దేశంలో 10 ఖరీదైన నగరాలు
ఇంటి అద్దె, ఫుడ్(ఆహారం), రవాణా, హెల్త్ కేర్ వంటి అంశాలు కాస్ట్ ఆఫ్ లివింగ్ను నిర్దారిస్తాయి. 2016-17 సంవత్సరానికి గాను ఇండియాలో 10 ఖరీదైన నగరాల జాబితాను ఇక్కడ చూద్దాం.
ఇండియాలో పట్టణీకరణ ఇప్పుడిప్పుడే వేగంగా అభివృద్ది చెందుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేక ప్రజలు వలసబాట పడుతున్నారు. టైర్2,టైర్3 నగరాల్లో ఒక స్థాయిలో ఖర్చులున్నా ప్రజలు భరించగలుగుతున్నారు. దేశంలోని మెట్రో నగరాల్లోనే కాకుండా ఇతర టైర్-1 నగరాల్లో సైతం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇంటి అద్దె, ఫుడ్(ఆహారం), రవాణా, హెల్త్ కేర్ వంటి అంశాలు కాస్ట్ ఆఫ్ లివింగ్ను నిర్దారిస్తాయి. 2016-17 సంవత్సరానికి గాను ఇండియాలో 10 ఖరీదైన నగరాల జాబితాను ఇక్కడ చూద్దాం. ఈ నగరాలు ప్రధానంగా ఎగువ మధ్య తరగతి వారికి ప్రధాన నివాస కేంద్రాలుగా ఉన్నాయి. వారంతా మంచి ఉద్యోగాలు చేస్తూ గౌరవ ప్రదమైన వేతనాలను పొందుతున్నారు. వారు ఖర్చుపెట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అయితే దిగువ మధ్యతరగతి, పేద వారికి ఈ నగరాల్లో ఖర్చులు భరించలేని విధంగా ఉన్నాయి.
1. ముంబయి ( 338.65 డాలర్లు- 1197 డాలర్లు)
ముంబయి దేశ ఆర్థిక రాజధాని మాత్రమే కాకుండా బాలీవుడ్కు ఇది ప్రధాన కేంద్రం. ప్రపంచంలో మరే సినీ పరిశ్రమ సృష్టించలేనన్ని సినిమాలను బాలీవుడ్ తీస్తోంది. స్వాతంత్రం తర్వాత నుంచి ముంబయి పరిసరాల నుంచి కొన్ని లక్షల మంది ఉపాధి కోసం వలస వచ్చారు. ముంబయిలో మధ్య తరగతి జీవనాన్ని ఫ్రాంక్పర్ట్, సియాటిల్ జీవనంతో పోలుస్తూంటారు. అంటే అంతే ఖరీదైన జీవన శైలి. స్థిరాస్తి ఖరీదు తారా స్థాయిలో ఉండటం ఈ నగరంలో సామాన్యులకు ఒక ప్రతికూలత. ఈ నగర జీడీపీ దేశంలోనే అత్యధికం.
2. ఢిల్లీ ( 340.61 డాలర్లు- 1176 డాలర్లు)
దేశ రాజధాని ఢిల్లీ ఎన్నో పరిశ్రమలకు నిలయం. ఇది దేశంలోని ఏ మెట్రో నగరం కన్నా అతి పెద్దది. ఉత్తర భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఎంతో మంది వినియోగదారులను కలిగి ఉండటమే గాక, నైపుణ్యం కలిగిన కార్మికులకు నిలయం కావడంతో ఇక్కడికి విదేశీ పెట్టుబడులు బాగానే వస్తాయి. విపరీతమైన వాయి కాలుష్యం ఉన్నప్పటికీ ఈ నగరం టెలికమ్యూనికేషన్లు, ఐటీ వ్యాపారానికి హబ్గా కొనసాగుతోంది. ప్రపంచ స్థాయి హోటళ్లు, ఆసుపత్రులు, తయారీ రంగ యూనిట్లు సైతం ఇక్కడ ఉన్నాయి.
