భారత్లో టాప్-10 రియల్ ఎస్టేట్ కంపెనీలివే...
అంతర్జాతీయ పేరెన్నికగన్న రంగాలలో రియల్ ఎస్టేట్ ఒకటి. భారతదేశం విషయానికి వస్తే వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పిస్తున్న వాటిలో అపార అవకాశాలను స్థిరాస్తి రంగమే కలిగి ఉంది. రియల్ ఎస్టేట్లో హ
అంతర్జాతీయ పేరెన్నికగన్న రంగాలలో రియల్ ఎస్టేట్ ఒకటి. భారతదేశం విషయానికి వస్తే వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పిస్తున్న వాటిలో అపార అవకాశాలను స్థిరాస్తి రంగమే కలిగి ఉంది. రియల్ ఎస్టేట్లో హౌసింగ్, రిటైల్, హాస్పిటాలిటి, వాణిజ్య నిర్మాణాలు ఉపరంగాలుగా ఉన్నాయి. అయితే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది. తరుచూ ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా నిబంధనలు మారడం, రాజకీయ రంగం నుంచి అనుకోని ఒత్తిళ్లు, నిపుణులైన కార్మికుల కొరత వంటి వాటితో ఈ రంగం సతమతమవుతూ ఉంది. అయినప్పటికీ ఎన్నో కంపెనీలు ఈ రంగంలో తమ సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిలో దేశంలో ముందు వరుసలో ఉన్న కొన్ని సంస్థల గురించి తెలుసుకుందాం.
1. డీఎల్ఎఫ్
ఢిల్లీ ప్రధాన కేంద్రంగా దేశమంతా విస్తరించిన స్థిరాస్తి కంపెనీ డీఎల్ఎఫ్. 1964లో దీన్ని ఛౌధరి రాఘవేంద్ర సింగ్ స్థాపించారు. ప్రస్తుతం కంపెనీ ఛైర్మన్గా కుశాల్ పాల్ సింగ్, వైస్ ఛైర్మన్గా రాజీవ్ సింగ్ ఉండగా, రాజీవ్ తల్వార్, మోహిత్ గుజ్రాల్ సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. 15 రాష్ట్రాల్లో 24 నగరాల్లో డీఎల్ఎఫ్ విస్తరించింది. 2007 జులై,5 న ఈ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయింది. 2016లో రూ. 92.6 బిలియన్ల ఏకీకృత నికర రెవెన్యూ, రూ. 5.13 బిలియన్ల ఆదాయం కలిగి ఉంది.
మార్కెట్ క్యాపిటలైజేషన్: రూ. 23,902.27 కోట్లు
2. ఒబెరాయ్ రియాల్టీ
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఒక పేరెన్నికగన్న రియల్ ఎస్టేట్ సంస్థ ఒబెరాయ్ రియాల్టీ. దీనికి వికాస్ ఒబెరాయ్ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయాలు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, గోల్ఫ్ కోర్స్లు దీని ప్రధాన నిర్మాణ కార్యకలాపాలుగా ఉన్నాయి. కంపెనీ ఇప్పటి వరకూ 90లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 39 ప్రాజెక్టులను చేపట్టి పూర్తిచేసింది. 2010లో స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయింది. 20.61 మిలియన్ చదరపు అడుగుల్లో కొత్త ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి.
మార్కెట్ క్యాపిటలైజేషన్: రూ. 9868.67 కోట్లు
3. గోద్రెజ్ ప్రాపర్టీస్
ముంబయి ప్రధాన కేంద్రంగా కలిగిన మరో ప్రముఖ నిర్మాణ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్. 1990 సమయంలో ఆది గోద్రెజ్ దీన్ని స్థాపించారు. చంఢీఘడ్, గుర్గావ్, అహ్మదాబాద్, కోల్కత, నాగ్పూర్,ముంబయి, పుణె, హైదరాబాద్,మంగుళూరు, బెంగుళూరు, చెన్నై,కొచ్చి నగరాల్లో ఇది తన నిర్మాణాలను చేపడుతోంది. 12 నగరాల్లో 119 చదరపు అడుగుల్లో గృహ, వాణిజ్య, టౌన్షిప్ల నిర్మాణాల్లో దీనికి ప్రాబల్యం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఛైర్మన్గా ఆది గోద్రెజ్ ఉన్నారు.
