బీఎస్ నిబంధనలు ఏమిటి?
వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఎంత స్థాయి వరకు ఉండాలో నిర్ణయిస్తారు. వాయుకాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ను పరిశీలించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. దీని గురించి మరికొన్ని అంశాలు తెలుసుకుందాం.
బీఎస్ అంటే భారత్ స్టాండర్డ్. బీఎస్-3 అనేది వాహన ఉద్గార ప్రమాణాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ప్రమాణం. దీని ద్వారా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఎంత స్థాయి వరకు ఉండాలో నిర్ణయిస్తారు. వాయుకాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ను పరిశీలించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. దీని గురించి మరికొన్ని అంశాలు తెలుసుకుందాం.
బీఎస్3
మొదటిసారి యూరోపియన్ నిబంధనల ఆధారంగా మన దేశంలో కాలుష్య ఉద్గారాల నిబంధనలను రూపొందించారు. 2000 సంవత్సరంలో మొదటిసారి వీటిని ప్రవేశపెట్టారు. 2010 నుంచి దేశంలో బీఎస్3 నిబంధలను దేశవ్యాప్తంగా అమలు చేశారు.
బీఎస్4
ఏప్రిల్ 2010 నుంచి 13 నగరాల్లో బీఎస్4 నిబంధనల అమలుకు రంగం సిద్దమైంది. ఏప్రిల్ 2017 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఇంతకు ముందే నిర్ణయించారు. 2016లో భారత ప్రభుత్వ ప్రకటన ప్రకారం భవిష్యత్తులో మనం బీఎస్5 నిబంధనలను పక్కనపెడుతూ ఒకేసారి 2020 నుంచి బీఎస్-6 నిబంధనలను పాటించబోతున్నాం.
సుప్రీం ప్రమేయంతో
1999 సంవత్సరం ఏప్రిల్ 29న సుప్రీంకోర్టు అన్ని వాహనాలు యూరో1 నిబంధనలను పాటించేందుకు తుది గడువుగా జూన్1,1999ని నిర్ణయించింది. అంతే కాకుండా ఎన్సీఆర్లో ఏప్రిల్,2000 నాటికి యూరో2 నిబంధనలు పాటించాలని ఆదేశించింది. కార్ల తయారీదారులు అందుకు సిద్దంగా లేకపోవడంతో తర్వాత ఇచ్చిన తీర్పులో యూరో2 కోసం నిర్దిష్ట గడువును చెప్పలేదు.
ప్రభుత్వం ఏం చేసింది...
మషేల్కర్ కమిటీ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను ప్రభుత్వం 2002లో అంగీకరించింది. యూరో నిబంధనలను దృష్టిలో ఉంచుకుని దేశంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు కమిటీ ఒక మార్గ సూచీని తయారుచేసింది. మొత్తానికి 2003లో నేషనల్ ఆటో ఫ్యూయల్ పాలసీని రూపొందించారు. తర్వాతి దశల్లో 2010 నుంచి బీఎస్ నిబంధనల అమలుకు అప్పట్లో నిర్ణయించారు.