సంఖ్యాపరంగా దేశీయ విమాన ప్రయాణికుల్లో 3వ స్థానంలో భారత్
దేశీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్ దృష్ట్యా ప్రపంచంలోనే మూడో స్థానానికి భారతదేశం ఎగబాకింది. 2016 సంవత్సరంలో భారత విమాన ప్రయాణికుల సంఖ్య 10 కోట్లు దాటి అమెరికా (71.9 కోట్లు), చైనా (43.6 కోట్లు) తర్వాత
దేశీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్ దృష్ట్యా ప్రపంచంలోనే మూడో స్థానానికి భారతదేశం ఎగబాకింది. 2016 సంవత్సరంలో భారత విమాన ప్రయాణికుల సంఖ్య 10 కోట్లు దాటి అమెరికా (71.9 కోట్లు), చైనా (43.6 కోట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న జపాన్ దిగజారింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల గురించి, దేశీయ విమానయాన సంస్థల గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.
నాలుగో స్థానానికి జపాన్
సిడ్నీ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (కాపా) విమానయానం గురించి ఒక నివేదికలో పలు గణాంకాలను వెలువరించింది. 9.7 కోట్ల మంది ప్రయాణించిన జపాన్ ఒక స్థానం దిగజారి నాలుగో స్థానానికి పరిమితం కావలసివచ్చింది. 2015, 2016 సంవత్సరాల్లో దేశీయ పౌర విమానయాన రంగం 20 నుంచి 25 శాతం వృద్ధిని సాధించించినట్లు తెలిపింది.
ఫిబ్రవరి వృద్దిరేటు నిరాశజనకం
ఈ ఏడాది జనవరిలో ఈ వృద్ధి రికార్డు స్థాయిలో 25.13 శాతం ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ వృద్ధిరేటు 16 శాతానికే పరిమితం కావడం కూడా కాస్త నిరాశపరిచే అంశమని, రెండేళ్ల పాటు సాధించిన 20 శాతం సగటు వృద్ధి కన్నా ఇది తక్కువగానే ఉందని విశ్శ్లేషించింది.
మొత్తం ప్రయాణికుల పరంగా సైతం భారత్ మూడో స్థానానికి చేరువలో
జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్యాపరంగా కూడా బ్రిటన్తో కలిసి నాలుగో స్థానంలో ఉన్న భారత్ మూడో స్థానానికి చేరేందుకు మరెంతో సమయం పట్టకపోవచ్చని కాపా అభిప్రాయపడింది. వచ్చే రెండు మూడేళ్ల కాలంలో భారత్ సంపూర్ణంగా ఏవియేషన్లో మూడో స్థానానికి ఎదగడం ఖాయంగా కనిపిస్తున్నట్టు కాపా ఇండియా హెడ్ కపిల్ కౌల్ అన్నారు.
మొత్తం సంఖ్యలో అంతర్జాతీయంగా 1,2 స్థానాల్లో అమెరికా, చైనా
2016 సంవత్సరంలో భారతదేశం 13.1 కోట్ల మంది దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగా జపాన్ 14.1 కోట్ల మంది ప్రయాణికులతో మూడో స్థానంలో ఉంది. జాతీయ, అంతర్జాతీ విమాన ప్రయాణికుల సంఖ్యాపరంగం 81.5 కోట్ల మందితో అమెరికా అగ్రస్థానంలో ఉండగా 49 కోట్ల మందితో చైనా రెండో స్థానంలో ఉంది.
ప్రాంతీయ మార్గాల్లో దక్కన్, అలయన్స్ ఎయిర్ దృష్టి
ప్రాంతీయ మార్గాల్లో విమానసర్వీసుల నిర్వహణకు ప్రైవేటు విమానయాన సంస్థ దక్కన్ చార్టర్, ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉడాన్ స్కీమ్ కింద ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రోత్సహిస్తోంది. దక్కన్ చార్టర్, ఎయిర్ ఒడిశా ఉమ్మడిగా వీటిలో 50 రూట్లలో అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కీమ్ కింద బిడ్లను గెలుచుకున్న కంపెనీల్లో అలయెన్స్ ఎయిర్, ట్రూజెట్ హోల్డింగ్ సంస్థ టర్బో మేఘా ఎయిర్వేస్, స్పైస్జెట్ ఉన్నాయి. ప్రాంతీయ విమాన కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు.
ఎయిర్ ఒడిశాకు అత్యధికంగా 25 రూట్లు
ఎయిర్ ఒడిశాకు 25 రూట్లు, దక్కన్ చార్టర్కు 21 రూట్లు, స్పైస్జెట్, అలయెన్స్ ఎయిర్ సంస్థలకు ఐదేసి రూట్లు, టర్బో మేఘాకు 5 రూట్లు దక్కినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ కింద తొలి విమానాన్ని అలయెన్స్ ఎయిర్ భటిండా నుంచి న్యూఢిల్లీ ఐజిఐఎకు నడపనుందని, మే నెల నుంచి ఈ విమానయాన సంస్థ పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కావొచ్చని విమానయాన వర్గాలు భావిస్తున్నాయి. 43 విమానాశ్రయాలకు 70 రూట్లలో విమానాలు నడిపేందుకు ఐదుగురు ఆపరేటర్లను గుర్తించినట్లు వివిధ వర్గాల ద్వారా అందిన సమాచార సారాంశం. ఒక గంట ప్రయాణ దూరానికి 2500 రూపాయలుగా ధరను నిర్ణయించారు. ఈ 43 విమానాశ్రయాల్లో 31 విమానాశ్రయాలు అసలు పని చేయకుండా ఉండగా 12 విమానాశ్రయాల సామర్థ్యాలు పూర్తిగా వినియోగంలోకి రావడంలేదు.