3. బెంగళూరు (307.44-1104.14 డాలర్లు)
కర్ణాటక రాజధాని నగరమైన బెంగుళూరు ఐటీ సంస్థలకు కేంద్ర బిందువు. అందుకే అందరూ దీన్ని ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పిలుచుకుంటారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో చాలా సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇంకా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ విద్యా, పరిశోధనా సంస్థలు ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇక్కడ ఉంది. బెంగళూరు ప్రస్తుతం 10.3% ఆర్థిక వృద్దిని సాధిస్తోంది. వచ్చే దశాబ్దంలో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ది చెందబోయే నగరాల జాబితాలో చోటు దక్కించుకునేందుకు అవకాశం ఉంది.
4. పుణె (301.09-1074.33 డాలర్లు)
ముంబయి తర్వాత దేశంలో మరో ప్రధాన ఆర్థిక, వాణిజ్య కేంద్రం పుణె. ఎన్నో ఆటోమొబైల్, తయారీ రంగ పరిశ్రమలకు ఈ నగరం నిలయమైంది. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకుంటారు. ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు ఇక్కడ ఉండటమే ఇందుకు కారణం. 1950ల నుంచి వేగవంతమైన అభివృద్ది ఇక్కడ జరుగుతోంది. ఐటీ, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాల్లో విదేశీ పెట్టుబడులను బాగా ఆకర్షిస్తోంది. దేశంలో చాలా ఇతర నగరాల కంటే మనం ఖర్చు పెడుతున్న డబ్బుకు మంచి సదుపాయాలు లభించే నగరంగా పుణెకు పేరుంది.
5. కోల్కత (300.67-1055.97 డాలర్లు)
కోల్కతను సిటీ ఆఫ్ జాయ్గా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ నగర జీవన శైలి అలా ఉంటుంది. పశ్చిమ బెంగాల్కు రాజధాని అయినటువంటి ఈ నగరం బ్రిటీష్ కాలం నుంచి నగరీకరణలో ముందు వరుసలో ఉంది. దేశంలోనే పురాతన పోర్టును కలిగి ఉండటంతో పాటు తూర్పు భారతంలోనే ఒక ముఖ్య నగరంగా ఉంది. వాణిజ్య పరంగా తూర్పు భారతదేశానికి ప్రధాన కేంద్రం కోల్కతనే. సైన్స్ నుంచి సంస్కృతి వరకూ వివిధ రంగాల్లో దూసుకెళ్లిన కోల్కత గత కొన్ని దశాబ్దాలుగా ఆశించిన అభివృద్దిని సాధించలేకపోతోంది. ఉత్పత్తి, తయారీ రంగంలో శీఘ్రమైన వృద్ది లేనప్పటికీ స్థిరాస్తి, రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
6. చెన్నై (301.33-1052.46 డాలర్లు)
దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ తీర ప్రాంత నగరం చెన్నై. ఆటోమొబైల్ పరిశ్రమ ఆ నగరానికి ఉన్న ప్రధాన సానుకూలత. లోన్లీ ప్లానెట్ రూపొందించిన జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వీక్షించడానికి భాగా ఉండే నగరాల్లో చెన్నై చోటు సంపాదించుకుంది. దేశీయ పర్యాటకులే కాకుండా విదేశీ పర్యాటకులు సైతం ఇక్కడకు బాగా వస్తూ ఉంటారు. తక్కువ నేరాలు నమోదు కావడం మూలంగా చెన్నై సురక్షిత నగరంగా ఉంటోంది. ఐటీ ఔట్సోర్సింగ్ ఈ నగరం నుంచి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఐటీ ఎగుమతుల్లో దేశంలో ఐదు ప్రముఖ నగరాల్లో చెన్నై ఒకటి. ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఒక పక్క తయారీ, హెల్త్ కేర్ రంగాలే కాకుండా ఆర్థిక రంగం(ఫైనాన్స్ సెక్టార్)లో కూడా ఇది తనదైన ముద్రను వేసింది.
