ప్రపంచంలో సగం సంపదకు సమానమైన సంపత్తి వారి 8మంది సొంతమా?
ప్రపంచంలో సగం సంపద ఒక ఎనిమిది మంది వద్ద ఉందంటే మీరు నమ్ముతారా? అవునండి ఇది నిజం. అందులోనూ వారిలో ఎక్కువ మంది అమెరికన్లు. 6 మంది అమెరికా పౌరులు, ఒక యూరోపియన్, ఒక మెక్సికన్ పౌరుడి వద్ద కలిపి ప
ప్రపంచంలో సగం సంపద ఒక ఎనిమిది మంది వద్ద ఉందంటే మీరు నమ్ముతారా? అవునండి ఇది నిజం. అందులోనూ వారిలో ఎక్కువ మంది అమెరికన్లు. 6 మంది అమెరికా పౌరులు, ఒక యూరోపియన్, ఒక మెక్సికన్ పౌరుడి వద్ద కలిపి ప్రపంచంలో మొత్తం ఎంత సంపద ఉందో అందులో సగం సంపద ఉంది. అయితే వారిలో ఎక్కువ మంది దాన్ని వివిధ దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ప్రతిన పూనడం సంతోషం కలిగించే విషయం.
ఆదాయ అసమానతలకు సంబంధించి ఆక్సాఫామ్ రూపొందించిన నివేదికంలో 8 మంది కుబేరుల వద్ద ఉన్న సంపదను గూర్చి విశ్లేషించారు. వారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
1. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాకుడు బిల్గేట్స్
ప్రపంచ సాంకేతిక దిగ్గజం బిల్గేట్స్ వద్ద 75 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా ఈయన ఉన్నారు. 1970ల్లోనే మైక్రోసాఫ్ట్న్ గేట్స్ స్థాపించారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా చలామణీ అవుతోంది. 2000 సంవత్సరంలోనే బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా అంతర్జాతీయంగా పలు దాతృత్వ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆయన సంపదలో మెజారిటీ వాటాను సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్లో ఆయన వాటాను 3% దాకా తగ్గించుకోవడం విశేషం.
2. అమెన్సియో ఒర్టెగా
ఇండిటెక్స్ గ్రూప్ వ్యవస్థాపకుడైన అమెన్సియో ఒర్టెగా స్పెయిన్లో జన్మించారు. ఫిబ్రవరి 2017 నాటికి 72.8 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. యూరప్లోనే అత్యధిక సంపన్నుడిగా ఆయన ఉన్నారు. 1975లో ఓర్టెగా జరా ఫ్యాషన్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇండిటెక్స్ గ్రూప్లో భాగంగా ఉన్న ఈ వస్త్ర దుకాణాల సంస్థ 7000 షాపులను నిర్వహిస్తోంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ఇతడు యారప్లో అత్యధిక ధనవంతుడు అవ్వడమే కాకుండా, ప్రపంచంలో రెండో అతి పెద్ద ధనవంతుడుగా ఉన్నారు. ఆయన మొదటి భార్య రోసాలియా మేరాకు విడాకులిచ్చి, 2001లో ఫ్లోరాను వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు.
3. వారెన్ బఫెట్
పెట్టుబడుల ప్రపంచంలో వారెన్ బఫెట్ విధానాలు ఒక సంచలనం. అత్యంత సంపన్నుల్లో విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ముందు వరుసలో ఉంటారు. 2014లో అత్యధిక సంపదను దానం చేసిన వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. అప్పటికి ఆయన ఇచ్చిన విరాళం విలువ 2.1 బిలయన్ డాలర్లు. ఇదంతా ఆయన వ్యక్తిగతం.
ఆయన వేతనం ఒక లక్ష యూఎస్ డాలర్లు. ఫిబ్రవరి 2017 నాటికి బఫెట్ సంపద విలువ 75.6 బిలియన్ డాలర్లు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు ఆయన మద్దతు తెలిపారు. 1952లో సుశాన్ను వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం.
4. కార్లోస్ స్లిమ్
11 ఏళ్ల వయసులో ప్రభుత్వ బాండ్లలో కార్లోస్ స్లిమ్ పెట్టుబడులు పెట్టాడు. 12 ఏళ్ల వయస్సప్పుడు మొదటి షేర్ను కొనుగోలు చేశాడు. టెలికమ్యూనికేషన్ సంస్థ మొవిల్ వ్యవస్థాకుడు ఈయనే. దాని మొత్తం ఆస్తుల విలువ 42 బిలియన్ డాలర్లుగా ఉంది. అందులో ఈయన వాటా 7% ఉండగా; అతని కుటుంబానికి మొత్తంగా 37% వాటా ఉంది. 2015లో ప్రపంచంలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న స్లిమ్ 2016లో 4వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
5. జెఫ్ బెజోస్
జెఫ్ బెజోస్ అమెజాన్.కామ్ యొక్క వ్యవస్థాపకుడు. ప్రస్తుతం ఆయన వయసు 53 సంవత్సరాలు కాగా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వాషింగ్టన్ పోస్ట్ను కొనడం ఆయన పెట్టుబడి ప్రణాళికల్లో ఒక సంచలనం. అంతే కాకుండా జెఫ్ ఒక ఏరోస్పేస్ కంపెనీని సైతం స్థాపించారు. జెఫ్ బెజోస్ 1999లో టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. 2016 నాటికి ఆయన సంపద విలువ 45.2 బిలియన్ డాలర్లు. టాప్-5 కుబేరుల్లో అతి చిన్న వయసు వాడు ఈయనే కావడం గమనార్హం.
