జీఎస్టీ కౌన్సిల్కు క్యాబినెట్ ఆమోదం
వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే జీఎస్టీ అమలుకు ఎన్డీఏ ప్రభుత్వ ప్రయత్నంలో మరో కీలక ఘట్టం పూర్తయింది. దేశంలో పరోక్ష పన్ను విధానంలో కీలక సంస్కరణగా, సగానికన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించిన జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) బిల్లుకు సంబంధించి ఏర్పాటు చేసే జీఎస్టీ కౌన్సిల్ కు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లుకు గత వారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర పడింది. సోమవారం సమావేశమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ, జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 12 కింద కౌన్సిల్ ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ కౌన్సిల్ కు అధ్యక్షుడుగా పనిచేస్తారు. ప్రధాన అటు ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలోని ప్యానెల్ కొన్ని సూచనలు, సలహాలు అందించింది.
జీఎస్టీ కౌన్సిల్ కు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్ గా వ్యవహరించనుండగా, రాష్ట్రాల ఆర్థికమంత్రులు సభ్యులుగా ఉంటారు. వస్తు సేవలపై పన్ను రేటు ఎంత ఉండాలి? మినహాయింపు ఉండే విభాగాలేంటి? పన్ను విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం తదితర అంశాలపై నిర్ణయాలపై ఈ కౌన్సిల్ నిర్ణయమే కీలకం. జీఎస్టీ కౌన్సిల్ మొదటి సమావేశం సెప్టెంబర్ 22 , 23 తేదీల్లో జరగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.