పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద లావాదేవీలకు డిసెంబరు 30 వరకూ రుసుముల్లేవ్
తెలుగు గుడ్రిటర్న్స్ తమ పాఠకుల కోసం కొత్త ఫీచర్ను ప్రారంభించింది. తెలుగులో బిజినెస్ వార్తలు సంక్షిప్తంగా, వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ వార్తలను చదివేలా ఒకే కథనంలో అన్ని వార్తలను సంక్షి
తెలుగు గుడ్రిటర్న్స్ తమ పాఠకుల కోసం కొత్త ఫీచర్ను ప్రారంభించింది. తెలుగులో బిజినెస్ వార్తలు సంక్షిప్తంగా, వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ వార్తలను చదివేలా ఒకే కథనంలో అన్ని వార్తలను సంక్షిప్తీకరిస్తోంది. ఉద్యోగ జీవితాలతో అందరూ బిజీగా ఉంటున్న సమయం ఇది. అలాంటి వారి కోసమే ముందు రోజు వార్తలు సంక్షిప్తంగా, వేగంగా చదివేందుకు. దీని ద్వారా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్; బంగారం ధరలను ఒకేచోట తెలుసుకోండి.
2017-18 వృద్ది అంచనాలు 5.8 శాతానికి తగ్గింపు
హఠాత్తుగా ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశ వృద్దిని వదల్లేదు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ అంచనాలను ఇంతకుముందు ఉన్న7.3 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించారు. పెద్ద నోట్ల రద్దు దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రయోజనాలనే అందించనున్నా స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు తప్పవని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు ఎఫ్ఎమ్సీజీ క్యూ3 ఆదాయాలను దెబ్బతీస్తుంది
పెద్ద నోట్ల రద్దు తర్వాత వినియోగదార్లు ఆచితూచి ఖర్చు చేస్తుండటంతో ఎఫ్ఎమ్సీజీ, ప్యాకేజీ ఫుడ్ సంస్థలపై ప్రభావం ప్రతికూలంగా ఉండనుంది. రెండో త్రైమాసికంలో మంచి వృద్దిని కనబరిచిన ఎఫ్ఎమ్సీజీలు మూడో త్రైమాసికంలో స్వల్ప ఒడిదొడుకులకు లోనుకావొచ్చని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ భాగస్వామి అనిల్ తల్రేజా చెప్పారు. అయితే ఆ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడం కాస్త తొందరబాటే అవుతుందన్నారు.
పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద లావాదేవీలకు డిసెంబరు 30 వరకూ రుసుముల్లేవ్
పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద చేసుకునే నగదు విత్డ్రాయల్స్కు డిసెంబరు 30 వరకూ ఎలాంటి రుసుములు ఉండవని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. అంతే కాకుండా పాయింట్ ఆఫ్ సేల్స్(పీవోఎస్) వద్ద నగదు విత్డ్రాయల్ పరిమితిని రోజుకు రూ. 1000 నుంచి రూ. 2000 వేలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఇదివరకే ఏటీఎమ్ల్లో లావాదేవీలకు డిసెంబరు 30 వరకూ ఎటువంటి రుసుములు ఉండబోవని ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
జీడీపీపై 0.3-0.5% ప్రభావం ఉండొచ్చు: కేర్ రేటింగ్స్
పెద్ద నోట్ల రద్దు కారణంగా జీడీపీపై 0.3 నుంచి 0.5 శాతం వరకూ ప్రభావం పడొచ్చని కేర్ రేటింగ్స్ అధ్యయనం అంచనా వేసింది. ఈ నివేదికలో సేవా రంగం నుంచి ప్రముఖంగా ప్రస్తావించింది. వచ్చే మూడో త్రైమాసికంలో ఈ రంగంపై బాగా ప్రభావం పడుతుందని నాలుగో త్రైమాసికంలో తిరిగి అది మామూలు స్థితికి చేరుకోవడం కఫ్టమని పేర్కొంది. అదే తయారీ రంగంలో క్యూ3లో వచ్చే షార్ట్ ఫాల్ క్యూ4లో కొంచెం వరకూ రికవరీ అవ్వొచ్చని అధ్యయనంలో విశ్లేషించారు. మొదటి రెండు వారాల్లోనే వ్యవసాయ ఉత్పత్తులు ప్రభావాన్ని ఎదుర్కొన్నాయని నవంబరు చివరికల్లా పరిస్థితులు సద్దుమణుగొచ్చని అంచనా వేశారు.
