ఆ ప్రకటనల్లో తప్పుంటే సెలబ్రిటీలకు రంగు పడుద్ది!
ఇన్ని రోజులు ప్రకటనలను ఒక ప్రవృత్తిగా పెట్టుకుని సులువుగా నటించినట్లుగా ఇకపై సెలబ్రిటీలకు కుదరకపోవచ్చు. ఎందుకంటే ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు నటించిన ప్రకటనల్లో వినియోగదారులను తప్పు పట్టించే అంశాలు ఏవైనా ఉంటే ఐదేళ్ల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించాలని కొత్త ముసాయిదా చట్టం చెప్తోంది. ఈ నేపథ్యంలో ఆసలు ఆ చట్టం ఏంటి? కాలాంతరంలో దాని పరిణామాలేంటో చూద్దాం.
వినియోగదారుల పరిరక్షణ చట్టం
ముప్పై ఏళ్ల కిందటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2015ను లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం గత ఏప్రిల్లో తన సిఫారసులను సమర్పించింది.
కమిటీ సిఫార్సులు
వీటిని అధ్యయనం చేసిన వినియోగదారుల మంత్రిత్వశాఖ.. ప్రకటనలో నటించిన సెలబ్రిటీలను బాధ్యులను చేయటం, కల్తీకి కఠిన శిక్ష విధించటం వంటి కొన్ని కీలక సిఫారసులను ఆమోదించారు. ఈమేరకు ముసాయిదా బిల్లులో చేయదలచుకున్న మార్పులపై ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సారథ్యంలో కేంద్ర మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీలో సమావేశమై చర్చించింది. అనంతరం వీటిని కేబినెట్ ఆమోదం కోసం మంత్రివర్గానికి నివేదిస్తారు.
రూ. 10 లక్షల జరిమానా
వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటనల్లో పాల్గొనే ప్రముఖులకు.. ఆయా ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి రూ. 10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష.. రెండోసారి, ఆపైన అదే నేరానికి రూ. 50 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని ముసాయిదాలో నిబంధనలు చేర్చినట్లు ప్రభు త్వ వర్గాలు తెలిపాయి. అలాగే కల్తీ విషయంలో కూడా ఇదే తరహా శిక్షలతో పాటు.. లెసైన్స్ రద్దు చేయ టం వంటి చర్యలను సిఫారసు చేసినట్లు సమాచారం.
మ్యాగీ వివాదం
సాధారణంగా జాతీయ, అంతర్జాతీయంగా పేరున్న కంపెనీల ఉత్పత్తులకే ప్రముఖ తారలు వ్యాపార ప్రకటనల్లో నటించడం, బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు. ఆయా ఉత్పత్తులు కూడా మార్కెట్లో అంతే మేర ఆదరణ పొందుతాయి. ఈ క్రమంలోనే మ్యాగీ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలకు భారీ పారితోషకాలు నటించిన వారిపై గతేడాది నుంచి ఒత్తిడి పెరిగింది. అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, ప్రీతి జింతా వంటి వారు ఈ జాబితాలో ఉండటం అప్పట్లో సంచలమయింది.
విదేశాల్లో ఎలా?
2013లో రెడ్బుల్ ఎనర్జీ డ్రింక్కు సంబంధించి సైతం రెండు మూడేళ్ల క్రితం పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. మీరు ఈ డ్రింక్ తాగితే మీకు రెక్కలు వస్తాయన్న అర్థంలో ప్రకటన ఇచ్చినందున చాలా మంది దానిపై అభ్యంతరం తెలిపారు. దీంతో అమెరికాలో ఆ ప్రకటనపై ఒక వ్యక్తి దావా వేయగా చివరకు కాళ్ల బేరానికి వచ్చారు.
ఒకటికి రెండు సార్లు ఆలోచించక తప్పదేమో?
ప్రస్తుతం బాలీవుడ్లో అగ్రశ్రేణి నటులు సైతం సినిమాలతో సమానంగా ప్రకటనలకు సమయం వెచ్చిస్తుండటం బట్టి చూస్తే అందులో ఎంత ఆదాయం వస్తుందో వెల్లడిస్తోంది. వ్యాపార ప్రకటనల్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు రావడమే దీనికి కారణం. నేడు ఆరోగ్య పరమైన ఉత్పత్తుల్లో కూడా విపరీతమైన ప్రకటనలు ఉండటం అసలు వివాదాలకు కారణాలుగా ఉంటుంన్నాయి. ఒకవేళ ఆ నాణ్యత లేకపోతే ఎలా? అనేదే ఇక్కడ ప్రశ్న. దీంతో సెలబ్రిటీలు ఇకపై ప్రకటనలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించక తప్పదేమో.
నాణ్యత కన్నా యాడ్ ప్రభావమే ఆ విధంగా చేస్తోంది
చిన్న చాక్లెటు నుంచి విమాన ప్రయాణం వరకూ వినియోగదారుల మీద ప్రకటనల ప్రభావాన్ని గుప్పిస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు. ఒక్కోసారి నాణ్యత కన్నా ఈ యాడ్ ప్రభావం వల్లే పిల్లలు, పెద్దలు సదరు వస్తు సేవలపై మళ్లుతున్నారు. మరి ఇంత ప్రభావవంతమైన మాధ్యమానికి సెలబ్రిటీలు పనిచేస్తున్నప్పుడు వారికి కనీస బాధ్యత ఉండాలని సామాజికవేత్తలు కోరుతున్నారు.
ఆమ్రాపాలి ప్రాజెక్టు నుంచి తప్పుకున్న దోని
ఈ పార్లమెంటరీ కమిటీకి తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల వినియోగదారులను తప్పు పట్టించే ప్రకటనల నుంచి సెలబ్రిటీలు తమంతట తామే తప్పుకుంటున్నారు. భారత క్రికెట్ కెప్టెన్ దోని ఇచ్చిన ప్రకటన వల్ల ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో తాము ఫ్లాట్లు కొన్నామని బాధితులు ఆరోపించారు. చివరకు ధోని ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా తప్పుకున్నారు.