7 ఏళ్ల గరిష్టానికి రిలయన్స్ షేర్లు
ఒక పక్క మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుంటే రిలయన్స్ షేర్లు మాత్రం కళకళలాడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండగా రిలయన్స్ మాత్రం పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటోంది. గత 14 ట్రేడింగ్ సెషన్లలో 10 సెషన్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలు గడించింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్లో రూ. 1122 గరిష్ట స్థాయికి వెళ్లింది. సెప్టెంబరు 2 నుంచి 10.5% లాభపడి ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మొత్తం 10.25 శాతం పైకి ఎగబాకింది.
రిలయన్స్ సాధారణ వార్షిక సమావేశం సందర్భంగా రిలయన్స్ జియో ఘనమైన లక్ష్యాలను ముకేశ్ అంబానీ ప్రకటించారు. సెప్టెంబరు 5న రిలయన్స్ జియో అధికారిక లాంచ్ జరిగినప్పటి నుంచి డిసెంబరు వరకూ పలు ఆఫర్లను ప్రకటించారు. జనవరి 1, 2017 తర్వాత సైతం డేటాను వాడుకుని కాల్స్ను చేసుకోవచ్చు. మరోవైపు సెప్టెంబరు 22న వరుసగా 9వ ఏడాది అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ పేరును ఫోర్బ్స్ ప్రకటించింది. సెప్టెంబరు 8న విడుదలైన ఒక సర్వే ప్రకారం ఆర్ఐఎల్ ప్రపంచంలో టాప్ 10 చమురు కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఇవన్నీ రిలయన్స్ షేర్ల సానుకూలతకు దారితీశాయి.