పన్ను రహిత ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలి: ఈవై సర్వే నివేదిక
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమీపించే గడువు సమీపిస్తున్న కొద్దీ వివిధ వర్గాల నుంచి బడ్జెట్పై తమ ఆకాంక్షలను నివేదించే వార్తలు ఎక్కువవుతాయి. వచ్చే కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత వార్షిక ఆదాయ పన్న
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ గడువు తేదీ సమీపించే గడువు సమీపిస్తున్న కొద్దీ వివిధ వర్గాల నుంచి బడ్జెట్పై తమ ఆకాంక్షలను నివేదించే వార్తలు ఎక్కువవుతాయి. వచ్చే కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత వార్షిక ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలనే డిమాండ్ చాలా చోట్ల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలకు చెందిన 200 మంది సిఎఫ్ఒలు, పన్ను నిపుణులతో సంప్రదించి ఈవై ఒక సర్వే నివేదిక రూపొందించింది. వ్యక్తిగత పన్ను ఆదాయ పరిమితిని రెట్టింపు చేయడంతో పాటు, ప్రతి రంగానికి ప్రత్యేకమైన రాయితీలను అందిస్తే తద్వారా ప్రజల ఆదాయం, పొదుపు పెరిగి పెద్ద నోట్ల రద్దుతో దెబ్బతిన్న వినియోగ ఆధారిత డిమాండ్, ప్రైవేటు పెట్టుబడులూ పెరుగుతాయని సర్వేలో పాల్గొన్న సిఎఫ్ఒల్లో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఆటోమోటివ్, కన్సూమర్ ఉత్పత్తులు, లైఫ్ సైన్సెస్, మౌలిక, టెక్నాలజీ,ఆర్థిక సేవలు, ఇతర రంగాలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ ఆడిట్, టాక్స్ కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) జరిపిన ఒక సర్వే బయటపెట్టిన పలు ఇతర ముఖ్యాంశాలను ఇక్కడ తెలుసుకుందాం.
వ్యక్తిగత ఆదాయంపై
వ్యక్తిగత ఆదాయంపై విధించే పన్ను 25 శాతాన్ని మించకూడదని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం రూ.10 లక్షలకు మించిన వార్షిక ఆదాయం ఉన్న వారిపై 30 శాతం పన్ను కడుతున్నారు. ఎక్కువ మంది ఈ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నట్లు తెలిసింది. ‘పెద్ద నోట్ల రద్దుతో పెరిగిన బ్యాంక్ డిపాజిట్లు, త్వరలో అమల్లోకి రానున్న జిఎస్టి దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను మరింత విస్తృతం చేసేందుకు ఉపయోగపడతాయి' అని ఈవై ఇండియా పార్టనర్ అండ్ నేషనల్ టాక్స్ లీడర్ సుధీర్ కపాడియా చెప్పారు.
కార్పొరేట్ పన్ను తగ్గాలి
సర్వేలో పాల్గొన్న వారిలో 81.42 శాతం మంది కంపెనీల పన్నుల భారమూ 25 శాతం మించకుండా చూడాలని కోరారు. ‘భారత్లో తయారీ'కి తోడ్పడేందుకు వీలుగా వచ్చే బడ్జెట్లోనూ ప్రస్తుతం కొన్ని రంగాలకు ఇస్తున్న పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని 72 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు. గార్(జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్) నిబంధనల అమలును ప్రభుత్వం మరో ఏడాదిపాటు వాయిదా వేసే అవకాశం ఉందని కూడా మెజారిటీ సిఎఫ్ఒలు అంచనా వేస్తున్నారు. 33.33 శాతం మంది వాయిదా వేస్తుందనగా, 32.79% మంది అలా ఏమీ కాదన్నారు.
బీమాకూ కావాలి మినహాయింపులు
వచ్చే కేంద్ర బడ్జెట్లో తమకూ మరిన్ని ప్సోత్సాహకాలు, మినహాయింపులు కావాలని బీమా రంగానికి చెందిన వారు కోరుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా పథకాల ప్రీమియంపై వసూలు చేస్తున్న 15 శాతం సేవా పన్ను రద్దు చేయాలని కోరింది. దీని వల్ల వినియోగదారులపై పరోక్ష భారం పడి బీమాపై ఆసక్తి తగ్గుతుందనేది నిపుణుల వాదన. దీనికి తోడు ప్రీమియంకు ఇచ్చే పన్ను మినహాయింపు పరిమితిని సైతం ప్రస్తుతం ఉన్న రూ.25,000 నుంచి రూ.50,000కు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవలి ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని గృహ బీమాను తప్పనిసరి చేసేందుకూ బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్
మినీ ఫుడ్ పార్కుల్లో యూనిట్లు ఏర్పాటు చేసే చిన్న, మధ్య తరహా యూనిట్ల (ఎస్ఎంఇ)కు వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని కొంత మంది ఆశపడుతున్నారు. ఉత్పత్తి ప్రాంతాలకు చేరువలోని ఈ పార్కుల్లో ఏర్పాటు చేసే బియ్యం మిల్లులు, మసాల ద్రవ్యాల తయారీ, టీ ప్రాసెసింగ్ ఎస్ఎంఇ యూనిట్లకు ‘సంపద' పథకం కింద 35% పెట్టుబడి రాయితీ ఇవ్వాలని గతేడాది బడ్జెట్లో ప్రతిపాదించారు. దీనికి తోడు రాష్ట్రాలు కూడా ఈ యూనిట్ల ఉత్పత్తులను పూర్తిగా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) నుంచి మినహాయించాలని కోరే అవకాశం ఉన్నట్లు ఆహార పరిశ్రమ రంగ నిపుణుల అంచనా వేస్తున్నారు.
దిగుమతి సుంకాన్ని తగ్గించాలి
ఈ ఏడాది బడ్జెట్లో అయినా ప్రభుత్వం కోకింగ్ కోల్పై దిగుమతి సుంకంతోపాటు క్లీన్ ఎనర్జీ సెస్ ఎత్తివేయాలని దేశీయ ఉక్కు పరిశ్రమ కోరింది. ‘కోకింగ్ కోల్ ధర పెరగడంతో ఈ సంవత్సరం ఉత్పత్తి ఖర్చులు బాగా పెరిగాయి. మనకు అవసరమైన కోకింగ్ కోల్ మొత్తాన్ని దిగుమతి ద్వారానే సమకూర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిపై ఉన్న దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయాలని కోరుతున్ననని టాటా స్టీల్ ఎండి నరేంద్రన్ చెప్పారు. గృహ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా దేశంలో ఉక్కు వినియోగాన్ని మరింత పెంచే చర్యలు కూడా తీసుకోవాలని పరిశ్రమవర్గాలు ఆర్థిక మంత్రి జైట్లీకి విజ్ఞప్తి చేశాయి. లేకపోతే చైనా వంటి దేశాల నుంచి చౌకగా ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతున్న ఉక్కుతో పోటీపడడం కష్టమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.