మీ ప్రమేయం లేకుండా బ్యాంకు ఖాతాలో డబ్బు పోతే ఎలా?
ఈ మధ్య ఖాతాదారులు చేసిన ఫిర్యాదుల కారణంగా ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాతాల్లో మీకు ప్రమేయం లేకుండా జరిగే లావాదేవీలకు సంబంధించి ఎలా జాగ్రత్తపడాలో, అంతే కాకుండా ఏదైనా అనధికారిక లావ
ప్రభుత్వం ఏమో ఆన్లైన్,కార్డు లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. ఖాతాదారులు గత్యంతరం లేక ఆన్లైన్ లావాదేవీలు, కార్డులతో చెల్లింపులకు అలవాటు పడుతున్నారు. మరి భద్రత సంగతి... అంటే ప్రభుత్వం నుంచి అంత పక్కాగా పటిష్టమైన చర్యలేమీ లేవు. అయితే ఈ విషయంలో ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఈ మధ్య ఖాతాదారులు చేసిన ఫిర్యాదుల కారణంగా ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాతాల్లో మీకు ప్రమేయం లేకుండా జరిగే లావాదేవీలకు సంబంధించి ఎలా జాగ్రత్తపడాలో, అంతే కాకుండా ఏదైనా అనధికారిక లావాదేవీ జరిగితే ఏం చేయాలో సూచించింది. అవి మీ కోసం...
ఆర్బీఐ నోటిఫికేషన్
* కార్డు, ఆన్లైన్ లావాదేవీల్లో పాటించాల్సిన జాగ్రత్తలు
ఎలక్ట్రానిక్ లావాదేవీలు సురక్షితంగా జరిగేలా చూసేందుకు ఆర్బీఐ కృత నిశ్చయంతో ఉంది. కస్టమర్లు ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో తమ ప్రమేయం లేకుండా జరిగే లావాదేవీలకు సంబంధించి మూడు రోజుల్లో బ్యాంకు లేదా ఆర్బీఐకి తెలియజేస్తే, దానికి సంబంధించిన సొమ్మును 10 రోజుల్లోపు వెనక్కి ఇచ్చేలా చూస్తారని ఆర్బీఐ నోటిఫికేషన్ సారాంశం. తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీల ద్వారా డబ్బు కోల్పోతున్నామని ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా చేయాలనే దానిపై ఆర్బీఐ బ్యాంకులకు, ఖాతాదారులకు సూచనలు ఇచ్చింది.
2. మూడు పనిదినాలు
కస్టమర్ ప్రమేయం లేకుండా జరిగే థర్డ్ పార్టీ మోసాలకు బ్యాంకు ఖాతాదారు ఎలాంటి నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు. లోపం బ్యాంకు వద్ద ఉండి లేదా కస్టమర్ దగ్గర లేకుండా ఉంటే ఖాతాదారు డబ్బు నష్టపోవాల్సిన పని లేదు. అయితే ఖాతాదారు ప్రమేయం లేకుండా కార్డు లేదా ఆన్లైన్ లావాదేవీ నుంచి డబ్బు కోల్పోయినట్లయితే మూడు పనిదినాల్లోగా దాన్ని బ్యాంకుకు తెలియపరచాల్సి ఉంటుంది.
3. కస్టమర్ నష్టాన్ని భరించాలి!
ఒక వేళ మోసాన్ని నాలుగు నుంచి ఏడు పనిదినాల్లోగా తెలియజేసినట్లయితే, బ్యాంకు ఖాతాదారు గరిష్టంగా రూ.5000 నుంచి రూ.25 వేల వరకూ నష్టాన్ని భరించాల్సి రావచ్చు. అది ఖాతా రకం, క్రెడిట్ కార్డు పరిమితిని బట్టి ఆధారపడి ఉంటుంది.
4. బ్యాంకు పాలసీ ముఖ్యం
ఒక వేళ మోసపూరిత లావాదేవీ గురించి 7 రోజుల తర్వాత బ్యాంకుకు తెలియజేసినట్లయితే అప్పుడు ఖాతాదారు భరించాల్సిన నష్టం బ్యాంకు పాలసీ పైన ఆధారపడి ఉంటుంది. అనధికారిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సందర్భంలో ఏం చేయాలనే విషయం ఖాతాదారుల హక్కులు, అభ్యంతరాలను ఎలా పరిష్కరిస్తారో తెలపాల్సిందిగా బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.
5. ఖాతాదారు నిర్లక్ష్యంగా ఉంటే
ఖాతాదారు నిర్లక్ష్యం(వివరాలు వెల్లడించడం ద్వారా) కారణంగానే మోసం జరిగిన సందర్భంలో నష్టాన్ని బ్యాంకు భరించదు, ఖాతాదారే భరించాల్సి ఉంటుంది. కానీ అనధికారిక లావాదేవీ గురించి బ్యాంకుకు తెలియజేసిన వెంటనే మళ్లీ ఏదైనా అనుమానస్పద లావాదేవీ జరిగితే ఆ నష్టాన్ని బ్యాంకు భరిస్తుందని ఆర్బీఐ తెలిపింది.
6. ఎలక్ట్రానిక్ లావాదేవీలు
ఎలక్ట్రానిక్ లావాదేవీలు అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎమ్, పాయింట్ ఆఫ్ సేల్స్ మొదలైన అన్ని రకాలుగా జరిగే నగదు సంబంధిత వ్యవహారాలుగా పరిగణిస్తారు.
7. కస్టమర్కు సంబంధించి నష్టం భరించాల్సి రావడం
ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగిన తర్వాత బ్యాంకు ఖాతాదారు సదరు బ్యాంకుకు నివేదిస్తే, ఆ అనధికారిక లావాదేవీకి సంబంధించిన సొమ్మును బ్యాంకు 10 పనిదినాల్లోగా ఖాతాదారు బ్యాంకు ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. ఎంత సొమ్ము వెనక్కు వస్తుందనే అంశం అనధికారిక లావాదేవీ జరిగిన రోజు ఎంత డబ్బు మినహాయించబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
8. కస్టమర్లను అలర్ట్ చేయాలి
ఆన్లైన్ మోసాల నుంచి ఖాతాదారులను కాపాడేందుకు, బ్యాంకులు కస్టమర్లను అలర్ట్ చేస్తూ ఉండాలి. అంతే కాకుండా ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం మొబైల్ నంబరును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించాలి. అంతే కాకుండా ఈ-మెయిల్ అలర్ట్స్ సైతం పొందేలా చేయాలి.
9. బ్యాంకులు ఖాతాదారులను అప్రమత్తం చేయాలి
బ్యాంకులు సైతం నిత్యం వినియోగదారులను అనధికారిక, మోసపూరిత లావాదేవీల గురించి అప్రమత్తం చేయాలి. దీన్ని ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్ ద్వారా చేయవచ్చు. ఈ తరహా ఎస్ఎంఎస్ లేదా మెయిల్ అలర్ట్స్లో రిప్లై ఆప్షన్ ఉండాలి. అందులో కస్టమర్ మోసపూరిత లావాదేవీలు జరిగిన సందర్భంలో ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశం ఉండాలి.
10. బ్యాంకు వెబ్సైట్ హోం పేజీలోనే
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకు వెబ్సైట్ హోం పేజీలోనే మోసపూరిత లావాదేవీలకు సంబంధించి కస్టమర్ ఫిర్యాదు చేసేందుకు ఒక లింక్ ఉండేలా చూసుకోవాలి.