దేశంలో టెక్ సంపన్నులు వీరే
భారతదేశంలో అత్యంత ధనవంతులైన టెక్ బిలియనీర్ల టాప్-10 జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. 2016 సంవత్సరానికి గాను విడుదల చేసిన ఈ జాబితాలో పాత వ్యక్తులు చాలావరకు తమ స్థానాల్లో కొనసాగినప్పటికీ కొందరు కొత్తవాళ్లు కూడా వచ్చిచేరారు. టెక్ సంపన్నులు, వారి ఆస్తుల విలువ ఈ విధంగా ఉంది.
అజీం ప్రేమ్జీ
విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 2015లో 15.9 బిలియన్ డాలర్లుగా ఉండగా 2016లో 15 బిలియన్లుగా ఉంది. గతేడాది ప్రేమ్జీ 3వ స్థానంలో ఉన్నారు. ఈయన విప్రో సీఈవోగా 5 దశాబ్దాల కాలాన్ని పూర్తిచేసుకున్నారు.
శివ్ నాడార్
హెచ్సీఎల్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ శివ్ నాడర్ రెండో స్థానంలో నిలిచారు. 2016లో 11.1 బిలియన్ డాలర్ల సంపదతో ఈయన రెండో స్థానానికి ఎగబాకారు. 2015లో ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో 6వ స్థానంలో ఉన్నారు.
సునీల్ మిట్టల్
భారతి ఎంటర్ ప్రైజెస్ వ్యవస్థాపకులు, సీఈవో సునీల్ మిట్టల్ మూడో స్థానంలో ఉన్నారు. గతేడాది 6.2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద ప్రస్తుతం 5.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల్లో 2015లో 13వ స్థానంలో ఉన్నారు.
నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తిది ఈ జాబితాలో నాలుగో స్థానం. ఆయన 2016 లో 1.9 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఇన్ఫోసిస్లో మైనారిటీ వాటాతోనే ఆయన ఈ మేరకు సంపన్నులయ్యారు. మొత్తం 100 మంది సంపన్న భారతీయుల్లో గతేడాది ఉన్న 53వ స్థానం నుంచి 62వ స్థానానికి దిగజారారు.
ఎస్.గోపాలకృష్ణన్
ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకులు సేనాపతి గోపాలకృష్ణన్ సంపద 1.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయన 2007-11 మధ్య ఇన్ఫోసిస్ సీఈవో,ఎండీగా పనిచేశారు.
నందన్ నీలేకని
ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని సంపద సైతం 1.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇటీవలే టాటా సన్స్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాతో కలిసి అవంతి ఫైనాన్స్ పేరుతో సోషల్ వెంచర్ను స్థాపించారు. నీలేకని యూఐడీఏఐ ఛైర్మన్గా పనిచేశారు. ఎన్నో స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టారు.
భవిన్& దివ్యాంక్ తురాఖియా
ఈ ఏడాది ఫోర్బ్స్ సంపన్న భారతీయుల్లో ముంబయికి చెందిన భవిన్ అండ్ దివ్యాంక్ తురాఖియా చేరారు. మీడియా.నెట్ను స్థాపించిన ఈ ఇరువురు ఈ ఏడాది ఆగస్టులో 900 మిలియన్ డాలర్లకు దాన్ని చైనా పెట్టుబడిదారులకు అమ్మేశారు. వీరిరువురూ 1998లోనే డైరెక్టి వెబ్సర్వీసెస్ను స్థాపించారు. దాని ప్రస్తుత విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
కొత్తవారు
ఫోర్బ్స్ బిలియనీర్ల కనీస సంపదను 1.25 బిలియన్ డాలర్లుగా పరిగణించారు. మొత్తం జాబితాలో ఆరు మంది కొత్తగా వచ్చి చేరారు. భవిన్, దివ్యాంక్ తురాఖియాలు మీడియా.నెట్ను అమ్మడం ద్వారా వార్తల్లో నిలిచారు. పతంజలి సహ వ్యవస్థాపకులైన ఆచార్య బాలకృష్ణ సైతం ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. బ్రిజ్ మోహన్లాల్ ముంజల్ మరణంతో ఆయన వారసుడు పవన్ ముంజల్ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మరో వైపు శ్రీసిమెంట్ వేణుగోపాల్ బంగూర్ మొదటిసారి టాప్ 20లోకి వచ్చారు. ఏసియన్ పెయింట్స్ అశ్విన్ సైతం 1 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ సంపదతో ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు.