ఫార్చూన్ 50 శక్తివంతమైన మహిళల్లోఎస్బీఐ అరుంధతి భట్టాచార్య
ఫార్చ్యూన్ పత్రిక ప్రపంచంలో గొప్ప నాయకత్వ పటిమ గల వ్యక్తుల జాబితాలో ఎస్బీఐ ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్యకు స్థానం లభించింది. దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకుకు సారథ్యం వహిస్తున్న మొద
ఫార్చ్యూన్ పత్రిక ప్రపంచంలో గొప్ప నాయకత్వ పటిమ గల వ్యక్తుల జాబితాలో ఎస్బీఐ ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్యకు స్థానం లభించింది. దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకుకు సారథ్యం వహిస్తున్న మొదటి మహిళ ఆమె కావడమే ఎన్నో గుర్తింపులకు కారణమని దేశంలో ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫార్చూన్ వెల్లడించిన మరిన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.
శక్తివంతమైన వారిలో రాజ్ పంజాబికీ చోటు
ఫార్చూన్ పత్రిక విడుదల చేసి ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకత్వం వహిస్తున్న 50 మంది జాబితాలో అరుంధతీ భట్టాచార్యతో పాటు భారత సంతతికి చెందిన వైద్యుడు రాజ్ పంజాబీకి కూడా చోటు దక్కింది. ప్రపంచ గతిని మార్చగలిగే లేదా ఇతరులకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులను ఈ జాబితాలో చేర్చినట్లు ఫార్చ్యూన్ తెలిపింది. ఈ జాబితాలో ఎస్బీఐ తొలి మహిళా ఛైర్మన్ 26వ స్థానంలో నిలవగా, లాస్ట్ మైల్ హెల్త్ వ్యవస్థాపక సీఈఓ పంజాబీకి 28వ స్థానం దక్కింది.
ప్రథమ స్థానంలో థియో ఎస్టీన్
మొత్తం జాబితాలో షికాగో క్లబ్స్ బేస్బాల్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ థియో ఎస్టీన్ అగ్రస్థానంలోనూ, అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జాక్ మా 2వ స్థానంలోనూ ఉన్నారు. మిగిలిన టాప్-5ను చూస్తే పోప్ ఫ్రాన్సిస్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహాధ్యక్షురాలు ఛైర్మన్ మిలిందా గేట్స్ 3,4 స్థానాల్లోనూ, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ అయిదో స్థానాలను సాధించారు. ఇంకా జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్, ఫెడరల్ రిజర్వ్ అధినేత్రి జానెట్ యెలెన్ వంటి వారు సైతం జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
అరుంధతి భట్టాచార్య నాయకత్వం
మొండి బకాయిలు, పెద్ద నోట్ల రద్దు లాంటి ఊహించని పరిణామాలు ఎదురైనా ఎస్బీఐ బాధ్యతలను భట్టాచార్య సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఫార్చ్యూన్ ప్రశంసించింది. 211 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థను డిజిటల్ శకానికి మార్చడంలోనూ తీవ్ర కృషి చేశారని మ్యాగజైన్ కొనియాడింది. 2 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగిన ఎస్బీఐని డిజిటల్ దిశగా నడిపించడంలో అరుంధతి కృషి ఎంతగానో ఉందని బ్యాంకింగ్ నిపుణుల ప్రశంసలు అందుకున్నారు.
ఎబోలా సమయంలో కృషికి రాజ్ పంజాబీకి గుర్తింపు
లాస్ట్ మైల్ హెల్త్ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రాణాలు కాపాడానికి రాజ్ పంజాబీ చర్యలు తీసుకుంటున్నారు. అంటు వ్యాధులతో మరణించిన వారిని పాతిపెట్టడం లాంటి పనులు నిర్వహిస్తున్నారు. 2014లో తన సొంత గడ్డ లైబీరియాలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో లాస్ట్ మైల్ సేవలు వెలకట్టలేనివని ఫార్చ్యూన్ ప్రస్తుతించింది.