సున్నా నిల్వ కలిగిన జన్ ధన్ ఖాతాలు 23 శాతమా?
జన్ధన్ ఖాతాల పరిస్థితి చాలా విచిత్రంగా తయారయింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర నిర్ణయం తర్వాత జన్ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు రాగా, నల్లధనాన్ని పెద్ద ఎత్తున తెల్లగా మార్చేందుక
జన్ధన్ ఖాతాల పరిస్థితి చాలా విచిత్రంగా తయారయింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర నిర్ణయం తర్వాత జన్ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు రాగా, నల్లధనాన్ని పెద్ద ఎత్తున తెల్లగా మార్చేందుకు వీటిని ఉపయోగిస్తున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే మరో వైపు ప్రతి 5 జన్ధన్ ఖాతాల్లో ఒకటి (23 శాతం) ఇప్పటికీ సున్నా నిల్వలతోనే కొనసాగుతోంది. నోట్ల రద్దు అనంతరం 30 రోజుల్లో జన్ధన్ ఖాతాల్లో రూ.29,000 కోట్లు జమ అయిన సంగతి తెలసిందే. దీంతో జన్ధన్ ఖాతాలన్నింటిలో డిపాజిట్ల విలువ డిసెంబర్ 7తో ముగిసిన వారానికి రూ.74,610 కోట్లుగా ఉంది. తొలుత ఈ ఖాతాల్లో డిపాజిట్లు పెరుగుతూ రాగా, ఆ తర్వాత ఆ స్థాయిలో సొమ్ము జమవ్వకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి జన్ ధన్ ఖాతాలో రూ.లక్ష బీమానా
జన్ధన్ ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో నగదు జమలను గమనించిన ప్రభుత్వం నల్లధనం మార్పిడికి సహకరిస్తే ఖాతాదారులపై చర్యలు ఉంటాయంటూ హెచ్చరిస్తూ వస్తోంది. నల్లధనం మార్పిడికి సహకరిస్తే ఐటీ చట్టం కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ సైతం టీవీ ప్రకటనలిస్తోంది. ఈ హెచ్చరికలు సత్ఫలితాలను ఇచ్చినట్లే తెలుస్తోంది. సామాన్యులు సైతం బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు జన్ధన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉంచాల్సిన అవసరం లేదు.అదే సమయంలో గరిష్టంగా రూ.50వేలకు మించి డిపాజిట్ చేయడానికి కూడా అనుమతి ఉండదు. కేవైసీ వెరిఫికేషన్ పూర్తిస్థాయిలో సక్రమంగా ఉంటే రూ. 1 లక్ష వరకూ డిపాజిట్ చేయొచ్చు. మొత్తం మీద డిసెంబరు 7 నాటికి 25 కోట్ల 82 లక్షల జన్ధన్ ఖాతాల్లో రూ.74609.50 కోట్ల నిల్వలు ఉన్నాయి.