దూసుకుపోతున్న మ్యూచువల్ ఫండ్ ఆస్తులు
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తుల విలువ అక్టోబర్ నెల ముగిసేనాటికి రికార్డు స్థాయలో రూ. 16.28 లక్షల కోట్లుగా నమోదైంది. పెరిగిన ఆదాయం, స్టాక్ మార్కెట్ల పెట్టుబడు లపై వస్తున్న లాభాలతో ఇంతకు ముందు ఎప్పుడూ లే
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తుల విలువ అక్టోబర్ నెల ముగిసేనాటికి రికార్డు స్థాయలో రూ. 16.28 లక్షల కోట్లుగా నమోదైంది. పెరిగిన ఆదాయం, స్టాక్ మార్కెట్ల పెట్టుబడు లపై వస్తున్న లాభాలతో ఇంతకు ముందు ఎప్పుడూ లేనివిధంగా పరిశ్రమ ఆస్తులు పెరిగాయి. సెప్టెంబర్ నెలాఖరుకు రూ. 15.8 లక్షల కోట్లుగా ఉన్న ఎమ్ఎఫ్ ఆస్తుల విలువ నెల రోజుల వ్యవధిలో మరో 50 వేల కోట్ల రూపాయలు పుంజుకున్నాయి. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అక్టోబర్లో మ్యూచువల్ ఫండ్స్ (ఎమ్ఎఫ్) పెట్టుబడులు 8,000 కోట్ల రూపాయలకుపైగా వచ్చాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో అక్టోబర్తో ముగిసిన 7 నెలల కాలంలో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ. 21,000 కోట్లకుపైగా నమోదైంది.
వస్తు, సేవల పన్ను (జిఎస్టీ)కు పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఆమోదం లభించడం మదుపరులను ఆకట్టుకుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లలోకి అక్టోబర్లో 8,100 కోట్ల రూపాయల పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు తెచ్చారని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సెప్టెంబర్లో ఇది 3,841 కోట్ల రూపాయలుగా ఉంటే, ఆగస్టులో 2,717 కోట్ల రూపాయలుగానే ఉంది. అయితే అంతకుముందు రెండు నెల (జూన్-జూలై)ల్లో 120 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. కానీ మే నెలలో 7,149 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాగా, ఏప్రిల్లో మళ్లీ 575 కోట్ల రూపాయల పెట్టుబడులను విత్డ్రా చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి మొదలైన ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన మొత్తం మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల విలువ 21,118 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 70,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలోకి మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు తీసుకొచ్చారు.