ఎఫ్ఐపీబీ రద్దుకు కేబినెట్ ఆమోదం
పాతికేళ్ల చరిత్ర కలిగిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకాల బోర్డు(ఎఫ్ఐపీబీ) రద్దు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదిరకూ దేశంలో వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) ప్రతిపాదనలకు ఎఫ్
పాతికేళ్ల చరిత్ర కలిగిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకాల బోర్డు(ఎఫ్ఐపీబీ) రద్దు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదిరకూ దేశంలో వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) ప్రతిపాదనలకు ఎఫ్ఐపీబీ ఆమోదముద్ర వేస్తూ వస్తోంది. ఇందులో వివిధ రంగాల్లో అనుభవం కలిగిన సీనియర్ అధికారులు పనిచేస్తారు. ఆర్థిక వ్యవహారాల విభాగం పర్యవేక్షణలో పనిచేసే ఎఫ్ఐపీబీని రద్దు చేయనున్నట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గం బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇకపై విదేశీ పెట్టుబడులకు సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖలే నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది.
సున్నితమైన రంగాల్లో ఎఫ్డీఐలను అనుమతించేదానిపై హోంమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 1990 దశకంలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ఎఫ్ఐపీబీని ఏర్పాటుచేశారు. రక్షణ, రిటైల్ ట్రేడింగ్లతోపాటు మరో తొమ్మిది రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిపై ఎఫ్ఐపీబీ నిర్ణయం తీసుకుంటుంది. రూ.5 వేల కోట్ల కంటే అధిక ఎఫ్డీఐలపై ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనుమతించనున్నది.