స్నాప్డీల్ ప్రభ క్షీణించిందా?
ఈ-కామర్స్ దిగ్గజాల్లో మొదటి మూడింటిలో ఒకటిగా వెలుగొందుతున్న స్నాప్డీల్ ఉద్యోగాల కోతకు తెరతీసింది. జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ నేతృత్వంలోని, దేశీయ సంస్థ స్నాప్డీల్.. వ్యయ నియంత్రణ దిశగా
ఈ-కామర్స్ దిగ్గజాల్లో మొదటి మూడింటిలో ఒకటిగా వెలుగొందుతున్న స్నాప్డీల్ ఉద్యోగాల కోతకు తెరతీసింది. జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ నేతృత్వంలోని, దేశీయ సంస్థ స్నాప్డీల్.. వ్యయ నియంత్రణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే 500-600 మంది ఉద్యోగులను తొలగించనుంది. దీన్ని సంస్థ కూడా ధృవీకరించింది. మరోవైపు సంస్థ వ్యవస్థాపకులైన కునాల్ భల్, రోహిత్ బన్సాల్ తాము వేతనాలు తీసుకోబోమని ప్రకటించారు. అయితే ఎంతకాలం అన్నది తెలియరాలేదు. ఈ నేపథ్యంలో స్నాప్డీల్ సంస్థలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుందాం.
వ్యయ నియంత్రణ కోసమే...
జీతభత్యాల ఖర్చులు భారీగా తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెలువరించినా, కొత్తగా మరిన్ని నిధుల సమీకరణలో ఇబ్బందులు పడుతున్నందునే వ్యయ నియంత్రణ వైపు నడుస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లాజిస్టిక్స్, డిజిటల్ పేమెంట్స్ వ్యాపారాల్లో పనిచేస్తున్నవారిలో కొందరిని తీసేస్తున్నామని, తొలగింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఎందరిని తొలగిస్తున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
కఠిన నిర్ణయాలు తప్పవు
మొత్తానికి అన్ని విభాగాల్లో కలిపి 500 నుంచి 600 మంది వరకు ఉద్యోగాలు కోల్పోతారన్న అంచనాలు ఉన్నాయి. కాగా, ‘రెండేళ్లలో దేశీయ తొలి లాభదాయక ఈ-కామర్స్ సంస్థగా స్నాప్డీల్ను నిలబెట్టే దిశగా వెళ్తున్నాం. కాబట్టి మా వ్యాపారాలన్నింటిపై వ్యయపరమైన నియంత్రణ తప్పక అవసరం. ఆరోగ్యకరమైన వ్యాపారాభివృద్ధిని సాధించాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు.' అని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఉద్యోగులకు మెయిల్
మరోవైపు ఉద్యోగులనుద్దేశించి పంపిన ఈ-మెయిల్లో కునాల్ భల్ తాజా పరిణామాలపై స్పందిస్తూ ‘గడచిన 2-3 సంవత్సరాల్లో ఆన్లైన్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివచ్చాయి. ఈ క్రమంలో పరిశ్రమ తప్పటడుగులు వేసింది. అందులో స్నాప్డీల్ కూడా ఉంది. ఇప్పుడు మేము ఆ తప్పులను సరిదిద్దుకోదలిచాం. నాన్-కోర్ ప్రాజెక్టులను దూరం పెడుతున్నాం. లాభదాయక ప్రాజెక్టులను చేపడుతున్నాం. వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నాం. అయితే వీటన్నింటి మధ్య మా సహచరులను కొందరిని కోల్పోక తప్పడం లేదు. బాధ కలుగుతున్నా.. భరించాల్సిందే.' అన్నారు.
బహుళ జాతి సంస్థల బాటలోనే...
యాపిల్, టెస్లా, అమెజాన్, నెట్ఫ్లిక్స్, లెగో, స్పైస్జెట్ వంటి ఎన్నో బహుళజాతి సంస్థలు కూడా తమ విజయాలకు ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయని గుర్తుచేశారు. ఇదిలావుంటే స్నాప్డీల్లో 8,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అమెజాన్, ఫ్లిప్కార్ట్తో మార్కెట్లో స్నాప్డీల్కు గట్టిపోటీ ఎదురవుతోంది. సాఫ్ట్బ్యాంక్తోపాటు ఫాక్స్కాన్, అలీబాబా గ్రూప్లు స్నాప్డీల్లో పెట్టుబడులు పెట్టాయి. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆన్లైన్ వ్యాపారాలు మందగించినా, అనంతరం డిజిటల్ లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో భవిష్యత్ అంతా ఆన్లైన్ వ్యాపారానిదేనన్న అభిప్రా యాలు కొంతమేర ఈ-కామర్స్ సంస్థలకు ఊరటనిస్తున్నాయి.