9 లక్షల ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖ కన్ను
పెద్దనోట్ల రద్దు అనంతరం పెద్ద మొత్తాల్లో జరిగిన డిపాజిట్లపై ఆదా యం పన్ను విభాగం దృష్టి సారించింది. ఆపరేషన్ క్లీన్ మనీ పేరుతో దూకుడుగా ముందుకెళుతోంది. గత కొన్ని వారాలుగా ఈ డిపాజిట్ల తీరుతెన్నులను పరిమా
పెద్దనోట్ల రద్దు అనంతరం పెద్ద మొత్తాల్లో జరిగిన డిపాజిట్లపై ఆదా యం పన్ను విభాగం దృష్టి సారించింది. ఆపరేషన్ క్లీన్ మనీ పేరుతో దూకుడుగా ముందుకెళుతోంది. గత కొన్ని వారాలుగా ఈ డిపాజిట్ల తీరుతెన్నులను పరిమాణాన్ని లోతు గా విశ్లేషించిన ఐటీ విభాగం మొత్తం 9 లక్షల ఖాతాలు అనుమానాస్పదమైనవేనని వెల్లడించింది. వీరికి నోటీసులు జారీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, అయితే మార్చి 31తో ముగిసే కొత్త పథకం(గరీబ్ కల్యాణ్ యోజన) గడువు అనంతరం ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
'ఆపరేషన్ క్లీన్ మనీ పేరిట ఈ ఖాతాలను ఐటి విభాగం విశ్లేషించింది. ఇప్పటికే 18 లక్షల మందికి ఎస్సెమ్మెస్లు, ఇమెయిల్స్ పంపించామని, వారిచ్చిన వివరాలను కూలంకషంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. 50 రోజుల గడువులో ఐదు లక్షలకు పైగా బ్యాంకుల్లో జరిగిన డిపాజిట్లపై దృష్టిపెట్టామని తెలిపింది. వీరందరినీ ఇంత మొత్తం ఎక్కడినుంచి వచ్చిందీ, అందుకు వారికున్న ఆదాయ మార్గాలేమిటని ప్రశ్నించినట్లు వెల్లడించింది. వీరంతా ఈ నెల 15లోగా సమాధానం ఇవ్వాలని కూడా స్పష్టం చేశామని తెలిపింది. అయితే కొంత మంది దీనిపై స్పందించలేదు.
ఇప్పటికే ఈ గడువు ముగిసింది కాబట్టి ఐటీ ప్రశ్నలకు వీరంతా న్యాయబద్ధమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. చట్టపరంగా వారి దగ్గర ఏవో వివరణలిచ్చే సమాచారం ఉండబట్టే ఇలా చేస్తుండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పన్ను రిటర్న్స్లో వీటిని చూపించినంత మాత్రాన సరిపోదని, 2016-17 సంవత్సరంలో వీరికున్న ఆదాయాన్ని అంతకు ముందు సంవత్సరాల్లో వీరు సంపాదించిన మొత్తాన్ని బేరీజు వేసే అసలు వాస్తవం వెల్లడవుతుందని ఐటి వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఏమాత్రం తేడాలున్నా ఆ మొత్తాన్ని లెక్కల్లో మొత్తంగానే పరిగణిస్తామని తెలిపాయి. ఇప్పటికే ప్రశ్నలను అందుకున్న 18లక్షల మందిలో 5.27 లక్షల మంది సమాధానం చెప్పారని, వీరంతా తాము నగదును డిపాజిట్ చేసిన విషయాన్ని కూడా ధ్రువీకరించారని తెలిపాయి. దేశవ్యాప్తంగా 7.41లక్షల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు డిపాజిట్ అయింది. తాము ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పకపోయినా, ఇతరత్రా తమ అక్రమార్జనను సక్రమంగా మార్చుకునేందుకు ప్రయత్నించినా అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఐటి శాఖ తెలిపింది.