దేశీయ మార్కెట్లు 1 శాతానికి పైగా లాభాల్లో
ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన ట్రేడింగ్ దేశీయంగా నెలకొన్న సానుకూల సెంటిమెంటుతో చివరికి మదుపర్లకు లాభాలను తెచ్చి పెట్టింది. గతవారం ఒడిదుడుకులకు ఎదురైన మార్కెట్లు సోమవారం హెచ్డీఎఫ్సీ, సిమె
ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన ట్రేడింగ్ దేశీయంగా నెలకొన్న సానుకూల సెంటిమెంటుతో చివరికి మదుపర్లకు లాభాలను తెచ్చి పెట్టింది. గతవారం ఒడిదుడుకులకు ఎదురైన మార్కెట్లు సోమవారం హెచ్డీఎఫ్సీ, సిమెంట్ కంపెనీల ఫలితాల ప్రభావంతో జోష్గా కొనసాగింది. అంతే కాకుండా ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో మార్కెట్ అనుకూలుడైన ఎమ్మాన్యుల్ మార్కోన్ మొదటి రౌండులో ఆధిక్యం కొనసాగించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. అది కూడా ఆసియా మార్కెట్లకు కలిసొచ్చింది. ఇలాంటి కారణాల రీత్యా దేశీయ మార్కెట్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. మరిన్ని పరిణామాలు మీ కోసం...
290 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
మొత్తానికి మార్కెట్లు ముగిసే సరికి 290.54 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 29,655.84 వద్ద స్థిరపడగా; నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 9218 వద్ద ముగిసింది. వారంలో మొదటి రోజే సెన్సెక్స్ 29,500 పాయింట్లను అధిగమించి నిలవగా.. నిఫ్టీ 9,200కు ఎగువన స్థిరపడింది. మార్చి 14 తర్వాత రెండు సూచీలకు ఇదే ఒక రోజు గరిష్ట లాభం కావడం విశేషం.
రంగాల వారీగా చూస్తే
హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ , రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(+3.02%), క్యాపిటల్ గూడ్స్(1.66%), బ్యాంకింగ్(1.27%), ఆటో(1.20%), పరిశ్రమలు(1.32%), ఆర్థికం(1.43%) అధికంగా లాభపడ్డాయి.
సెన్సెక్స్లో లాభపడినవి-నష్టపోయినవి
సెన్సెక్స్లో గెయిల్(+3.17%), యాక్సిస్ బ్యాంకు(+2.55%), ఎల్ అండ్ టీ(+2.54%), హెచ్ డీఎఫ్సీ బ్యాంకు(2.41%), మారుతి(1.82%) ఎక్కువ లాభపడిన వాటిలో ఉండగా; నష్టపోయిన వాటిలో లుపిన్(-3.3%), సిప్లా,ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, విప్రో ఉన్నాయి.
నిఫ్టీ స్టాక్స్ లో ఎక్కువగా లాభాలార్జించిన కంపెనీగా ఏసీసీ నిలిచింది. ఈ కంపెనీ స్టాక్ 7.5 శాతం మేర దూసుకెళ్లింది. ఆల్ట్రా టెక్ సిమెంట్, గ్రాసిమ్, గెయిల్, అంబుజా సిమెంట్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీలు కూడా లాభాలు పండించాయి. మరోవైపు ఫార్మా దిగ్గజం లుపిన్ స్టాక్ 3.33 శాతం మేర పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు పాలైన ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు, చివర్లో కొంతమేర కోలుకున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 64.46 వద్ద ముగిసింది.
కొనసాగిన ఎఫ్ఐఐల అమ్మకాలు
ఉత్తరకొరియా, అమెరికా మధ్య యుద్ధ సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న కారణంగా ఇటీవల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీయ స్టాక్స్లో అమ్మకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత 8 ట్రేడింగ్ సెషన్లుగా అమ్మకాల యూటర్న్ తీసుకున్న ఎఫ్పీఐలు శుక్రవారం మరోసారి దాదాపు రూ. 978 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో నగదు విభాగంలో గత వారం మొత్తంగా ఎఫ్పీఐలు దాదాపు రూ. 3,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించినట్లయ్యింది. కాగా.. గత మూడు రోజుల్లో రూ. 1400 కోట్లను ఇన్వెస్ట్ చేసిన దేశీ ఫండ్స్ శుక్రవారం మరింత అధికంగా రూ. 1,132 కోట్ల విలువైన షేర్లనుకొనుగోలు చేయడం ప్రస్తావనార్హం.