7. చంఢీఘడ్( 299.24 డాలర్లు- 1040.56 డాలర్లు)
స్వాతంత్రం తర్వాత చాలా ముందుగా నగర ప్రణాళికను పక్కాగా ఏర్పరుచుకున్న నగరం చండీఘడ్. భారత్లోనే కాదు ప్రపంచంలోనే ఉత్తమ నగరాల్లో ఒకటిగా ఈ నగరం ఉంది. నగరం ఆర్కిటెక్చర్(నిర్మాణ శైలి), సంస్కృతి, నగరీకరణ చూపరులను ఆకట్టుకుంటాయి. నిరంతరం దేశంలోనే స్వచ్చమైన నగరాల్లో ముందు వరుసలో ఉండటమే గాక ఎన్నో పెద్ద నగరాలకు ఇది ఆదర్శంగా నిలుస్తోంది. చండీఘడ్ జనాభా చాలా నగరాల్లో జనాభా కంటే రిచ్గా ఉండటమే గాక సంతోషంగానూ ఉంటారని నివేదికలు చెబుతున్నాయి. పేపర్ తయారీ, మెటలర్జీ(లోహాలు), మెషినరీ, ఫార్మాస్యుటికల్ వంటివి ఈ నగరంలో ఉన్న ప్రధానమైన పరిశ్రమలు.
8. హైదరాబాద్ (270-961 డాలర్లు)
నిజాంల కాలం నుంచి గొప్ప ఆర్కిటెక్చర్ను కలిగి ఉన్న భాగ్యనగరం వాస్తు, సంస్కృతి, కళలకు పెట్టింది పేరు. తెల్ల రంగు ముత్యాలతో ప్రసిద్ది పొందిన ఈ నగరాన్ని ముత్యాల నగరం(సిటీ ఆఫ్ పెర్ల్స్)గానూ పిలుచుకుంటారు. 1990ల నుంచి క్రమంగా ఐటీ పరిశ్రమ వృద్ది చెందుతూ వస్తోంది. అంతే కాకుండా ఫార్మా, బయోటెక్నాలజీ వ్యాపారాలు విస్తరిస్తూ ఉండటంతో ఇండియన్ జీనోమ్ వ్యాలీ అనే పేరు వచ్చింది. ఈ నగరంలో 90శాతం కార్మికులు సేవా రంగంలోనే తమ ఉపాధిని పొందుతున్నారు. హైదరాబాద్ బిర్యానీ, హలీమ్ వంటకాలతో ఈ నగరం ఫుడ్(ఆహారానికి) బాగా ప్రసిద్ది చెందింది.
9. అహ్మదాబాద్ (277.62 - 957.35 డాలర్లు)
గుజరాత్లో అతిపెద్ద నగరం అహ్మదాబాద్. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ నగరం పట్టుగొమ్మగా ఉంటోంది. జనాభా వృద్ది, రియల్ ఎస్టేట్, హౌసింగ్, టెలికమ్యూనికేషన్, నిర్మాణ రంగం వంటి వాటిల్లో నిరంతర వృద్దితో జీవ నగరంగా వెలుగొందుతోంది. మొత్తం ఇండియాలో రెండో అతిపెద్ద కాటన్ ఉత్పత్తిదారు ఈ నగరం. స్వాతంత్రం రాక పూర్వం నుంచి కూడా ఇది టైక్స్టైల్స్కు హబ్గా ఉంటోంది. అందుకే ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటారు.
10. జైపూర్ (294- 1015 డాలర్లు)
రాజస్థాన్లో పెద్ద నగరమే కాకుండా రాష్ట్ర రాజధాని నగరంగా జైపూర్ ఉంది. దేశంలో టూరిస్టులకు ప్రముఖ ఆకర్షణీయంగా కేంద్రంగా ఉన్న దీనిని పింక్ సిటీ అంటారు. జెమ్ స్టోన్లు(విలువైన రాళ్లు), విలాసవంతమైన వస్త్రాలు, అరుదైన చేనేత, హస్త కళలు వంటివి ఇక్కడ ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. దేశంలోనే ఖరీదైన హోటళ్లకు జైపూర్ నిలయంగా ఉంది. ఇవి భారత్లోనే ప్రపంచంలోనే ఖరీదైనవిగా సైతం ఉంటున్నాయని ఎంతో మంది పర్యాటకులు చెబుతుంటారు.