జీఎస్టీ ఎఫెక్ట్: ఉత్పత్తులపై ఆఫర్లు
జులై 1 నుంచి పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ రానున్నందున వివిధ వస్తువుల రేట్లు మారనున్నాయి. జీఎస్టీ పన్ను రేటు ఎక్కువగా ఉండటంతో ఎలక్ట్రానిక్ వస్తువులు 10 నుంచి 15% పెరుగుతాయని పలు అంచనాలు వ
జులై 1 నుంచి పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ రానున్నందున వివిధ వస్తువుల రేట్లు మారనున్నాయి. జీఎస్టీ పన్ను రేటు ఎక్కువగా ఉండటంతో ఎలక్ట్రానిక్ వస్తువులు 10 నుంచి 15% పెరుగుతాయని పలు అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఆన్లైన్ రిటైలర్లు, నగరాల్లోని రిటైల్ స్టోర్లు తమ దగ్గర ఉన్న స్టాకును ఈ నెలాఖరుకే అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో చాలా రిటైల్ స్టోర్లు పోటీ పడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితం, లేదా ఫ్లాట్ డిస్కౌంట్ల పేరుతో పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు వంటి వాటిపై పలు చోట్ల ఆఫర్లు లభిస్తున్నాయి. వాటి గురించి మరిన్ని వివరాలు మీ కోసం...
పాదరక్షలు
ఈ విషయంలో బ్రాండెడ్ స్టోర్లదే హవా. లైఫ్ స్టైల్; షాపర్స్ స్టాప్ వంటి రిటైల్ అవుట్లెట్లు ఎంపిక చేసిన బ్రాండ్లపై 20 నుంచి 40 శాతం డిస్కౌంట్లకు తెరతీశాయి. కొన్ని ఉత్పత్తులపై 2 కొంటే 1 ఉచితం అని ప్రకటించాయి.
పాంటాలూన్స్ 'ప్రీ జీఎస్టీ ప్రివ్యూ సేల్ 'ను ప్రకటించడం ద్వారా జూన్ 16 నుంచి జూన్ 18 వరకూ ఆఫర్లను ఇస్తోంది. ఈ-వాలెట్లు, కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి రూ.6 వేల విలువ చేసే షాపింగ్ వోచర్లు వంటివి కూడా అందిస్తున్నది.
లైఫ్ స్టైల్ వారు వస్త్రాలకు సంబంధించి రెండు కొంటే ఒకటి ఉచితం అని చెబుతున్నారు. ప్యూమా, బాటా, ఓన్లీ, జాక్ అండ్ జోన్స్, లూయిస్ ఫిలిప్స్, వాన్ హూసెన్, బెనెటన్, యూఎస్ పోలో వంటి బ్రాండ్లన్నీ కస్టమర్లను రాయితీలతో ఆకట్టుకుంటున్నాయి.
ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీదారు శ్యామ్సంగ్ జూన్ ఫెస్ట్ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఉన్న పన్ను రేటు కంటే జీఎస్టీలో ఏసీ, రిఫ్రిజిరేటర్ల వంటి వాటిపై పన్ను రేటు ఎక్కువ ఉన్నందున కంపెనీ వస్తువుల రేట్లు పెరుగుతాయని అంటోంది. అందుకే టీవీ సెట్లపై ప్రస్తుతం రెండేళ్ల వారెంటీ, ఉచిత ఎయిర్టెల్ డీటీహెచ్ కనెక్షన్ వంటివి ఆఫర్ చేస్తున్నది.
మల్టీ బ్రాండ్ కన్సూమర్ రిటైల్ స్టోర్ విజయ్ సేల్స్ 25 నుంచి 30 శాతం రాయితీలను ఇస్తోంది. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి వాటిని తక్కువ ధరలకు కొనేందుకు వీలుంది.
ఆన్లైన్ రిటైలర్లు
జీఎస్టీ వచ్చే కంటే ముందే అమ్మకాల ద్వారా మంచి రాబడులు పొందాలని ఈ-కామర్స్ వెబ్సైట్లు సైతం ఆలోచిస్తున్నాయి. 'ప్రీ జీఎస్టీ సేల్' లో భాగంగా 500 బ్రాండ్లపై 6000 రిటైలర్ల ద్వారా ఒప్పంద కుదుర్చుకుంది. టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, డీఎస్ఎల్ఆర్ కెమెరాలు, ఫుట్వేర్ వంటి వాటిపై రాయితీలు, క్యాష్ బ్యాక్లను పేటీఎమ్ ప్రకటించింది. టైటాన్, టైమెక్స్, గిర్డానో వంటి కంపెనీల వాచీలపై 40 వరకూ రాయితీలను అందిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ జూన్ 10 నుంచి జూన్ 18 వరకూ 9 రోజుల పాటు ఫ్యాషన్ ఉత్పత్తులపై 9 రోజుల ఆఫర్ను నడుపుతోంది. దాదాపు 50 బ్రాండ్లు ఇందులో పాలు పంచుకుంటున్నాయి.
మోటర్ సైకిళ్లు
CT 100 నుంచి Dominar 400 వరకూ రూ. 4500 వరకూ తగ్గింపును ఇస్తున్నట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ తెలిపింది. మోటార్ సైకిళ్లపై జీఎస్టీ తర్వాత చాలా రాష్ట్రాల్లో వీటి ధరలు తగ్గనున్నప్పటికీ పన్ను కారణంగా ప్రయోజనాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మారుతున్నాయని బజాజ్ ఆటో అంచనా వేస్తోంది. రాష్ట్రాన్ని బట్టి, మోటార్ సైకిల్ మోడల్ను బట్టి ఇవి మారతాయి.
కార్ల విషయంలో
చాలా విలువైన కార్లు సైతం తక్కువ ధరలో వచ్చే విధంగా కార్ల కంపెనీలు రాయితీలను ప్రకటిస్తున్నాయి. లోకల్ అసెంబుల్డ్ కార్లు, ఎస్యూవీలపై మెర్సిడెస్ బెంజ్ రూ. 7.5 లక్షల వరకూ ఆఫర్ ప్రటించింది. మన దేశంలోనే తయారైన సీఎల్ఏ, జీఎల్ఏ, సీ-క్లాస్, ఈ-క్లాస్, ఎస్-క్లాస్, జీఎల్సీ, జీఎల్ఈ, జీఎల్ఎస్, మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 500 వంటి వాటిపై జీఎస్టీ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ దేశంలోని మూడు మోడళ్లపై రూ.4 లక్షల వరకూ ధరలను తగ్గించింది. ఆడి కార్లపై జూన్ 30 వరకూ రూ.10 లక్షల వరకూ రాయితీని ప్రకటించింది. కొత్తగా లాంచ్ చేసిన ఎమ్యూ-ఎక్స్, వీ-క్రాస్ వంటి వాటిపై ఇసుజు మోటార్స్ ఇండియా రూ.1.5 లక్షల వరకూ రాయితీలను ప్రకటించింది. ఫోర్డ్ ఇండియా సైతం జీఎస్టీ ఆఫర్ల వేటలో పడింది. ఎకో స్పోర్ట్, ఫిగో, సెడాన్ యాస్పైర్ వంటి వాటిపై రూ.30 వేల ఆఫర్ను ప్రకటించింది.
ఎక్స్ షోరూం ధరలపై బీఎండబ్ల్యూ 12% వరకూ తగ్గింపును ఆఫర్ చేస్తోంది.