ఆ తర్వాత కూడా పాత నోట్లుంటే జైలుకే: కేంద్రం అత్యవసర ఆదేశం
మరో రెండు రోజుల్లో పెద్ద నోట్ల రద్దు డిపాజిట్ గడువు పూర్తికానున్నందున కేంద్ర ప్రభుత్వం బుధవారం ఓ కీలక ఆర్డినెన్స్(అత్యవసర ఆదేశం) జారీ చేసింది. మార్చి 31 తర్వాత కూడా రద్దయిన 500, 1000 రూపాయల నోట్లన
మరో రెండు రోజుల్లో పెద్ద నోట్ల రద్దు డిపాజిట్ గడువు పూర్తికానున్నందున కేంద్ర ప్రభుత్వం బుధవారం ఓ కీలక ఆర్డినెన్స్(అత్యవసర ఆదేశం) జారీ చేసింది. మార్చి 31 తర్వాత కూడా రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను భారీ పరిమాణంలో కలిగి ఉంటే క్రిమినల్ నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పది వేల రూపాయలు లేదా రద్దయిన నోట్ల విలువకు ఐదు రెట్ల మొత్తాన్ని జరిమానాగా వసూలు చేస్తామని, వీటిలో ఏది ఎక్కువగా ఉంటే దానిని అమలు చేస్తామని తెలిపింది. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే గడువు 30తో ముగుస్తున్నందున జనవరి 1 నుంచి మార్చి 31లోగా రిజర్వ్ బ్యాంకు ప్రత్యేక కౌంటర్లలో జమచేసే పాత కరెన్సీకి సంబంధించి తప్పుడు సమాచారం అందిస్తే 5వేలు లేదా కరెన్సీ విలువపై ఐదింతల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాత నోట్ల రద్దుకు సంబంధించి అత్యవసర ఆదేశంలోని వివరాలను చూద్దాం.
కేబినెట్ ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అత్యవసర ఆదేశాన్ని ఆమోదించారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే 50రోజుల గడువు తీరిన తర్వాత కూడా పాత నోట్లను కలిగి ఉంటే జరిమానా విధిస్తారా లేక 31 తర్వాతే ఇవి అమలులోకి వస్తాయా అన్నదానిపై ఆర్డినెన్స్లో స్పష్టత లేదు. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సెసెషన్ ఆఫ్ లయబిలిటి పేరిట ఈ ఆర్డినెన్స్ జారీ అయింది. ఇప్పటి వరకూ బ్యాంకులకు తిరిగిరాని పాత నోట్ల చెలామణిని రద్దు చేసేందుకు ఆర్బిఐ చట్టాన్ని సవరించడానికి కూడా ఈ ఆర్డినెన్స్ వీలుకల్పిస్తుంది.
చట్టపరంగా సమస్యలు ఉండకూడదనే...
నవంబర్ 8 నుంచే పెద్ద నోట్లు రద్దయినప్పటికీ కేవలం నోటిఫికేషన్తోనే వీటిపై రిజర్వ్ బ్యాంకు బాధ్యత తీరదు కాబట్టి చట్ట పరంగా తదుపరి సమస్యలు లేకుండాలంటే అది చట్టం ద్వారానే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతోనే ఈ ఆదేశాన్ని జారీ చేశారు. మార్చి 31 తర్వాత కూడా భారీగా పాత నోట్లను కలిగి ఉంటే నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ దీనికి కేబినెట్ ఆమోదం లభించిందా లేదా అన్నది స్పష్టం కాలేదు.
రాష్ట్రపతి ఆమోదం పొందాలి...
కేబినెట్ ఆమోదం లభించినప్పటికీ ఇది అమలులోకి రావాలంటే రాష్టప్రతి ఆమోదించాల్సి ఉంటుంది. రాష్టప్రతి ఆమోదం తర్వాత ఆరు నెలల్లో పార్లమెంట్ ఆమోద ముద్ర వేస్తేనే అది చట్ట రూపాన్ని సంతరించుకుంటుంది. అప్పటి నుంచే పది వేల రూపాయలకు పైగా పాత నోట్లను కలిగి ఉన్నా, బదిలీ చేసినా, పొందినా కూడా శిక్షార్హమైన నేరం అవుతుంది.
కఠిన నిబంధనలు
పాత నోట్ల చెలామణిని రద్దు చేసినా మార్చి 31 తర్వాత కూడా ఎవరైనా గరిష్ఠ స్ధాయిలో పదివేల వరకూ వాటిని కలిగి ఉండవచ్చు. డిసెంబర్ 30 తర్వాత కఠిన నిబంధనలను సంతృప్తి పరిచిన అనంతరం ఆర్బీఐ కేంద్రాలలోనే వీటిని డిపాజిట్ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇంత కాలం వీటిని ఎందుకు డిపాజిట్ చేయలేదో వివరణ ఇవ్వవలసి ఉంటుంది.
1978లో సైతం ఇంతే...
1978లో కూడా వెయ్యి, ఐదువేలు, పదివేల నోట్లను రద్దు చేసినప్పుడు కూడా అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం సైతం ఇలాంటి ఆర్డినెన్స్నే జారీ చేసింది. చెలామణిలో ఉన్న నోట్లను ఎప్పుడు రద్దు చేసినా చట్ట పరమైన సవరణలు తప్పనిసరిగా చేయాలి. నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 15.4లక్షల కోట్ల విలువ కలిగిన పాత రూ.500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటి వరకూ 14లక్షల కోట్ల మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్ కావడమో లేదా పాత నోట్లతో కొత్త నోట్లను మార్పిడి చేసుకోవడమో జరిగిందని అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.