణించింది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే బాగా తగ్గుతుందన్నకున్న మార్జిన్ కాస్త మెరుగయింది. ఏకీకృత కోణంలో చూస్తే ఒక బ్యారెల్కు 11.9డాలర్ల గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ను సాధించగలిగింది. క్రూడ్ ఆయిల్ వనరులు బాగా ఉండటం, సరైన రిస్క్ మేనేజ్మెంట్ చేయడమే ఇందుకు కారణం.
రిలయన్స్ జియో
అయితే రిలయన్స్ తన ప్రకటనలో గత ఏడాది సెప్టెంబర్లో కార్యకలాపాలు ప్రారంభించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో గురించి పెద్దగా వివరాలు తెలియజేయలేదు. అయితే కేవలం 170 రోజుల్లోనే 10 కోట్ల చందాదారులతో రిలయెన్స్ జియో ప్రపంచంలోనే శరవేగంగా ఎదుగుతున్న టెక్నాలజీ కంపెనీగా అవతరించిందని మాత్రం తెలిపింది. కాగా, ముంబయిలో శనివారం జరిగే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయెన్స్ జియోకు సంబంధించి మరిన్ని ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
రూ.20 వేల కోట్ల రైట్స్ ఇష్యూ
ఇదిలా ఉండగా రిలయెన్స్ జియో తన నిధుల అవసరాలను తీర్చుకోవడం కోసం రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 20 వేల కోట్లను సేకరించాలని అనుకొంటోంది. రూ. 40 కోట్ల ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను రైట్స్ ఇష్యూలో విక్రయించడం ద్వారా రూ 20 వేల కోట్లను సమీకరించాలని గురువారం(జూలై 20న) జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు రిలయెన్స్ జియో సెబీకి దాఖలు చేసిన ఒక నివేదికలో తెలియజేసింది. సెప్టెంబరు 5,2016న జియో సంబంధిత డిజిటల్ సేవలను ప్రారంభించింది.