టాటా గ్రూప్ తదుపరి చైర్మన్ ఎవరో?
దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించడంతో ఆ పదవికి తగిన సమర్థులు ఎవరు? అన్న అంశం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, పెప్సీకో సీఈవో ఇంద్రానూయి
దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించడంతో ఆ పదవికి తగిన సమర్థులు ఎవరు? అన్న అంశం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, పెప్సీకో సీఈవో ఇంద్రానూయి, వొడాఫోన్ మాజీ సీఈవో అరుణ్శరీన్, నోయెల్ టాటా, టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖరన్, నందన్ నీలేకని, టాటా గ్రూపునకే చెందిన ఇషాంత్ హుస్సేన్, బి.ముత్తురామన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఈ పదవిని చేపట్టేవారు టాటా గ్రూపు విలువను పాటిస్తూ సంస్థకు విశ్వాస పాత్రులై ఉండాలి. అంతర్జాతీయ వ్యాపారాన్ని అర్థం చేసుకునే నేర్పు ఉంటే మంచిది. ఎందుకంటే టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. జాగ్వార్ ల్యాండ్రోవర్ నిర్వహణతో పాటు, యూరప్లో కోరస్ ఉక్కు వ్యవహారాలను సైతం చూడాల్సి ఉంటుంది.
తదుపరి పగ్గాలు ఎవరికి?
సైరస్ మిస్త్రీని తొలగించినప్పటి నుంచి పలు పరిణామాలపై పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా పలు ట్వీట్లు చేస్తున్నారు. తదుపరి ఎన్.చంద్రశేఖరన్, రవి వెంకటేశన్, సంజయ్ ఝా, శంతను నారాయణ్, నందన్ నీలేకని రేసులో ఉండొచ్చని ట్వీటులో రాసుకొచ్చారు. అంతర్జాతీయంగా అనుభవం కలిగి ఉన్న వ్యక్తుల వైపు చూస్తే మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈవో అజయ్ బంగా; పెప్సికో సీఈవో ఇంద్రా నూయి పేర్లు వినిపిస్తున్నాయి.
ఎన్.చంద్రశేఖరన్
టాటా కన్సల్టెన్సీ సీఈవోగా ఎన్.చంద్రశేఖరన్ పనిచేస్తున్నారు. చాలా కారణాల చేత ఈయనే రేసులో ముందున్నారు. మిగిలిన వారితో పోలిస్తే ఆయన ఇంకా కాస్త వయసులో చిన్న వ్యక్తిగా, సమగ్ర విలువలు కలిగి, టీసీఎస్ను లాభాల దిశగా నడిపించడం వంటి సానుకూలతలను కలిగి ఉన్నారు. టీసీఎస్ను చాలా ఏళ్ల పాటు విజయవంతంగా మార్గనిర్దేశనం చేయడంతో పాటు టాటా గ్రూపు విలువను బాగా అవపోశన పట్టి ఉన్నారు.
అయితే ప్రతికూలతను చూస్తే ఇంతకుముందు లాగా టీసీఎస్ త్రైమాసిక ఫలితాల్లో మెరుగుదలను ఆశించినంతగా కనబరచడం లేదు. ప్రతి త్రైమాసిక ఫలితాల్లో ఆ పరిస్థితి దిగజారుతోంది. టీసీఎస్కు ఇది చాలెంజింగ్ టైమ్. అందుకే టీసీఎస్ను ప్రస్తుతం వృద్ది పథంలో నడిపించాలంటే ఆయన అవసరం ఉంది.
ఇంద్రా నూయి
మరో వైపు అంతర్జాతీయంగా మహిళా పారిశ్రామికవేత్తలో పేరున్న పెప్సికో సీఈవో ఇంద్రా నూయి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ అండ్ బేవరెజేస్ కంపెనీకి సారథ్యం వహిస్తున్న ఆమెకు అంతర్జాతీయ వ్యాపార రంగంలో మంచి అనుభవం ఉంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్తో పాటు, కోరస్ సంస్థలను నడిపించాలంటే ఈ అనుభవం అదనపు బలంగా నిలుస్తుంది. టాటా గ్రూప్ ఉప్పు నుంచి విమానం వరకూ పలు రంగాల్లో తన ఉత్పత్తులను, సేవలను కలిగి ఉన్న విషయం తెలిసిందే.
నోయల్ టాటా
నావల్, సిమోన్ టాటాల తనయుడు నోయల్ టాటా. ట్రెంట్కు చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయన టాటా ఇంటర్నేషనల్కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. టాటాల కుటుంబం నుంచి రావడం ఆయనకు ఉన్న ప్రధాన సానుకూలత. అయితే టాటా గ్రూపు మొత్తాన్ని నిర్వహించడం అంత సులువైన విషయం కాదు. కొన్ని అంతర్జాతీయ వ్యవహారాలను నిర్వహించడం కత్తిమీద సాము వంటిదే. ఇంకా టాటా స్టీల్(యూరప్) యూనిట్
అమ్మకాలు, కొన్ని గ్రూపు ప్రధాన సంస్థల పునర్వ్యవస్థీకరణలను ఎంతో జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంది. టాటా డోకొమో వ్యవహారం చాలా రోజుల నుంచి నడుస్తుండటం మీకు తెలిసిందే.
నందన్ నీలేకని
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో నందన్ నీలేకని ఒకరు. అయితే అందరూ వ్యవస్థాపకులు కలిగిన వైవిధ్యమైన అనుభవం కలిగి లేరు. కోరస్ లాంటి సంస్థలను నిర్వహించే నైపుణ్యం ఆయనకు ఉన్నాయో లేవో తెలియవు. 12.1 బిలియన్ డాలర్లు వెచ్చించి టాటా గ్రూప్ కోరస్ స్టీల్ను స్వాధీనం చేసుకుంది. ప్రపంచంలోనే ఏ భారతీయ కంపెనీ చేపట్టిన అత్యున్నత స్వాధీనం ఇదే. టాటా స్టీల్ ప్రస్థానంలో ఇది ఒక మైలు రాయి.