డెరివేటివ్ ట్రేడింగ్స్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా రిలయన్స్పై సెబీ నిషేధం
రిలయన్స్ పెట్రోలియమ్(ఆర్పీఎల్)విలీనమైన సందర్భంలో ఆర్పీఎల్ షేర్లలో ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో అక్రమంగా ట్రేడింగ్ జరిగిందన్న 2007 నాటి కేసుకు సంబంధించి సెబీ ఈ ఆదే
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్కు(ఆర్ఐఎల్) క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గట్టి షాక్ ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గత అనుబంధ విభాగమైన రిలయన్స్ పెట్రోలియం(ఆర్పీఎల్)కు చెందిన సెక్యూరిటీల ఎఫ్ అండ్ వో కాంట్రాక్టుల్లో మోసపూరిత ట్రేడింగ్ పాల్పడిన ఆరోపణలకు సంబంధించిన కేసు తుది తీర్పు సందర్భంగా మార్కెట్ నియంత్రణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మీ కోసం....
పదేళ్ల నాటి కేసులో తీర్పు వచ్చింది ఇప్పుడే
ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్ కార్యకలాపాల్లో రిలయన్స్తోపాటు మరో 12 సంస్థలపై సంవత్సర కాలం పాటు నిషేధం విధిస్తున్నట్లు సెబీ ప్రకటించింది. అంతేకాదు, పదేండ్ల క్రితం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో(ఎఫ్ అండ్ వో) మోసపూరిత ట్రేడింగ్కు పాల్పడి మూటగట్టుకున్న రూ.447 కోట్ల సొమ్మును 12 శాతం వార్షిక వడ్డీతో సహా కలిపి వెనక్కు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.
తిరిగి చెల్లించాల్సిన సొమ్ము రూ.వేయి కోట్లకు పైనే
నవంబర్ 29, 2007 నుంచి 12 శాతం చొప్పున లెక్కగడితే వడ్డీ సొమ్మే రూ.500 కోట్లు దాటుతుంది. అంటే, ఈ కేసులో రిలయన్స్ దాదాపు రూ.1,000 కోట్లు తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందన్నమాట. ఈ సొమ్మును 45 రోజుల్లో చెల్లించాలని సెబీ ఆదేశించింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ఈ రకమైన తీర్పును వెలువరించాల్సి వచ్చిందని తీర్పు నివేదికలో సెబీ హోల్ టైం మెంబర్ మహాలింగం పేర్కొన్నారు.
ట్రిబ్యునల్లో సవాల్ చేస్తాం: ఆర్ఐఎల్
రిలయన్స్ పెట్రోలియమ్(ఆర్పీఎల్)విలీనమైన సందర్భంలో ఆర్పీఎల్ షేర్లలో ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో అక్రమంగా ట్రేడింగ్ జరిగిందన్న 2007 నాటి కేసుకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు జారీ చేసింది.
రిలయన్స్ పెట్రోలియంను ఇప్పటికే మాతృ సంస్థలో విలీనం చేశారు. ఈ కేసును సెటిల్ చేసుకుందామని గతంలో రిలయన్స్ కోరినప్పటికీ సెబీ నిరాకరించింది.
కాగా ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)లో సవాల్ చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది.
శుక్రవారం నుంచే నిషేధం
స్టాక్ ఎక్సేంజ్లలో ఈక్విటీ డెరివేటివ్ల ఎఫ్ అండ్ వో సెగ్మెంట్ ట్రేడింగ్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనకుండా రిలయన్స్, మరో 12 కంపెనీలపై ఏడాది కాలం నిషేధం విధిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన 54 పేజీల ఆర్డర్ కాపీలో సెబీ శాశ్వతకాల సభ్యులు జీ మహాలింగం ఆదేశాలు జారీ చేశారు. నిషేధం శుక్రవారం నుంచే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
నిషేధం ఎదుర్కొన్న సంస్థలు
సెబీ నుంచి నిషేధం ఎదుర్కొన్న వాటిలో గుజరాత్ పెట్రోకోక్ అండ్ పెట్రో ప్రొడక్ట్ సప్లై, ఆర్తిక్ కమర్షియల్స్, ఎల్పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, రెల్పోల్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఫైన్ టెక్ కమర్షియల్స్, పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, మోటెక్ సాఫ్ట్వేర్, దర్శన్ సెక్యూరిటీస్, రెలాజిస్టిక్స్ (ఇండియా), రెలాజిస్టిక్స్(రాజస్థాన్), వినమర యూనివర్సల్ ట్రేడర్స్, ధర్తి ఇన్వెస్ట్మెంట్ అండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. ఈ సంస్థలన్నింటిపై శుక్రవారం నుంచి ఏడాది పాటు నిషేధం అమలవుతుంది.