ఏడేళ్ల తర్వాత ఎఫ్పీఐలను మించిన దేశ పెట్టుబడులు
దేశీయ పెట్టుబడులు ఎఫ్పీఐలను మించేందుకు ప్రధానంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) పథకాలు, నేషనల్ పెన్షన్ పథకాలు(ఎన్పీఎస్), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్వో) తదితర పెట్టుబడులు
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ముగిసిన తర్వాత నుంచి భారత స్టాక్ మార్కెట్లలో రికార్డు స్థాయి నిధులతో పాటు దేశీయ పెట్టుబడిదార్ల హవా కొనసాగుతోంది. దేశీ ఇన్వెస్టర్లలో ఎల్ఐసీ వంటి బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్లకు స్థానముండగా.. గత రెండేళ్లుగా పెట్టుబడులు జోరందుకున్నాయి. దీంతో 2016, 2017 ఆర్థిక సంవత్సరాల్లో భారత ఈక్విటీల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడులను దేశీ పెట్టుబడులు మించిపోయాయి. స్టాక్స్లో ఈ స్థాయి పెట్టుబడులు ఇది గత ఏడేళ్లలో తొలిసారికావడం విశేషం! దీని గురించి మరిన్ని ఆసక్తికర అంశాలు...
విదేశీ ఫండ్స్ చేతిలో వాటాను దాటేశాం
2017 మార్చి చివరి నాటికి బీఎస్ఈ-200 షేర్లలో ఉన్న మొత్తం నిధుల్లో విదేశీ ఇన్వెస్టర్ల చేతిలో ఉన్న వాటాలను దేశీ పెట్టుబడులు(డొమస్టిక్ మనీ) భారీగా మించిపోయాయి. విదేశీ ఫండ్స్ చేతిలో వాటాల విలువ 303 బిలియన్ డాలర్లుకాగా.. దేశీ ఫండ్స్ పెట్టుబడుల విలువ 323 బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం. ఇది దేశంలో పెట్టుబడిదార్లందరికీ జోష్నిచ్చే విషయం. గత 24 నెలల కాలంలో చూస్తే దేశీయ ఫండ్లు 16 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టాయి. ఇదే సమయంలో విదేశీ ఫండ్స్ 6 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ మాత్రమే కొనుగోలు చేశాయి.
ఏడేళ్ల తరువాత
2010 అక్టోబర్ తరువాత మళ్లీ దేశీ ఫండ్స్ మార్కెట్లను ఆదుకుంటూ వస్తున్నాయి. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు పలు సందర్భాల్లో అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడుతుండగా.. దేశీ ఫండ్స్ నిరంతర పెట్టుబడుల ద్వారా అండగా నిలుస్తూ వస్తున్నాయి. తద్వారా దేశీ స్టాక్ మార్కెట్లకు గత కొంతకాలంగా నిలకడ వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందువల్లనే 2016 డిసెంబర్ క్వార్టర్లో ఎఫ్పీఐలు 4.5 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ విక్రయించినప్పటికీ మార్కెట్లు నిలదొక్కుకోగలిగాయని తెలియజేశారు.
ఈ స్థాయి పెట్టుబడులకు అవే కారణం
దేశీయ పెట్టుబడులు ఎఫ్పీఐలను మించేందుకు ప్రధానంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) పథకాలు, నేషనల్ పెన్షన్ పథకాలు(ఎన్పీఎస్), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్వో) తదితర పెట్టుబడులు కారణమవుతున్నట్లు ప్రస్తావించారు. గత రెండేళ్లలో ఏడాదికి 12.5 బిలియన్ డాలర్ల చొప్పున మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు రాసాగాయి. దీంతో ఈక్విటీలలో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 44 శాతం వృద్ధితో 94 బిలియన్ డాలర్లకు ఎగశాయి. 2014లో ఇవి 31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఎఫ్పీఐలు పెరిగేందుకు ఇవీ కారణం
రాజ్యసభలోనూ మెజారిటీ సాధించే దిశగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుకు వీలుగా నాలుగు బిల్లులను పార్లమెంట్ ఆమోదించడం, ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ఆశావహ అంచనాలు వంటి అంశాలు ఎఫ్పీఐలకు జోష్నిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులను తోసిరాజని దేశంలోని సానుకూల అంశాలు ఇన్వెస్టర్ల నమ్మకాలను పెంచుతున్నాయి.
విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులంటే
దేశంలో విదేశీ మూలధనం వచ్చేందుకు ఉపయోగపడే వాటిలో ఎఫ్డీఐలు, ఎఫ్పీఐలు కీలక పాత్ర పోషిస్తాయి. విదేశీ పెట్టుబడిదారులు వివిధ పెట్టుబడి సాధనాల రూపంలో మన దేశంలోకి డబ్బు తరలించడాన్ని విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటారు. కంపెనీల విషయంలో మొత్తం పెయిడప్ క్యాపిటల్లో 10 శాతాన్ని మించకుండా కంపెనీ షేర్లలో పెట్టే పెట్టుబడిని సెబీ ఎఫ్పీఐగా పరిగణిస్తుంది. ఈ పెట్టుబడులను ప్రధానంగా షేర్లలో,బాండ్లలో,డిబెంచర్లలో ఉంచుతారు.