పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తొందరపాటు నిర్ణయం కాదు: ఊర్జిత్ పటేల్
పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తొందరపాటుగా తీసుకున్నది కాదని, అన్నివిధాల ఆలోచించి, సమగ్ర సంప్రదింపుల తర్వాతే తీసుకున్నదని ఆర్బిఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులు, ఎట
పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తొందరపాటుగా తీసుకున్నది కాదని, అన్నివిధాల ఆలోచించి, సమగ్ర సంప్రదింపుల తర్వాతే తీసుకున్నదని ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులు, ఎటిఎమ్ల వద్ద ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల మధ్య పటేల్ పైవిధంగా వివరణ ఇచ్చారు. ఎలా అమలు చేయాలి, దానివల్ల కలిగే పర్యవసానాలను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపైనా తీవ్రంగా సమాలోచనలు జరిపినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆశయానికి భంగం కలగకుండా, నల్లధన కుబేరులు తప్పించుకోకుండా అత్యంత గోప్యత పాటించామన్న పటేల్.. నవంబర్ 8వ తేదీ రాత్రి నిర్ణయాన్ని ప్రకటించామని తెలిపారు.
రద్దయిన నోట్లలో 80 శాతం ఇప్పటికే బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయన్న ఆయన నగదు లభ్యతలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఆర్బిఐ చర్యలు చేపడుతోందని, కొత్త కరెన్సీ నోట్ల సరఫరా కొనసాగుతోందని వివరించారు. ఇప్పటివరకూ 11.85 లక్షల కోట్ల రూపాయలను పాత, రద్దయన నోట్ల స్థానంలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి చొప్పించినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే. కొత్త 500, 2,000 రూపాయల నోట్లనూ పరిచయం చేయగా, రద్దయిన నోట్లను బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో డిపాజిట్ చేసుకుని, అంతే విలువైన కొత్త నోట్లను, పాత 100, 50 ఇతరత్రా నోట్లను పొందవచ్చని, డిసెంబర్ 30 వరకు ఈ అవకాశం ఉందనీ ప్రధాని ప్రసంగంలో చెప్పిన సంగతి తెలిసిందే.