ఈ బడ్జెట్లో అరుణ్జైట్లీ నుంచి సామాన్యుడు కోరుకునేదేమిటి?
పట్టణాల్లో అయినా, పల్లెల్లో అయినా ఎక్కువ పన్ను కట్టేది, ఎక్కువ ద్రవ్యోల్బణ ప్రభావం ఉండేది మధ్య తరగతి పైనే. అందుకే బడ్జెట్ వస్తుందంటే ఏదో విధంగా దానిపై కొన్ని ఆశలు కల్పించుకుంటాడు సగట
పట్టణాల్లో అయినా, పల్లెల్లో అయినా ఎక్కువ పన్ను కట్టేది, ఎక్కువ ద్రవ్యోల్బణ ప్రభావం ఉండేది మధ్య తరగతి పైనే. అందుకే బడ్జెట్ వస్తుందంటే ఏదో విధంగా దానిపై కొన్ని ఆశలు కల్పించుకుంటాడు సగటు మధ్య తరగతి మనిషి. నోట్ల రద్దు తర్వాత ఎన్నో ఇబ్బందులు కలిగిన తర్వాత వస్తున్న బడ్జెట్ ఇది. యూనియన్ బడ్జెట్ 2017-18 నుంచి అన్ని వర్గాల ఆశలు ఎక్కువగా ఉన్నాయి. చాలా విధాలుగా అరుణ్ జైట్లీ మధ్య తరగతిని సంతృప్తి పరచవచ్చు. అయితే సామాన్య,మధ్య తరగతి ప్రజలకు కల్పించే పన్ను ప్రయోజనాలు ఉపయోగించుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపదను వృద్ది చేసుకోవచ్చు. ప్రభుత్వానికి సైతం ప్రజల పొదుపు పెరగడం ద్వారా దీర్ఘకాలంలో వృద్దిలో పెరుగుదల ఉంటుంది. సగటు జీవి ఆలోచించే బడ్జెట్ వరాల మూటల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. ఆదాయపు పన్ను శ్లాబుల మార్పు
బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి పన్ను వ్యవస్థలను సరళీకరించి, ఆదాయపు పన్నుశ్లాబులను మారుస్తారని చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే గత రెండు బడ్జెట్లలో ఇది జరగలేదు. కనీసం పన్ను పరిమితినైనా రూ. 2.5 లక్షల నుంచి పెంచుతారని పన్ను చెల్లింపుదార్లు ధీమాగా ఉన్నారు. ఎక్కువగా మధ్య తరగతి యువతి పన్ను గురించి అంత సంతోషంగా లేరు. వీరి కోసమైనా మోదీ-జైట్లీ ద్వయం ఆదాయపు పన్ను శ్లాబులను బడ్జెట్ 2017లో సవరిస్తారేమో చూద్దాం.
2. పన్ను రేట్ల తగ్గింపు
ఒక పక్క ఆదాయపు పన్ను రేటు, మరో పక్క వ్యాట్ పన్ను పోటు, సేవా పన్ను ఇలా రకరకాల పన్నులతో సామాన్యుడు విసిగిపోయాడు. ఏటేటా సేవా పన్ను పెరుగుతూనే ఉంది. కనీసం ఈ బడ్జెట్లో అయినా సేవా పన్ను పరిధిలోకి వచ్చే వస్తు,సేవలను తగ్గించడమో లేదా పన్ను రేటును తగ్గిస్తారేమో చూడాలి.
3. అలవెన్సులపై మినహాయింపుల పెంపు
ఏ పన్ను భారాన్నైనా ఎక్కువగా భరించేది వేతన జీవులే. అందుకే బడ్జెట్ వస్తుందంటే చాలు వివిధ అలవెన్సులపై మినహాయింపులు పరిమితులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటారు. వేతన జీవులకు ఉండే మినహాయింపుల్లో పిల్లల చదవు ఫీజులు, విద్యారుణాలు, ప్రయాణ భత్యం, మెడికల్ రీయింబర్స్మెంట్, ఇంటి అద్దె భత్యం, లీవ్ ట్రావెల్ అలవెన్సు వంటివి ప్రధానమైనవి. వీటన్నింటికి సంబంధించిన పరిమితులను చాలా ఏళ్ల క్రితం ఒక నిర్ణీత మొత్తంగా నిర్ణయించి వాటినే కొనసాగిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వీటిని మార్చవలసి ఉంది.
4. 80సీ కింద వచ్చే మినహాయింపులు పెరిగేనా?
ఐటీ చట్టం 80సీ కింద వచ్చే మినహాయింపులు ప్రస్తుతం రూ.1.50 లక్ష నుంచి రూ. 3 లక్షల దాకా ఉన్నాయి. జైట్లీ 80సీ కింద క్లెయిం చేసుకునే మినహాయింపుల పరిమితిని పెంచడం ద్వారా వ్యక్తుల పొదుపును పెంచవచ్చు. అది పరోక్షంగా పెట్టుబడుల ద్వారా దేశ అభివృద్దికి దోహదపడగలదు.
