2017లో 1.41 లక్షల కోట్ల పెట్టుబడుల రాక
జూన్ నెల 1-16 మధ్య స్టాక్ మార్కెట్లలోకి రూ. 4,022 కోట్ల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్లలోకి రూ. 18,821 కోట్ల పెట్టుబడులు వచ్చాయ.దీంతో నికర పెట్టుబడుల విలువ రూ. 22,843 కోట్లుగా నమోదైం
దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్పిఐ) నుంచి పెట్టుబడుల రాకతో విదేశీ నిధుల రాకడ అధికమైంది. జనవరి తప్ప ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత నెల జూన్లో కూడా 3.55 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. విదేశీ మదుపరులు15 రోజుల్లో రూ. 23 వేల కోట్ల వరకు పెట్టుబడులను తెచ్చారు. అయితే స్టాక్ మార్కెట్లలోకి స్వల్ప మొత్తంలో పెట్టుబడులను తీసుకురాగా, రుణ(డెట్) మార్కెట్లలోకి మాత్రం పెద్ద ఎత్తున నిధుల ప్రవేశం జరిగింది. ఈ నెల 1-16 మధ్య స్టాక్ మార్కెట్లలోకి రూ. 4,022 కోట్ల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్లలోకి రూ. 18,821 కోట్ల పెట్టుబడులు వచ్చాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ రూ. 22,843 కోట్లుగా నమోదైంది. గత ఏడాది కాలంలో దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులను విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అవేంటో తెలుసుకుందాం.
1. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో...
మార్చిలో రికార్డు స్థాయిలో 57 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు పెట్టుబడులుగా పెట్టారు.
ఏప్రిల్లోనూ దాదాపు రూ. 23 వేల కోట్ల పెట్టుబడులను ఎఫ్పిఐలు తెచ్చారు. మే నెలలోనూ సుమారు రూ. 25 వేల కోట్ల వరకూ వచ్చాయి.
2. రుణ మార్కెట్లపై ఆసక్తి
మదుపర్లు స్టాక్ మార్కెట్ల కంటే కూడా రుణ మార్కెట్లలో పెట్టుబడులకు ఎఫ్పిఐలు అమితాసక్తిని కనబరుస్తుండటం విశేషం. కాగా, మే నెల మొదట్లో పెట్టుబడుల ఉపసంహరణకే పెద్దపీట వేసిన విదేశీ మదుపరులు.. రెండో వారం నుంచి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. 2019లో ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండేళ్లలో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు తెరతీస్తుందన్న విశ్వాసంతోనే విదేశీ మదుపరులు పెట్టుబడులను పెడుతున్నట్లు తెలుస్తోంది.
3. మార్చిలో 3 రెట్లు పెరిగిన విదేశీ పెట్టుబడులు
విశ్లేషించి చూస్తే వరుసగా నాలుగు నెలలు పెట్టుబడులను లాగేసుకున్న విదేశీ మదుపరులు.. ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్లలోకి రూ. 9,902 కోట్ల పెట్టుబడులను, రుణ మార్కెట్లలోకి మరో రూ. 5,960 కోట్ల పెట్టుబడులను తెచ్చారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లలోకి ఫిబ్రవరిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ రూ.15,862 కోట్లకు చేరింది. అయితే మార్చిలో ఈ విలువ 3 రెట్లకుపైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలోకి రూ. 31,327 కోట్లను తీసుకొచ్చిన ఎఫ్పిఐలు.. రుణ మార్కెట్లలోకి మరో రూ. 25,617 కోట్ల పెట్టుబడులను తెచ్చారు. ఫలితంగా మొత్తం మార్చి నెలలో దేశీయ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ రూ. 56,944 కోట్లకు చేరింది.
4. నికర పెట్టుబడులు రూ.49 వేల కోట్లు
ఏప్రిల్లో స్టాక్ మార్కెట్లలోకి రూ. 2,394 కోట్లపెట్టుబడులను తీసుకురాగా, రుణ మార్కెట్లలోకి రూ. 20,364 కోట్ల పట్టుకొచ్చారు. దీంతో మొత్తం రూ. 22,758 (3.5 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు వచ్చినట్లైంది. ఫలితంగా ఫిబ్రవరి-మే మధ్య వచ్చిన పెట్టుబడుల విలువ 1.33 లక్షల కోట్ల రూపాయల మార్కును చేరింది. మరోవైపు ఈ మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలోకి 56 వేల కోట్ల రూపాయలు రాగా, రుణ మార్కెట్ల నుంచి రూ. 7,000 కోట్లను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు రూ. 49వేల కోట్లుగానే ఉంది.
5. జనవరి నుంచి ఇప్పటిదాకా
ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా స్టాక్, రుణ మార్కెట్లలోకి 1.4 లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రావడం జరిగింది. అదే గతేడాది 2016లో భారతీయ మార్కెట్ల నుంచి 23,079 కోట్ల రూపాయల మేర విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకెళ్లారు.
6. పెద్ద నోట్ల రద్దు ప్రభావం
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం నవంబర్లోనే సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్లో దాదాపు 4 బిలియన్ డాలర్లు, అంతకుముందు అక్టోబర్లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
7. 4 నెలల కాలంలో
దీంతో 2016ఏడాది చివరి మూడు నెలల్లో భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోయిన ఎఫ్పిఐ పెట్టుబడుల విలువ 12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ సంవత్సరం జనవరిలోనూ 3,496 కోట్ల రూపాయలు వెనక్కిపోగా, జనవరి నుంచి ఏప్రిల్ మధ్య 4 నెలల కాలంలో 80,310 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయి.
8. 2016లో ఇలా...
నిరుడు జూలై-సెప్టెంబర్లో విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లలోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఇక జనవరి-జూన్లో స్టాక్ మార్కెట్లలోకి 20వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. ఇలా 2016 సంవత్సరం మొత్తంగా స్టాక్ మార్కెట్లలోకి 20,566 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,645 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.