చైనా ఉత్పత్తులపై బ్యాన్ సాధ్యం అవుతుందా?
ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో చైనా ఉత్పత్తుల నిషేధంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈశాన్య రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులను వాడకూడదనే డిమాండ్ ఊపందుకు
ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో చైనా ఉత్పత్తుల నిషేధంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈశాన్య రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులను వాడకూడదనే డిమాండ్ ఊపందుకుంటోంది. చైనా విపరీతంగా భారత్లోకి తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న కారణంగా వాటిని వాడటం ఆపితే ఆర్థికంగా ఆ దేశం ఇబ్బందులకు గురవుతుందనేది దీనంతటికీ కారణం. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 60 బిలియన్ డాలర్ల చైనా వస్తువులను మనం దిగుమతి చేసుకున్న కారణంగా ఇందులో నిజం లేకపోలేదనే వాదన సైతం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
వాట్సప్, ఫేస్బుక్ గ్రూప్ల్లో ప్రచారం
గత రెండేళ్లలో చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలి, లేకపోతే వాడకూడదు అనే ప్రచారం జరగడం ఇది రెండో సారి. గతంలో దీపావళి సమయంలో చైనా టపాసులు కొనవద్దు అనే ప్రచారానికి ప్రజల నుంచి సైతం స్వచ్చందంగా మంచి స్పందనే వచ్చింది. అప్పుడు జైషే మహ్మద్ అధిపతి మసూద్ అజహర్ను ఐక్యరాజ్య సమితి తీవ్రవాదిగా గుర్తించాలనే విషయంలో చైనా మనతో ఏకీభవించలేదు. భారత వాదనతో చైనా అంగీకారానికి రాలేదు. మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో చైనా ద్వంద్వ వైఖరి పట్ల దేశాభిమానులు విసిగిపోయారు. చైనాకు ఆర్థికంగా దెబ్బ కొట్టాలని కొంత మంది వాట్సప్, ఫేస్బుక్ గ్రూప్ల్లో ప్రచారం చేశారు.
ఇప్పుడేం జరుగుతోంది?
అప్పటిది అంతర్జాతీయ కారణాల వల్ల కాగా ప్రస్తుతం జరుగుతున్నది మనకు, చైనాకు మధ్య సరిహద్దు వివాదం. ఇప్పుడు సైతం అంతే పెద్ద ఎత్తున చైనా ఉత్పత్తులను వాడకూడదంటూ, తక్షణమే చైనా ఉత్పత్తులను నిషేధించాలంటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సందేశాలపై ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మూలంగా ప్రభుత్వం ఏకపక్షంగా చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయడం కుదరదు.
చైనా చేసినప్పుడు మనం ఎందుకు చేయవద్దు?
కేవలం కొన్ని విషయాలు మనకు నచ్చని కారణంగా దిగుమతులను ఆపలేమని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పారు. కొన్ని నియమ నిబంధనలకు లోబడి యాంటీ డంపింగ్ డ్యూటీలను విధించవచ్చు.
ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు లోబడి ప్రభుత్వం ఆలోచిస్తూ చైనా ఉత్పత్తుల నిషేధానికి ప్రభుత్వం వెనుకాడుతోంది. అంతర్జాతీయ వ్యవహారాల వ్యూహకర్త, ప్రొఫెసర్ సీపీఆర్ బ్రహ్మా చెల్లానీ మాట్లాడుతూ చైనా పట్ల అతి ముఖ్యమైన అస్త్రాన్ని(వ్యాపారాన్ని) భారత్ ప్రయోగించాలన్నారు. దక్షిణ కొరియా, మంగోలియా దేశాలను చైనా ప్రభుత్వం ఏకపక్షంగా నిబంధనలతో విసిగించినప్పుడు మనం ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.(బిజినెస్ టుడే-డిజిటల్ తో ఆయన మాట్లాడారు)
చైనా ఏం చేసింది?
