ఆధార్ పే చెల్లింపు వ్యవస్థను ప్రారంభించిన మోదీ
క్షణాల్లో ఆధార్ ఆధారిత చెల్లింపులను పూర్తిచేయవచ్చు. పౌరులెవరైనా స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్, కార్డులు ఎటువంటి సాయం లేకుండా డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ఇది ఉపయోగపడగలదు. తద్వారా అంబేద్కర
ప్రధానమంత్రి ఈ రోజు అంబేద్కర్కు సంబంధించి చాలా పవిత్ర స్థలమైన దీక్షాభూమిని సందర్శించారు. అక్టోబర్ 14,1956న అదే స్థలంలో బౌద్ద మతాన్ని స్వీకరించారు. ఈ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ప్రధాని ఈ రోజు అక్కడ డిజిటల్ మేలాను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పలు ముఖ్యాంశాలు మీ కోసం..
భీమ్-ఆధార్ సేవల ప్రారంభం
డిజిటల్ మేళాలో భాగంగా కొత్త భీమ్-ఆధార్ సేవలను ప్రారంభించారు. అంబేద్కర్కు ప్రధాని అర్పించిన నివాళే భీమ్ యాప్. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఎన్నో కచ్చితమైన హక్కులను భారత ప్రజలకు అందించారని పీఎమ్ ఈ సందర్భంగా చెప్పారు. పేద ప్రజల బాగు కోసం మనమంతా కలిసి పనిచేసి 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చూడాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పాదుకొల్పేలా...
21 వ శతాబ్దంలో సమాచారం రాజ్యమేలుతుంది. డిజిధన్ ద్వారా పేద ప్రజలను స్వావలంబన లభించగలదు. ప్రజలందరూ నగదు రహితంగా మారాలని మోదీ కోరారు. డిజిటల్ మనీ ద్వారా పేద ప్రజలకు లబ్ది చేకూరగలదు.
భీమ్ యాప్ విదేశీ విశ్వవిద్యాలయాలకు కేస్ స్టడీ కాగలదు...
ప్రధాని ఏటీఎమ్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు. ఏటీఎమ్ల నిర్వహణ కోసం అందులో డబ్బు పెట్టేందుకు ప్రభుత్వం చేసే ఖర్చు గురించి ప్రస్తావించారు. భవిష్యత్తులో భీమ్ యాప్ విదేశీ విశ్వవిద్యాలయాల్లో కేస్ స్టడీ అవుతుందని ప్రధాని జోస్యం చెప్పారు. మీరు ఎవరైనా భీమ్ యాప్ను ఎలా వాడుకోవాలో నేర్పిస్తే మీకు రూ.10 వస్తుందని అన్నారు.
ఆధార్ పే
నీతి ఆయోగ్ ప్రకటన ప్రకారం భీమ్-ఆధార్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో వ్యాపారులకు ఇది ఒక సులభతర పద్దతి అవుతుంది. వ్యాపారుల దగ్గర ఉండే బయోమెట్రిక్ పరికరంలో బయోమెట్రిక్ సమాచారం(ఉదా:బొటనవేలు) ద్వారా క్షణాల్లో ఆధార్ ఆధారిత చెల్లింపులను పూర్తిచేయవచ్చు. పౌరులెవరైనా స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్, కార్డులు ఎటువంటి సాయం లేకుండా డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ఇది ఉపయోగపడగలదు. తద్వారా అంబేద్కర్ కల అయిన ఆర్థిక,సామాజిక స్వావలంబన సాధ్యమవుతుందని ప్రకటనలో వెల్లడించారు.
ఆధార్ పే అంటే ఏమిటి?
ఆధార్ పే అనేది వ్యాపారుల చెల్లింపులకు సంబంధించిన ఆధార్ ఆధారంగా జరిగే చెల్లింపుల వ్యవస్థ. ఎవరికైతే డెబిట్ కార్డులు ఉండవో, మొబైల్ వాలెట్ల వాడకం రాదో వారందరికీ ఇది ప్రయోజనం కలిగిస్తుంది. అంతే కాకుండా ప్రస్తుతం మాస్టర్ కార్డ్, వీసాలు విధిస్తున్న చెల్లింపులకు సంబంధించిన రుసుముల బెడద లేకుండా ఉచితంగా ఈ యాప్ను వాడుకోవచ్చు. అంటే ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఉండదు.
ఆధార్ పే యాప్ను ఎలా ఉపయోగించాలి?
ఇది వ్యాపారుల కోసం ఉద్దేశించిన చెల్లింపుల వ్యవస్థ. మొదట వ్యాపారులు స్మార్ట్ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని బయోమెట్రిక్ యంత్రానికి అనుసంధానం చేయాలి. వినియోగదారుల నుంచి యంత్రంలో వేలిముద్రలు తీసుకుని చెల్లింపులను స్వీకరించవచ్చు. అయితే వ్యాపారులు ఈ యాప్లలో నమోదయి తమ బ్యాంకు ఖాతాను ఇందులో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
భద్రత
నీతి ఆయోగ్ ఇస్తున్న ప్రకటనల ప్రకారం ఆధార్ పే ఒక భద్రమైన,సురక్షితమైన యాప్. దీన్ని ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్(ఏపీబీ), ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) అని రెండు ప్లాట్ఫాంలలో వాడతారు. ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్(ఏపీబీ) అనేది బ్యాంకులకు, ఖాతాదారులకు అనుసంధానకర్త. ఆన్లైన్ చెల్లింపులను సులువుగా చేసేందుకు ఏఈపీఎస్ సహకరిస్తుంది. దీనిని ఎన్పీసీఐ నిర్వహిస్తుంది.
వినియోగదారుల కోసం ఇలా...
వినియోగదారుల ద్వారా చెల్లింపులను స్వీకరించాలంటే ఇలా చేయాలి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఆధార్ పే యాప్, బయోమెట్రిక్ స్కానర్ యాప్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకదానితో మరొకదాన్ని అనుసంధానం చేయాలి. వినియోగదారుడు లావాదేవీ జరపడానికి వచ్చినప్పుడు వ్యక్తి ఆధార్ సంఖ్యను యాప్లో నమోదు చేసి బయోమెట్రిక్ స్కానర్లో సదరు వ్యక్తి వేలిముద్రను తీసుకోవాలి. కేవలం కొనుగోళ్లను జరపడానికి మాత్రమే ఆధార్ పే ఉపయోగపడుతుంది.
ఆధార్ చెల్లింపుల ప్రోత్సాహానికి
శుక్రవారం ఆధార్ ఆధారిత యాప్ను ప్రకటించిన తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు మోదీ రెండు కొత్త పథకాలను ప్రకటించారు. ఒకటి క్యాష్బ్యాక్ స్కీమ్, మరొకటి రెఫరల్ బోనస్ స్కీమ్. వీటి ప్రకారం ఎవరైనా మరొకరిని భీమ్ యాప్ వాడే దిశగా రెఫర్ చేస్తే అటువంటి వారికి నేరుగా ఖాతాలో రూ.10 జమ అవుతుంది. క్యాష్బ్యాక్ స్కీమ్ కింద యాప్ను ఉపయోగించి వ్యాపారులు చేసే లావాదేవీల్లో ప్రతి లావాదేవీకి కొంత సొమ్ము క్యాష్బ్యాక్ కింద జమ చేస్తారు. ఈ రెండింటిని 6 నెలల కాలానికి రూ. 495 కోట్ల బడ్జెట్తో ప్రతిపాదించారు.