కేజీ-డీ6లో వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్న ఆర్ఐఎల్
ఆంధ్రప్రదేశ్లోని కేజీ బేసిన్లో విపరీతమైన గ్యాస్ నిల్వలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీటి వెలికితీతకు ప్రయివేటు రంగం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇటీవల జరిగిన పరిణామాల మేరకు రిలయన్స
ఆంధ్రప్రదేశ్లోని కేజీ బేసిన్లో విపరీతమైన గ్యాస్ నిల్వలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీటి వెలికితీతకు ప్రయివేటు రంగం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇటీవల జరిగిన పరిణామాల మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటీష్ పెట్రలోలియం (బీపీ) ప్రైవేటు లిమిటెడ్ భాగస్వామ్యంతో తూర్పు తీరంలోని కేజీ బేసిన్లో 40 వేల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఈ మేరకు ఉభయ సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో గురువారం ముకేశ్ అంబానీ ప్రకటించారు.దానికి సంబంధించి మరిన్ని వివరాలివే...
ప్రభుత్వ విధానాల వల్లే పెట్టుబడులు
కేజీ డీ6 బ్లాక్లో అపారమైన సహజ వాయు నిల్వలు ఉన్నట్లు పరిశోధనల్లో బయటపెట్టారు. దేశంలో సహజ వాయువు నిల్వలకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యం కలిగిన ప్రదేశంలో బ్రిటీష్ పెట్రోలియం వ్యాపారానికి తెరతీసింది. ఇందులో మైనారిటీ వాటా తీసుకుని ఆర్ఐఎల్తో చేతులు కలిపింది. తద్వారా ఒక్కో రోజుకు 30-35 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను రిలయన్స్ వెలికితీస్తుంది. ఇది వచ్చే 7-8 ఏళ్ల పాటు కొనసాగగలదు. ప్రస్తుతం ప్రభుత్వ విధానాల కారణంగా కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సాధ్యమైనట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు.
జాయింట్ వెంచర్
ఉమ్మడి వెంచర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక పాత్ర పోషించనుంది. రిలయన్స్కు 60% వాటా ఉండగా; బ్రిటీష్ పెట్రోలియం 30% ఈక్విటీ వాటా కలిగి ఉంది. ఇప్పటికి తమ చేతుల్లోకి కొన్ని పనులు వచ్చినట్లు బ్రిటీష్ సంస్థ సీఈవో బాబ్ డుడ్లీ వెల్లడించారు. ఇప్పుడు అభివృద్ది చేయబోయే డీ-34 ఫీల్డ్ 2000 మీటర్ల లోతులో నీటిలో ఉంది. ఆఫ్షోర్లో 70 కి.మీల దూరంలో ఉందని డుడ్లీ అన్నారు. ఇకమీదట శాటిలైట్ ఫీల్డ్స్ లోనూ, డీ-55 ఫీల్డ్లో చేయబోయే పనులకు సంబంధించి అభివృద్ది ప్రణాళికలను తమ వెంచర్ సమర్పిస్తుందని డుడ్లీ చెప్పారు.
పెద్ద ఎత్తున ఆదాయం
2.65 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ సహజ వాయు నిల్వలు కేజీ-డీ6 బ్లాక్లో ఉన్నాయి. కాలంతో పాటు నిల్వలు తగ్గిపోతూ వచ్చినందున కృష్టా గోదావరి బేసిన్లో ఉత్పత్తి తగ్గిపోయింది. గతేడాది కేజీ-డీ6 చమురు బావుల్లో ఉత్పత్తి 29.4% తగ్గిన కారణంగా 2016మూడో త్రైమాసికంలో 24.4 బిలియన్ క్యూబిక్ ఫీట్ అవుట్పుట్ స్థాయి మాత్రమే సాధ్యమైంది.
తక్కువ ధరతో వెలికితీత కష్టం
హైడ్రో కార్బన్ ధరలు తగ్గుతున్న కారణంగా చమురు,సహజ వాయు విషయంలో పెట్టుబడులు తగ్గుతున్నాయి. నవంబరు 2014 నుంచి మన దేశంలో గ్యాస్ ధరలను మార్కెట్తో అనుసంధానించారు. కేజీ గ్యాస్ బేసిన్లో కేజీ-డీ6లో రిలయన్స్ ఇండస్ట్రీస్; ఇంకా ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ మొత్తంగా ఒక ఎంఎంబీటీయూకు 2.48 డాలర్ల వరకూ సంపాదిస్తున్నారు. లోతు నీళ్లలో ఉండే గ్యాస్ను 5.56 డాలర్ల ధరతో వెలికితీయడం కష్టమని షేర్ ఖాన్ బ్రోకరేజీ విశ్లేషకుడు అభిజిత్ బోరా అన్నారు.
దిగుమతులు తగ్గొచ్చు
కేజీ-డీ6లో మళ్లీ పెట్టుబడులు పెట్టిన కారణంగా వచ్చే 3-5 ఏళ్లలో దేశ చమురు,సహజవాయు దిగుమతులు తగ్గొచ్చు. 2022 నాటికి 20 బిలియన్ డాలర్ల ఖర్చు చేసే ఎల్ఎన్జీ దిగుమతుల అవసరం తగ్గి, విదేశాలపై ఆధారపడటం 10 శాతం తగ్గుతుందని బాబ్ డుడ్లీ చెప్పారు. వచ్చే ఏడాది కాలం క్రమంగా కేజీ-డీ6 కు సంబంధించి ఒక్కొక్క ప్రణాళికలను వెలువరిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. 2020 నాటికల్లా కేజీ-డీ6 బ్లాక్ ఉత్పత్తి ఫలితాలను ఇవ్వగలదని ముకేశ్ అంబానీ చెప్పారు.