దక్షిణ కొరియా ఏకపక్షంగా అమెరికాను సైతం టార్గెట్ చేయగల క్షిపణి వ్యవస్థను లాంచ్ చేసినప్పుడు, బీజింగ్ ప్రభుత్వం దక్షిణ కొరియా కాస్మొటిక్స్ను నిషేధించింది. దాంతో పాటు చైనా పర్యాటక సమూహాలను దక్షిణ కొరియాకు వెళ్లొద్దని అడిగింది. ఇంకా దక్షిణ కొరియా రిటైల్ సమూహం లొట్టె చైనాలో ఉండకుండా ఒత్తిడి తెచ్చింది. చైనా జాతీయ భద్రతకు ముప్పు కలగకుండా దక్షిణ కొరియాపై పరోక్ష ఒత్తిడి తీసుకొచ్చింది.
మంగోలియా ట్రక్కులపై ఆంక్షలు
చైనా పదేపదే దలైలామా గురించి హెచ్చరించినా మత గురువు దలైలామాను మంగోలియాలో అనుమతించినందుకు చైనా, మంగోలియా ట్రక్కులను డిసెంబరు 2016లో అడ్డుకుంది. చైనా సరిహద్దులు దాటకుండా వందలాది బొగ్గు ట్రక్కులను నిలిపేసింది. దీని గురించి అల్ జజీరా అనే అంతర్జాతీయ పత్రిక "మత స్వేచ్చను గౌరవించిన కారణంగా ఆర్థికంగా మంగోలియా ఇబ్బందులకు గురవుతోంద "ని రాసింది.
నార్వే సాల్మన్ ఫిష్ నిషేధం
2010లో నార్వే నుంచి వచ్చే సాల్మన్ చేపల దిగుమతులను సైతం చైనా నిషేధించింది.
చైనా బహిష్కరించిన లియు జియోబోకు నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ఇచ్చినందుకు చైనా ఈ విధమైన చర్యకు పాల్పడింది. ఈ దిగుమతి నిషేధం కారణంగా సాల్మన్ ఫిష్ అమ్మకాలు 61.8% తగ్గినట్లు ఇండిపెండెంట్ రిపోర్ట్ చేసింది.
మోడీ, ట్రంప్ను అనుసరిస్తారా?
భారత్తో వాణిజ్య లోటును తగ్గించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్న విషయాన్ని ప్రొఫెసర్ చెల్లానీ గుర్తు చేస్తున్నారు. అయితే ఏ దశలోనూ మనతో ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు చైనా ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో వాణిజ్య లోటును తగ్గించాలి లేదా చైనా ఉత్పత్తులపై ఆంక్షలైనా ఉండాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. చైనాతో మన దేశం చేస్తున్న వ్యాపార లావాదేవీల కారణంగా మిగిలే డబ్బుతో చైనా సులువుగా చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ-CPEC)కి నిధులు సమకూర్చుకోగలుగుతోంది. మన డబ్బును మనపైనే ఎక్కుపెట్టడానికి వాడుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్కు ఉన్న ప్రధాన అస్త్రం వాణిజ్యం అనే అందరూ అంటున్న మాట. చైనా మాదిరే ఏకపక్షంగా మనమెందుకు చైనా ఉత్పత్తులపై ఆంక్షలు విధించకూడదని దేశభక్తులు అడుగుతున్నారు. చైనా నుంచి భారత్ చేసుకుంటున్న దిగుమతుల విలువ 2013-14లో 51 బిలియన్ డాలర్ల నుంచి 18.4% పుంజుకుని 2014-15 నాటికే 60 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే ప్రతి సంవత్సరం చైనా దిగుమతుల కారణంగా వారి ఆర్థిక వ్యవస్థే మన వల్ల బాగుపడుతోంది కానీ భారత్కు చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం వల్ల పెద్దగా ఒరిగేందేమీ లేదు.
చైనా ఉత్పత్తులపై ప్రభుత్వ వైఖరేంటో బయటపడాలని కోరుకుందాం.