పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందుకు ఆర్బీఐ గవర్నర్
రూ. 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విచారణ జరుపుతున్న పార్లమెంటుకు చెందిన ప్రజా పద్దుల కమిటీ (పిఏసి) కసర్తతును వేగవంతం చేసింది. నోట్ల రద్దు ప్రక్రియపై రిజర్వ
రూ. 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విచారణ జరుపుతున్న పార్లమెంటుకు చెందిన ప్రజా పద్దుల కమిటీ (పిఏసి) కసర్తతును వేగవంతం చేసింది. నోట్ల రద్దు ప్రక్రియపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్కు కొన్ని ప్రశ్నలను పంపించడమే కాకుండా ఈ నెల 20న కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నోట్ల రద్దుకు నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారు, దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో వివరించాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ను పిఏసి కోరినట్లు కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కెవి థామస్ చెప్పారు.
నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో నెలకొన్న నగదు కొరత, పాత నోట్ల డిపాజిట్లపై రోజుకో కొత్త నిబంధన తీసుకురావడం కారణాలతో ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్పై ప్రతిపక్షాలతో సహా అన్ని వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మరో పార్లమెంటు కమిటీ ముందు కూడా ఆయన హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంక్ తిరిగొచ్చిన కరెన్సీ విలువ ఎంత, అందుల్లో నల్లధనం ఎంత, ఇప్పటివరకు విడుదల చేసిన కొత్త కరెన్సీ మొత్తం ఎంత అనే వివరాలు తెలియజేయాలని పిఏసీ ఉర్జిత్ పటేల్ను కోరిందని థామస్ వెల్లడించారు. నగదురహిత లావాదేవీలకు దేశం ఏ విధంగా సన్నద్ధం అవుతూ ఉందో కూడా తెలియజేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. డిసెంబర్లోనే తాము ఆర్బిఐ గవర్నర్ను పిలవాలని అనుకున్నామని, అయితే ప్రధాని 50 రోజులు సమయం అడిగినందున జనవరికి వాయిదా వేసుకున్నామన్నారు. దీనికి రాజకీయ రంగు పులమడం తమకు ఇష్టం లేదని కూడా ఆయన తెలిపారు.