డానిష్ స్టార్టప్లో ఇన్ఫోసిస్ రూ. 14.5 కోట్ల పెట్టుబడులు
ఇన్ఫోసిస్ మరో స్టార్టప్లో పెట్టుబడులు పెట్టింది. యున్సిలో(UNSILO) అరు డానిష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లో రూ. 14.5 కోట్ల మేర పెట్టుబడలు పెట్టనుంది. పెద్ద మొత్తంలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించేందుకు సహజ ల్యాంగేజీ ప్రాసెసింగ్ను ఉపయోగించే సంస్థ యున్సిలో. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించేందుకు కొత్త పరిశ్రమల రంగాలకు ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఇది ఇన్ఫోసిస్కు 11వ స్టార్టప్ పెట్టుబడి కాగా క్యాలెండర్ ఇయర్లో నాలుగోది.
ఫసల్ బీమాకు డిసెంబరు ఆఖరు వరకూ గడువు
బ్యాంకుల నుంచి రుణం పొందని రైతులు ప్రీమియం చెల్లించేందుకు ఇంకా గడువు ఉంది. రైతుకు ఇష్టం ఉంటేనే బీమాకు ప్రీమియం చెల్లించవచ్చు. లేదా మానుకోవచ్చు. మొక్కజొన్న పంటకు డిసెంబర్ 15 ఆఖరి రోజు కాగా ఇతర పంటలకు డిసెంబర్ 31వతేదీ వరకు గడువు ఉంది. వరికి ఎకరాకు రూ.420 చెల్లిస్తే రూ.28వేలు బీమా కల్పిస్తారు. మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ.300 ప్రీమియం చెల్లిస్తే రూ.20వేల బీమా కల్పిస్తారు. మిరపకు ఎకరాకు రూ.1750 ప్రీమియం చెల్లిస్తే రూ.35 వేలు బీమా వర్తిస్తుంది. జొన్నకు రూ.150 ప్రీమియం చెల్లిస్తే రూ.10వేలు, వేరుశనగ పంటకు రూ.270 ప్రీమియం చెల్లిస్తే రూ.18వేలు బీమా కల్పిస్తారు.
పెద్ద మొత్తంలో కార్మికులు ఉన్న చోట సంచార ఏటీఎమ్లు పెట్టండి: దత్తాత్రేయ
పెద్ద మొత్తంలో కార్మికులు ఉన్న చోట మొబైల్(సంచార) ఏటీఎమ్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి దత్తాత్రేయ ఆర్థిక శాఖను కోరారు. కార్మిక(వర్క్ ఫోర్స్) గురించి సమాచారం కావాలంటే కార్మిక శాఖ అందిస్తుందని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులు ఉండే వివరాలను సేకరించే పనిలో తమ శాఖ నిమగ్నమై ఉందన్నారు. వచ్చే బడ్జెట్లో అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు దత్తాత్రేయ చెప్పారు.
తగ్గిన విదేశీ మారక నిల్వలు
నవంబర్ 11తో ముగిసిన వారంలో భారత్ విదేశీ మారక నిల్వలు 119 కోట్ల డాలర్లు తగ్గి 36,704 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో ఈ నిల్వలు 36,823 కోట్ల డాలర్లకు పెరిగాయి. సెప్టెంబర్ 30తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 37,199 కోట్ల డాలర్లకు చేరి జీవితకాల రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత వద్ద బంగారం నిల్వలు 2,046 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 1.34 కోట్ల డాలర్లు తగ్గి 146.2 కోట్ల డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వలు 234.6 కోట్ల డాలర్లకు తగ్గాయి.
హైదరాబాద్లో బంగారం ధరలు
హైదరాబాద్ నగరంలో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 30,770గా ఉండగా; ఈ రోజు 30,270 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ. 28,770గా ఉండగా ఈరోజు 28,300 వద్ద ఉంది.