సులభతర వ్యాపార నిర్వహణలో ఏపీ, తెలంగాణ ప్రథమ స్థానంలో
సులభతర వ్యాపార నిర్వహణలో రెండు తెలుగు రాష్ట్రాలు అన్నింటితో పోటీపడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. సరిగ్గా చెరో 98.78 శాతం మార్కులు సాధించి ఉమ్మడిగా ఒకటో స్థానాన్ని సాధించాయి.ఇది చాలా ఆశ్చర్
సులభతర వ్యాపార నిర్వహణలో రెండు తెలుగు రాష్ట్రాలు అన్నింటితో పోటీపడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. సరిగ్గా చెరో 98.78 శాతం మార్కులు సాధించి ఉమ్మడిగా ఒకటో స్థానాన్ని సాధించాయి. ఇది చాలా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశ ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ రెండు గతేడాది అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ను మూడో స్థానాన్ని వెనక్కు నెట్టాయి. అంతే కాకుండా గతేడాది 13 వ స్థానంలో తెలంగాణ తన సంస్కరణల ద్వారా ప్రథమ స్థానానికి ఎగబాకింది. పరిశ్రమల స్థాపనకు సానుకూల వాతావరణం కల్పిస్తూ నిర్ణీత కాలవ్యవధిలో అనుమతులు, ప్రోత్సాహాలు ఇవ్వడంలో ముందంజలో ఉండే రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంస్కరణలేంటో, మొదటి ర్యాంకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.
2009 ఉద్యమం
2009లో తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు వచ్చిన ప్రధానమైన డిమాండ్లలో ఉద్యోగాల కల్పన ఒకటి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోస్తా ఆంధ్ర ప్రజలు తమకు అన్యాయం చేస్తున్నారని నినదించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పాలకుల ముందు ఉద్యోగాల కల్పన ఏ విధంగా చేయాలనే అంశం సవాలుగా నిలిచింది. ఒక పక్క తక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు, యువతలో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలను ఎక్కువగా ఆకర్షించడం ద్వారా ఉద్యోగాలను కల్పించడమే కాకుండా పన్ను ఆదాయాన్ని పెంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.
హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోయిన ఏపీ
మరో వైపు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణకు కోల్పోయింది. ఎందుకంటే అక్కడ నుంచి భారీ స్థాయిలో వాణిజ్య పన్నుల వసూళ్లు జరుగుతుంటాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ సైతం పరిశ్రమలను నెలకొల్పడం ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించడం సాధ్యమవుతుందని విశ్వసించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కంటే సీఈవోగానే పనిచేసేందుకు ఆసక్తి చూపారు.
ఏకగవాక్ష(సింగిల్ విండో) అనుమతులు
అధికార స్థాయిలో అవినీతిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆన్లైన్లోనే పరిశ్రమలు అనుమతుల కోసం దరఖాస్తు చేయవచ్చు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సైతం సింగిల్ డెస్క్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ ఆన్లైన్ అనుమతుల విధానాల్లో ఒకవేళ గడువు లోపు ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోతే ఆటోమేటిక్గా అనుమతులు వచ్చినట్లే పరిగణిస్తారు. ఇందుకు తెలంగాణ 15 రోజుల గడువును, ఆంధ్రప్రదేశ్ 21 రోజుల గడువును విధించాయి.
ఆంధ్రప్రదేశ్లో సత్వర అనుమతులు
గత ఒకటిన్నర సంవత్సర కాలంలో 11 వేల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు, ముఖ్యమంత్రి కృషి ఫలితంగా 357 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 4లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. తద్వారా దాదాపు 7 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు అంచనా.
ఏపీ సంస్కరణలు
ఆంధ్ర సంస్కరణల్లో పన్ను, పవర్ సబ్సిడీలు వంటివి ఉన్నాయి. వ్యాట్, సేల్స్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్, యూనిట్ విద్యుత్ ఖరీదు రూ. 1 వంటి ద్వారా పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని కల్పించారు. పరిశ్రమలకోసం డిజిటలీకరణ చేసిన భూ బ్యాంకు మరో సానుకూలాంశం. గతంలో 15 శాఖల నుంచి 54 క్లియరెన్సెస్ కోసం 3 నెలల సమయం పడుతుండగా ప్రస్తుతం ఆ మొత్తాన్ని 21 రోజుల్లో జరిగేలా చూశారు.
తెలంగాణ ప్రభుత్వ విధానాల రూపకల్పన
ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పారదర్శకత, సింగిల్ విండో విధానం, భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రధాన విభాగాల్లో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలకు గరిష్ట మార్కులు వచ్చాయి. దీని వల్లే గతేడాది 13వ స్థానంలో ఉన్న నూతన రాష్ట్రం మొదటి స్థానం సాధించగలిగేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ విధానాలు గొప్పగా ఉండ బట్టే అతి తక్కువ సమయంలో తెలంగాణకు 2,550 పరిశ్రమలు వచ్చాయి.
కేటీఆర్ స్పందన
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రగతి పథంలో ముందుకు వెళుతోందన్నారు మంత్రి కేటీఆర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణకు అగ్ర స్థానం రావడమే దీనికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వేల్లోనూ తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా నిలిచిందన్నారు కేటీఆర్. ఇప్పటికే తాము అనుసరిస్తున్న పారిశ్రామిక విధానానికి ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. 22 శాఖల సమన్వయంతో 9 నెలల్లో మెరుగైన ఫలితాలు సాధించామని తెలిపారు. కొత్తగా 113 ఆన్లైన్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు.