జీఎస్టీ తుది రేట్లను ఖరారు చేస్తున్న జీఎస్టీ కౌన్సిల్
జనాలు ఎక్కువగా వినియోగించే వాటిపై పన్నులు తగ్గించారు. ఆహార ధాన్యాలు, బెల్లంను లెవీ పరిధి నుంచి పూర్తిగా మినహాయించారు. చక్కెర, టీ, వంటనూనెలపై కనిష్ట స్థాయిలో ఐదుశాతం మాత్రమే పన్ను ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని అనుకుంటున్న వస్తు సేవల పన్ను (జిఎస్టి) పరిధిలోకి వచ్చే 90శాతం వస్తువుల రేట్లపై తుది నిర్ణయం తీసుకుంది. జనాలు ఎక్కువగా వినియోగించే వాటిపై పన్నులు తగ్గించారు. ఆహార ధాన్యాలు, బెల్లంను లెవీ పరిధి నుంచి పూర్తిగా మినహాయించారు. చక్కెర, టీ, వంటనూనెలపై కనిష్ట స్థాయిలో ఐదుశాతం మాత్రమే పన్ను ఉంటుంది.కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానల్ దాదాపు 1200 వస్తువుల రేట్లు ఖరారు చేసింది. వివిధ వస్తువులకు సంబంధించి కేంద్రం నిర్ణయించిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
ఆరు వస్తువులను మినహాయించి
అత్యవసర, నిత్యావసర వస్తువులను తక్కువ పరిధి పన్నుల జాబితాలో చేర్చాలని కొన్ని రాష్ట్రాలు ఈ సందర్భంగా పట్టుబట్టాయి. కేవలం ఆరు వస్తువులు మినహా అన్నింటిపైనా జిఎస్టి రేట్లను నిర్ణయించామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. వీటిల్లో పాలు, పెరుగు, తృణ ధాన్యాలు,ప్రచురించిన పుస్తకాలు, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు ఉన్నాయి. ప్రజలు నిత్యం వినియోగించే వస్తువులపై పన్నులు తక్కువగా ఉండేలా చూడటం ద్వారా వీటి రేట్లను అందరికీ అందుబాటులో ఉండాలన్న దానిపై తాము దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు.
అతి తక్కువ పన్ను వీటిపైనే
పంచదార, టీపొడి, కాఫీ పొడి, వంటనూనెపై 5శాతం పన్ను విధించనున్నారు. మిఠాయిలు, స్వీట్లు సైతం 5 శాతం పన్ను పరిధిలో ఉండనున్నాయి. బొగ్గుపై పన్ను ప్రస్తుతం ఉన్న 11.69% నుంచి 5 శాతానికి తగ్గించారు. 5 శాతం పన్ను వర్తించే అంశాలు మొత్తం 14గా ఉండనున్నాయి. తుది జాబితా శుక్రవారం ఖరారయ్యే అవకాశం ఉంది.
18 శాతం
మిఠాయి, వంటనూనెలు, కాఫీ, టీ తదితర వస్తువులపై ఐదు శాతం జిఎస్టినే విధించామని, తలనూనెలు, టూత్పేస్ట్, సబ్బులు మొదలైన వాటిపై 18శాతం పన్ను ఉంటుందని చెప్పారు. అలాగే మూలధన వస్తువులు, పారిశ్రమలకు సంబంధించిన వాటిపైనా ఇదే స్థాయిలో పన్ను అమలులోకి వస్తుందన్నారు.
కార్లు, ఏసీలు వంటి వాటిపై 28 శాతం
అయితే కార్లు, ఏసీలు, ఫ్రిజ్లు సహా కొన్ని రకాల వినియోగ వస్తువులపై 28శాతం, లగ్జరీ వాహనాలపై సుంకంతో పాటు 15శాతం పన్ను అమలు చేయాలని ఈ సమావేశం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రకమైన వాటిపై 30 నుంచి 31శాతం మేర పన్నులు వసూలు చేస్తున్నందున జిఎస్టి అమలులోకి వచ్చిన వెంటనే వీటి రేట్లు తగ్గుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా సాఫ్ట్ డ్రింక్లను సైతం 28% కేటగిరీలో చేర్చారు.
జులై 1 నుంచి ఏకీకృత పన్ను విధానం
అయితే ఏ వస్తువుపైనా పన్ను పెరుగలేదని, మొత్తం మీద అన్ని రకాల వస్తువుల రేట్లూ తగ్గేందుకు ఈ కొత్త ఏకీకృత పన్నుల విధానం దోహదం చేస్తుందని జైట్లీ వివరించారు. కాగా, మొత్తం 1211 వస్తువుల్లో 7శాతం వస్తువుల్ని మినహాయించామని, 15శాతం వస్తువులు 5శాతం పన్నుల పరిధిలోకి వస్తాయని, 17శాతం వస్తువులు 12శాతం, 43శాతం వస్తువులు 18శాతం, కేవలం 19శాతం వస్తువులు 28శాతం పన్నుల పరిధిలోకి వస్తాయని రెవిన్యూ కార్యదర్శి హష్ముఖ్ ఆధియా తెలిపారు.