మార్కెట్ క్యాపిటలైజేషన్: రూ. 7197.14 కోట్లు
4. ప్రిస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
1986లో ఒక భాగస్వామ్య సంస్థగా ఇది ఏర్పడింది. 2009లో ప్రస్తుతం ఉన్న ప్రిస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. ప్రస్తుతం దీని ఛైర్మన్, ఎండీ ఇర్ఫాన్ రజాక్. కంపెనీ ఇప్పటి వరకూ 64.12 మిలియన్ చదరపు అడుగుల్లో 192 ప్రాజెక్టులను పూర్తిచేసింది. 65 ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణాలు జరుపుతూ, మరో 34 ప్రాజెక్టులకు ప్రణాళికలను కలిగి ఉంది. దీని ప్రధాన వ్యాపార విభాగాలు- గృహ, వాణిజ్య, హాస్పిటాలిటీ, రిటైల్ నిర్మాణాలతో పాటు సేవా రంగం. ఈ కంపెనీ నుంచి ప్రసిద్ది పొందిన కొన్ని నిర్మాణాల్లో అలోఫ్ట్ హోటల్, అంగ్సానా ఒయాసిస్ స్పా, యూబీ సిటీ, గోల్ఫ్షైర్ క్లబ్, ఫోరమ్ మాల్ కొన్ని. ఆసియా పసిఫిక్ ప్రాపర్టీ అవార్డ్స్ 2016 సందర్భంగా 16 అవార్డులను ఈ సంస్థ గెలుచుకోవడం గమనార్హం.
మార్కెట్ క్యాపిటలైజేషన్: రూ. 7102.50 కోట్లు
5. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్
2000 సంవత్సరంలో ఇండియాబుల్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ ఏర్పాటయింది. 2005లో దీన్నుంచి ప్రత్యేక సంస్థగా రియల్ ఎస్టేట్ లిమిటెమ్ ఆవిర్భావమయింది. సమీర్ గెహ్లాట్ దీని వ్యవస్థాపక ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇది అభివృద్ది చేసిన స్థూల ఆస్తుల విలువ రూ. 47,725 కోట్లుగా ఉండగా నికర విలువ రూ. 4861 కోట్లు.
దేశంలోకి మొదట రియల్ ఎస్టేట్ ఎఫ్డీఐని తీసుకువచ్చింది ఈ కంపెనీయే. ఇందుకోసం అమెరికాకు చెందిన ఫరల్లాన్ క్యాపిటల్ మేనేజ్మెంట్తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియాబుల్స్ ఫౌండేషన్ పేరుతో ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ది, మహిళల, యువత అభివృద్ది కొరకు పలు కార్యక్రమాలను చేపడుతున్నది.
మార్కెట్ క్యాపిటలైజేషన్: రూ. 4876.98 కోట్లు
6. హెచ్డీఐఎల్
ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఎక్కువ కార్యకలాపాలను కలిగిన మరో సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(హెచ్డీఐఎల్). సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 100 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలను చేపట్టింది. 1లక్షా 50 వేల ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు అందజేసింది. 241.73 మిలియన్ చదరపు అడుగుల సొంత స్థలంతో ముంబయి మెట్రో రీజియన్లో అత్యధిక సొంత భూమి కలిగిన సంస్థగా ఉంది. దీని నుంచి మెజెస్టిక్ టవర్, విస్పరింగ్ టవర్, ప్రీమియర్ రెసిడెన్సీస్ ప్యారడైజ్ సిటీ, ప్రీమియర్ ఎక్సోటికా వంటి ప్రసిద్ది చెందిన నిర్మాణాలు వచ్చాయి.
