జీఎస్టీ తర్వాత వస్తు, సేవల రేట్లు ఎలా మారతాయి...
దేశంలో ఇప్పటి వరకూ ఉన్న పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ అమలవుతుంది. దాదాపు జులై 1 నుంచి అమలయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాని గురించి 10 ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
జీఎస్టీ(gst)
దేశంలో ఇప్పటి వరకూ ఉన్న పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ అమలవుతుంది. దాదాపు జులై 1 నుంచి అమలయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాని గురించి 10 ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
1. ఒకే దేశం, ఒకే పన్ను
ఇంతకుముందు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వస్తువుపై పన్ను రేటు ఒక్కో విధంగా ఉండేది. ఒకసారి జీఎస్టీ వస్తే ఇందులో ఏకరూపత వస్తుంది. జీఎస్టీ పన్ను రేటు ఒకేలా ఉన్న వసూలు విధానం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు పన్ను వసూలు మూడు నియంత్రణ వ్యవస్థల ద్వారా జరుగుతుంది. అందులో ప్రధానమైంది సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ). ఇక మిగిలిన రెండు వ్యవస్థలు స్టేట్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ.
2. జీఎస్టీ వసూలు ఎలా?
వస్తు, సేవల అమ్మకాలపై జీఎస్టీ అమలవుతుంది. ఇంతకుముందు అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వస్తు,సేవలు అన్నీ వ్యవస్థలోకి వచ్చి సేవా రంగం పరిధి పెరుగుతుంది. పన్ను వసూళ్లు పెరుగుతాయని పరిశ్రమల సమాఖ్యలు అంచనా వేస్తున్నాయి. ఒక్కోసారి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సరఫరా అనేది వస్తు ప్రమేయం లేకుండా జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి నుంచి అద్దెకు ఏదైనా వస్తువు తీసుకున్నారు. అందులో అందరికీ అర్థమయ్యే ఉదాహరణ ఇంటి అద్దె. ఇంటి అద్దెను చాలా మంది ఆదాయంగా చూపించే పరిస్థితి లేదు. అలాగే కార్యాలయాల అద్దె. ఇతర వస్తు,సేవలను కొంచెం మూల్యానికి వాడుకోవడం. కానీ జీఎస్టీ చెల్లింపు విషయంలో ఎక్కడ వ్యాపారం జరిగితే అక్కడ పన్ను వర్తింపు ఉండేలా చూస్తున్నారు.
3. వస్తు, సేవ సరఫరా
అంతిమ సేవ, వస్తు అమ్మకం, విక్రయం లేదా వినిమయం ఎక్కడ జరిగితే అక్కడ పన్ను ఉండేలా జీఎస్టీని రూపొందించారు. దేశం లోపల జరిగే ప్రతి వస్తు, సేవ పన్ను పరిధిలోకి వస్తుంది. ఇంతకుముందు అంతరాష్ట్ర సరఫరాల మధ్య చాలా తేడాలు ఉండేవి. వాటిపై పన్ను నిర్ణయాధికారంలో బేదాభిప్రాయాలు ఉండేందుకు అవకాశం ఉండేది. కానీ జీఎస్టీ వచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణ ప్రకారం నిర్ణయించిన రేట్లు అమలవ్వాల్సిందేనని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.
4. నాలుగంచెల పన్ను వ్యవస్థ
జీఎస్టీ మండలి సూచించిన దాని ప్రకారం నాలుగంచెల పన్ను వ్యవస్థ కేంద్రం అమలు చేస్తుంది. ఇందులో 5%, 12%, 18%, 28% పన్నులు ఉంటాయి. మరికొన్ని వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించారు. కొన్ని వస్తువులకు చాలా తక్కువ జీఎస్టీ ఉండేలా చూశారు. విలాసవంతమైన వస్తువులకు అత్యధిక జీఎస్టీ పన్ను విధించగా, నిత్యావసరాల విషయంలో కాస్త కరుణ చూపారు. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు తప్పేలా లేదు. ఎందుకంటే ఇంతకుముందు స్వచ్చభారత్ సెస్సు, కృషి కల్యాణ్ సెస్సు అంటూ సేవా పన్నును 15% దాటించేశారు. అదే జీఎస్టీలో అంతిమంగా సేవా పన్ను 18% వరకూ ఉండేలా ఉంది.
5.ఏ పన్నుల స్థానంలో జీఎస్టీ
... జీఎస్టీ రాకతో రద్దయ్యేవి ...
