ట్రంప్ విధానాలతో మాకు ఇబ్బందే:విప్రో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు వినాశకరమని, అవి వ్యాపారాలను దెబ్బ తీస్తాయని ఐటి దిగ్గజం విప్రో ప్రకటించింది. స్వేచ్ఛా వాణిజ్యానికి మోకాలడ్డడం తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. రాజకీయ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు వినాశకరమని, అవి వ్యాపారాలను దెబ్బ తీస్తాయని ఐటి దిగ్గజం విప్రో ప్రకటించింది. స్వేచ్ఛా వాణిజ్యానికి మోకాలడ్డడం తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. రాజకీయ అనిశ్చితి మొదలుకొని, భారత్,అమెరికా, ఇతర దేశాలలో నిబంధనల మార్పు కారణంగా తమ సంస్థపై ఎలాంటి ప్రభావం ఉండగలదో విప్రో వివరించింది.
అమెరికా నుంచే 52%
బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న విప్రో ఐటి విభాగం ఆదాయాల్లో 52 శాతం అమెరికా కార్యకలాపాల నుంచే వస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి నెలకొన్న పరిణామాలు తమ వ్యాపారాలపై భారీ స్థాయిలోనే ప్రతికూల ప్రభావం చూపవచ్చునని అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఇసికి పంపిన ప్రకటనలో విప్రో తెలిపింది.
క్లయింట్ల వ్యయం విషయంలో
అలాగే అమెరికా, యూర్పలలో అస్థిర పరిస్థితులు కొనసాగి ఆర్థిక మార్కెట్లు మరింతగా క్షీణించినట్టయితే తమ సేవలపై నిర్ణయించిన ధరలు ఆకర్షణీయం కాకపోవచ్చునని కూడా పేర్కొంది. అలాగే ఆయా దేశాల్లోని తమ క్లయింట్లు టెక్నాలజీపై చేసే వ్యయాలను తగ్గించడం లేదా వాయిదా వేయడానికి అవకాశం ఉందని, ఇది కూడా వ్యాపారాలను దెబ్బ తీస్తుందని విప్రో ఆ ప్రకటనలో వెల్లడించింది.
రాజకీయ అనిశ్చితి సైతం దెబ్బతీస్తుంది
అయితే భారత్లోను, తాము కార్యకలాపాలు సాగిస్తున్న ఇతర దేశాల్లోను కూడా రాజకీయ అస్థిరతలు, నియంత్రణాపరమైన మార్పుల వంటివి తమ చేతిలో లేని పరిణామాలని తెలియచేసింది. ట్రంప్ యంత్రాంగం స్వేచ్ఛా వాణిజ్యంపై కఠిన ఆంక్షలు విధించడంతో పాటు అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు భారీగా పెంచేసిందని వివరించింది.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత
అమెరికాలో సామాజిక, రాజకీయ, నియంత్రణాపరమైన అంశాల్లో పరిస్థితులు హఠాత్తుగా మారడం, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు, విధానాల్లో మార్పులు వ్యాపారాలను బాగా దెబ్బ తీస్తాయని విప్రో తెలిపింది. ఈ ఏడాది జనవరి 20వ తేదీన అధికారంలోకి వచ్చిన ట్రంప్ హెచ్1బి వీసాలను సమీక్షించాలంటూ ఏప్రిల్లో కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు.
స్థానిక నియామకాలకే ప్రాధాన్యత
దీనిపై భారత ఐటి రంగం అప్పుడే తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. అమెరికాలో తాము ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టిన కారణంగా వ్యాపారాలు ప్రభావితం కాకుండా చూసుకునేందుకు తాము స్థానికులను అధిక సంఖ్యలో నియమించుకుంటామని విప్రో ఏప్రిల్లో ప్రకటించింది. ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.