మార్కెట్ క్యాపిటలైజేషన్: రూ. 4055.96 కోట్లు
7.శోభా లిమిటెడ్
శోభా డెవలపర్స్గా అందరికీ తెలిసిన శోభా లిమిటెడ్ 1995 ఆగస్టులో ప్రారంభమైంది. పీఎన్సీ మీనన్ దీని వ్యవస్థాపకులు. దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరు. 13 రాష్ట్రాల్లో, 25 నగరాల్లో ఇది నిర్మాణాలు చేపడుతోంది. 70.54 మిలియన్ చదరపు అడుగుల్లో 102 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను, 262 కాంట్రాక్ట్ ప్రాజెక్టులను చేపట్టింది. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్, డెల్, బాష్, బయోకాన్, తాజ్ గ్రూప్, ఐటీసీ హోటల్స్ వంటి సంస్థలకు పలు ప్రాజెక్టులను ఇది నిర్మించి ఇచ్చింది. ఉత్తమ విలాసవంతమైన నివాసగృహాల నిర్మాణసంస్థ-బెంగుళూరు అవార్డును 2015లో ఈ సంస్థ గెలుచుకుంది. భారత్లోనే కాకుండా యూఏఈ, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, బ్రూనైలలో సైతం శోభా లిమిటెడ్ విస్తరించింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్: రూ. 2982.61 కోట్లు
8. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్
ఆగ్రా(యూపీ) ప్రధాన కార్యాలయంగా కలిగిన మౌలిక నిర్మాణ, అభివృద్ది నిర్వహణ సంస్థ పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్. 1999లో ఈ సంస్థ ప్రారంభమైంది.
ప్రస్తుత సీఎండీ ప్రదీప్ కుమార్ జైన్. జాతీయ రహదారులు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, ఎయిర్పోర్ట్ రన్వేలు, పారిశ్రామిక ప్రాంతాల, ట్రాన్స్మిషన్(పవర్) లైన్లకు సంబంధించిన ప్రాజెక్టులను ఇది ప్రధానంగా చేపడుతుంది. 13 రాష్ట్రాల్లో 51 మౌలిక రంగ నిర్మాణాలను ఇది నిర్మించింది. రోడ్లు, జాతీయ రహదారులకు సంబంధించే ఇది 31 ప్రాజెక్టులను పూర్తిచేసింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్: రూ. 2886.07 కోట్లు
9. ఒమాక్స్
రోహ్తాస్ గోయెల్ వ్యవస్థాక సీఎండీగా కలిగిన ఒమాక్స్ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా నిర్మాణ రంగంలో ఎదిగింది. ప్రస్తుత కంపెనీ సీఈవో మోహిత్ గోయెల్. 101 మిలియన్ చదరపు అడుగుల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ కాంట్రాక్టులను ఇది పూర్తిచేసింది. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో, 27 నగరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, హైటెక్ టౌన్షిప్లు, గ్రూప్ హౌసింగ్, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, హోటళ్లు, ఎస్సీవోలను ఇది నిర్మిస్తుంది. 2007లో ఇది పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుటు 70 రెట్ల సబ్స్క్రిప్షన్ స్పందన వచ్చింది. ప్రస్తుతం 13 గ్రూప్ హౌసింగ్, 16 టౌన్షిప్లతో పాటు పలు వాణిజ్యపరమైన మాల్స్, కార్యాలయాలు, హోటళ్లు వంటి వాటిని నిర్మిస్తూ ఉంది.
మార్కెట్ క్యాపిటలైజేషన్: రూ. 2810.27 కోట్లు
10. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్
బెంగుళూరు ప్రధానకేంద్రంగా కలిగిన ఈ సంస్థ దుబాయి, అమెరికాల్లో సైతం విస్తరించింది. దక్షిణ భారతదేశంలో చెన్నై, చిక్మగళూర్, హైదరాబాద్, కొచ్చి, మంగుళూర్, మైసూర్ నగరాల్లో ఈ సంస్థ నిర్మాణాలను చేస్తోంది. ఈ సంస్థ సీఎండీ ఎం.ఆర్.జైశంకర్. బెంగుళూరు, కొచ్చిలో వాణిజ్య నిర్మాణాలను; బెంగుళూరు, చెన్నై, మైసూర్ నగరాల్లో రిటైల్ ప్రాజెక్టులను ఇది చేపడుతోంది. ప్రాపర్టీ డెవలపర్స్లో దక్షిణ భారతదేశంలో ఐఎస్వో 9001:2000 సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి సంస్థ ఇదే.
మార్కెట్ క్యాపిటలైజేషన్: రూ. 1743.55 కోట్లు