6.మార్క్ జుకర్ బర్గ్
2004లో జుకర్ బర్గ్ ఫేస్బుక్ అనే సామాజిక మాధ్యమాన్ని స్థాపించారు. ఫేస్బుక్, 2012లో 32 ఏళ్ల వయసులో ఆయన్ను మల్టీ బిలియనీర్ అయ్యేలా చేసింది.పోటీ సంస్థలు జీ ప్లస్, ట్విట్టర్లను తోసిరాజని ఫేస్బుక్ను లాభదాయక సంస్థగా తీర్చిదిద్దడంలో తన ప్రతిభను చాటారాయన.
తమకు పాప పుట్టిన వేళ ఆ దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. చిన్న పిల్లల్లో వ్యాధులు, నివారణకు ఉద్దేశించిన ప్రణాళికకు దాదాపు 20వేల కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అంతే కాకుండా 'బయోహబ్ సఅనే పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది పిల్లల జీవిత కాలంలో వచ్చే అన్ని వ్యాధులను నివారించేందుకు కృషి చేస్తుంది. ఇందుకోసం జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ 600 మిలియన్ డాలర్లను అందజేయనున్నారు.
7. లారీ ఎలిసన్
సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ ఒరాకిల్ వ్యవస్థాకుడిగా లారీ ఎలిసన్ సాంకేతిక ప్రపంచానికి పరిచమయ్యారు. 1977వ సంవత్సరంలో తన మిత్రుడు బాబ్ ఓట్స్తో కలిసి ఆ సంస్థను కాలిఫోర్నియాలో ప్రారంభించారు. 2017 జనవరి నాటికి లారీ ఎలిసన్ పంపద విలువ 51.9 బిలియన్ డాలర్లు కాగా ఆయన వేతనం 41.5 మిలియన్ డాలర్లు కావడం గమనార్హం.
8.తాజా నివేదిక ప్రకారం...
ఆక్స్ఫామ్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో 50 శాతం మంది పేదల వద్ద ఉన్న సంపద కేవలం ఎనిమిది మంది దగ్గరే ఉంది. ఇందులో ఆరుగురు అమెరికన్లు కాగా...ఒకరు స్పెయిన్...మరొకరు మెక్సికోకు చెందిన పారిశ్రామికవేత్తలు. 2016లో ఇదే అంతరం కొంచెం తక్కువగా ఉంది. 9 మంది సంపద ప్రపంచంలోని 360 కోట్ల మంది సంపదతో సమానమని ఆక్స్ఫామ్ వెల్లడించింది. 2010లో 43మంది వద్ద ఉన్న సంపద ప్రపంచ పేదల్లో సగం మంది సంపదతో సమానంగా ఉంది.
9.గతంలో ఎన్నడూ లేని విధంగా...
గతంలో ఎన్నడూ లేని విధంగా సంపద పరంగా అంతరం పెరిగిపోయిందని ఆక్స్ఫామ్ సంస్థ తెలిపింది. ఇండియా, చైనా దేశాల సమాచారం ప్రకారం ప్రపంచంలో సగం నిరుపేదల సంపద మరింత తరిగిపోయిందని ఈ నివేదిక చెప్పింది. దీనిని దారుణమైన పరిస్థితిగా పేర్కొంది. అయితే వర్థమాన దేశాల్లో ఇండియా పరిస్థితి చూస్తే పేదల పరంగా వారు మెరుగుపడేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉందని నివేదిక సూచించింది.
10.సంపన్నులకు పెట్టుబడులు షేర్ల రూపంలో..
సంపన్నులకు పెట్టుబడులు షేర్ల రూపంలో ఉండటంతో వారి సంపద భారీగా పెరుగుతోందని ఆక్సోఫామ్ విశ్లేషించింది. గత రెండు దశాబ్దాలుగా చైనా, ఇండోనేషియా, లావోస్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లోని పది శాతం ధనికుల ఆదాయం 15 శాతం వృద్ధి చెందింది. 2009 నుంచి సంపన్నుల ఆదాయం ఏటా దాదాపు 11శాతం పెరిగితే...పేదల ఆదాయంలో ఎలాంటి పెరుగుదల లేదని తేల్చింది. సంపన్నుల ఆదాయం మరింత పెరిగేందుకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణంగా పేర్కొంది.
11.అతి తక్కువ పన్ను చెల్లిస్తున్నది కూడా బిలియనీర్లే...
ఇక అతి తక్కువ పన్ను చెల్లిస్తున్నది కూడా బిలియనీర్లే... బిలియనీర్లలో చాలా మంది తమ సెక్రటరీలు, క్లీనర్ల కంటే తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు ఆక్సోఫామ్ తెలిపింది. తక్కువ పన్నులు చెల్లించే వ్యవస్థ ఉన్నంత వరకు ఈ అసమానతలు అలాగే ఉంటాయని అభిప్రాయపడింది. భారత్ లాంటి దేశాల్లో పన్ను ఎగవేతలు ఎక్కువగా ఉండటం వల్లే ఆదాయ అసమానతలు మరింత పెరుగుతున్నట్లు నివేదిక విశ్లేషించింది. ఈ పరిస్థితి మెరుగుపడాలంటే పన్ను వ్యవస్థను పటిష్టపరచాల్సి ఉందని సూచించింది.