కేంద్రం విధిస్తున్న వాటిలో
కేంద్ర ఎక్సైజ్ సుంకం
ఎక్సైజ్ సుంకాలు(ఔషధాలు, సౌందర్య సాధనాలు)
అదనపు ఎక్సైజ్ సుంకాలు(ప్రత్యేక ప్రాముఖ్యం కలిగిన ఉత్పత్తులు)
అదనపు ఎక్సైజ్ సుంకాలు(జౌళి మరియు జౌళి ఉత్పత్తులు)
అదనపు కస్టమ్స్ సుంకాలు(వీటిని సీవీడీగా వ్యవహరిస్తుంటారు)
ప్రత్యేక అదనపు కస్టమ్స్ సుంకం(ఎస్ఏడీ)
సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్)
వస్తు,సేవలపై కేంద్ర సర్చార్జీలు, సెస్సులు
* జీఎస్టీ వల్ల రద్దయ్యే రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు *
విలువ ఆధారిత పన్ను(వ్యాట్) రాష్ట్ర సుంకం
కేంద్ర అమ్మకం పన్ను(సెంట్రల్ సేల్స్ ట్యాక్స్)
విలాస సుంకం(లగ్జరీ ట్యాక్స్)
ప్రవేశ సుంకం (అన్ని రూపాల్లో)
వినోదం, ఉల్లాసపు పన్ను(స్థానిక సంస్థలు విధించేది మినహా)
ప్రకటనలపై విధించే పన్ను
కొనుగోలు సుంకం
లాటరీలు, పందేలు, జూదంపై విధించే సుంకం
6. అంతిమ వినియోగదారుడికి అన్ని నష్టాలేనా? ప్రయోజనాలు ఉన్నాయా?
మనం సామాన్యులుగా ఆలోచించే పన్ను ఆదాయపు పన్ను, అప్పుడప్పుడు సేవా పన్ను గురించి. తయారీ మొదలుకొని వస్తు,సేవల అమ్మకాల దశ వరకూ మనం పన్ను మీద పన్ను కడుతూనే ఉంటాం. అయితే మనకు తెలియదు. జీఎస్టీ ఒక పారదర్శకత పన్ను వ్యవస్థను తీసుకువస్తుంది. ఇలా ఎందుకు చెబుతున్నారంటే ప్రతి దశలోనూ వస్తు,సేవ చేతులు మారేముందు ఒక వ్యక్తి, సంస్థ చెల్లించే పన్ను ఎంతో అందరికీ తెలిసే వ్యవస్థను ఏర్పరిచారు. ఈ ప్రభావం కారణంగా కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి.
7. వస్తు, సేవల ధరలు పెరిగేవి, తగ్గేవి
రేట్లు పెరిగేవి ఇవే
సిగరెట్లు
ట్రక్కుల లాంటి వాణిజ్య వాహనాలు
సెల్ఫోన్లు, జువెలరీ
రేట్లు తగ్గేవి ఇవే
కార్లు, బైకులు
పెయింట్లు, సిమెంట్
మూవీ టిక్కెట్లు
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు
8. స్వల్పకాలంలో ఉండే ప్రభావం
షార్ట్ టర్మ్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఎంతో మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినిమా టిక్కెట్ల ధరలు పెరగగలవని అందరూ అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా ప్రాథమిక సేవలైన వినోదం, రెస్టారెంట్లు ప్రియం అవ్వగలవు. ప్రభుత్వాలకు ఎక్కువ పన్ను సంక్రమించే రియల్ ఎస్టేట్, పెట్రోలియం, మద్యం వంటి వాటిని జీఎస్టీ నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గళమెత్తారు. మే 29న ఆయన దీనిపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు లిక్కర్, స్థిరాస్తి వ్యాపారాల్లో ఉన్న కారణంగానే వాటిని జీఎస్టీకి ఆవల ఉంచారని ఆరోపించారు.
9.పరిశ్రమ వర్గాలపై ఉండే ప్రభావం
దేశంలో ప్రభుత్వాలు మారితే పన్ను వ్యవస్థలను, చట్టాలను ఎలా మారుస్తారో అని ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ రావడం ఒక విధంగా మంచిదే. దేశంలో వ్యాపారం చేసుకునే విషయంలో ఒక సానుకూలత ఏర్పడుతుంది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్, చెల్లింపు వంటివి మొత్తంగా ఆన్లైన్ అవుతాయి. దీంతో ఇవి సులభతరం అవ్వడమే కాక పారదర్శకత సైతం ఉంటుంది.
10. ద్రవ్యోల్బణం విషయంలో జీఎస్టీ
ప్రారంభ దశల్లో జీఎస్టీ అమలు కారణంగా దేశంలో పన్ను రేట్లు ఎక్కువగానే ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తారు. అంతే కాకుండా ఆర్థిక వృద్ది 1 నుంచి 2 శాతం పెరగడం అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మంచిదవుతుంది. అయితే ఇది సామాన్యుడికి ఎంత మేలు చేకూరుస్తుందో అమలు తర్వాతే చూడాలి.