5. సీనియర్ సిటిజన్ల కోసం
60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు గల వారి కోసం కనీస ఆదాయ పన్ను పరిమితి రూ. 3 లక్షలుగా ఉండగా, 80 ఏళ్ల పైబడిన వారి కోసం ఆ పరిమితి రూ. 5 లక్షలుగా ఉంది. వీటిని రూ. 4, రూ. 6.5 లక్షలకు పెంచవచ్చు. తద్వారా సీనియర్ సిటిజన్ల అభిమానాన్ని చూరగొనవచ్చు.
6. మౌలిక బాండ్లు
కొద్ది కాలం క్రితం పన్ను చెల్లింపుదార్లకు భరోసాగా మౌలిక బాండ్లు ఉండేవి. ఇటీవల వీటిని ప్రవేశపెట్టడం లేదు. రూ. 20 వేల వరకూ లేదా ఎంత పెట్టుబడి పెట్టారో అంత మేరకు మినహాయింపుల వచ్చేలా మౌలిక బాండ్లను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చు. ఇది పొదుపును పెంచడం, మధ్య తరగతిని సంతోఫపెట్టడంతో పాటు, వృద్దిని పెంచుతుంది. అంతే కాకుండా ఉద్యోగాల కల్పనకు దారితీస్తుంది.
7. ఎన్పీఎస్ పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు
ఎన్పీఎస్పై పెట్టుబడిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ పెన్షన్ కలిగి ఉండేందు కోసం ఇందులో పెట్టే పెట్టుబడుల కోసం మినహాయింపులను, పెట్టుబడి ప్రయోజనాలను మరింతగా కల్పిస్తారేమో చూడాలి. సెక్షన్ 80సీసీడీ కింద ప్రస్తుతం ఉన్న రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్పీఎస్ ద్వారా పొదుపు చేసి సంపాదించే మొత్తాన్ని తీసుకునేటప్పుడు వచ్చే సొమ్ముకు సంబంధించి ఈపీఎఫ్, పీపీఎఫ్లాగా మార్చాలని చాలా మంది ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. కొన్ని షరతులకు లోబడి ఎన్పీఎస్ రాబడులకు 100% పన్ను మినహాయింపులు ఉండాలనేది చాలా మంది అభిలాష.
8. గృహ రుణాలకు వడ్డీ రాయితీ
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇప్పటికే పలు వడ్డీ రాయితీలను ప్రధాని ప్రకటించారు. రూ. 12 లక్షల లోపు రుణాలపై 3%, రూ. 9 లక్షలలోపు రుణాలపై 4% వడ్డీ రాయితీలను అందిస్తున్నారు. అయితే ఇవన్నీ టైర్-3 నగరాల్లో ప్రజలను ఉద్దేశించి చేసినవి. బడ్జెట్ 2017లో పెద్ద నగరాల్లో అధిక మొత్తాల్లో తీసుకునే గృహ రుణాలపై వడ్డీ రాయితీని ఆశించవచ్చు
9. గృహ రుణ ఈఎమ్ఐలపై అధిక మొత్తాలకు పన్ను మినహాయింపు
రూ. 2 లక్షల లోపు గృహ రుణ వడ్డీకి మాత్రమే ప్రస్తుతం పన్ను మినహాయింపు ప్రయోజనాలను క్లెయిం చేసుకోవచ్చు. ఈ సౌకర్యం అసలుపై రూ.1.50 లక్ష వరకూ మాత్రమే ఉండటం చాలా నిరాశ కలిగించే అంశం. ఈ రెండు విషయాల్లోనూ మినహాయింపు పరిమితులను పెంచాలని కోరుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు.
10. గృహ రుణ వడ్డీకి ముందస్తుగా పన్ను మినహాయింపుకు అవకాశం ఇస్తారా?
ప్రస్తుతం గృహ రుణ వడ్డీకి పన్ను మినహాయింపులు పొందాలంటే ఇంటి నిర్మాణం పూర్తయి ఉండాలి. కొనుగోలుదారు ఇల్లు చేరినప్పుడే పన్ను ప్రయోజనాలు కల్పిస్తారంటే ప్రయివేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తారు. ఒకసారి మనం ఇల్లు కొన్న తర్వాత ఎప్పటికో గానీ మనం వడ్డీ రాయితీ, పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందలేం. మొదటి ఈఎంఐ చెల్లింపు సమయం నుంచే దీన్ని పన్ను మినహాయింపుకు అవకాశం కల్పించాలని యువ దంపతులు కోరుతున్నారు.