ఆధార్- ఈకేవైసీ వల్ల కలిగే ప్రయోజనాలు
మొదటిసారి కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు ఎంత ప్రయాస పడి ఉంటారో మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అన్ని బాధలు అవసరం లేదు. ఆధార్ ఆధారంగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయితే మీకు తక్షణమే తిరస్కరణకు వీల్లేని విధంగా ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డు లభిస్తుంది. ఇందులో చిరునామాతో సహా పుట్టిన రోజు, లింగ వివరాలు ఉంటాయి.
అంతే కాకుండా మీ మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ సర్వీస్ ప్రొవైడరుకు చేరతాయి. దీంతో సేవలను ఎటువంటి ఆటంకం లేకుండా అందించేందుకు వీలు పడుతుంది. యూఐడీఏఐ(భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ) చెపుతున్న దాని ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో సేవలు అందించడంలో ఆధార్ ఈ-కేవైసీ సంచలనాలను సృష్టించగలదు. మార్కెట్లో నూతన ప్రక్రియలను ప్రవేశపెట్టగలదు. ఈ నేపథ్యంలో ఆధార్ ఈ-కేవైసీ ఉంటే కలిగే ప్రయోజనాలను చూద్దాం.
8. సత్వర సేవలు
ఇదంతా పూర్తిగా ఆటోమేషన్ కలిగిన సేవ. కేవైసీ డేటాను రియల్ టైమ్లో యాక్సెస్ చేయొచ్చు. మనిషి ప్రమేయం లేకుండా అంతా ఆన్లైన్లోనే జరిగేలా చూసేందుకు వీలుంటుంది. దీంతో సమయం ఆదా అవడంతో మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ కాబట్టి ఎవ్వరూ ఎక్కడా పనులను ఆపేందుకు వీలుపడదు.
7. తక్కువ ధర
ఇంతకుముందు వ్యక్తిగత, చిరునామా గుర్తింపుల కోసం ఎన్నో పత్రాలు నిరంతం సమర్పించాల్సి వచ్చేది. ఈ శ్రమంతా తప్పుతుంది. జిరాక్స్ల కోసం డబ్బులు పదేపదే ఖర్చు పెట్టే బాధ కూడా ఉండదు.
6. ఈ-కేవైసీలో ఉండేవి
ఈ-కేవైసీ అంటే పూర్తిగా పేపర్ రహిత, ఎలక్ట్రానిక్, తక్కువ ధర వంటి అంశాలను కలిగి ఉంటుంది. దీంతో ఆర్థిక స్వావలంబనకు దారులు సుగమమవుతాయి. ఆ కోవలోకే జన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ సురక్షా యోజన వస్తాయి. గ్యాస్ సబ్సిడీకి నగదు బదిలీ సైతం కొద్దిపాటి గందరగోళంతో దాదాపుగా విజయవంతమవుతుండటాన్ని మనం చూస్తున్నాం.
5. వినియోగదారు అనుమతితోనే
కస్టమరు అనుమతితోనే కేవైసీ వివరాలను సంబంధిత సంస్థలకు చేరవేస్తారు. దీంతో మీ ప్రైవసీకి ఎటువంటి డోకా ఉండదని అనుకోవచ్చు. అయితే దీన్ని కచ్చితంగా నిర్దారించలేం. ఇది అమలయిన కొద్ది రోజుల తర్వాత దీని ఫలితాలు తెలుస్తాయి.
4. నియంత్రణ సంస్థలకు సైతం సులువే
సర్వీస్ ప్రొవైడరు మంత్రిత్వ శాఖలకు(ప్రభుత్వానికి), నియంత్రణ సంస్థలకు ఆడిటింగ్ కోసం ఒక పోర్టల్ను సూచించవచ్చు. దీని ద్వారా ఈ-కేవైసీని తనిఖీ సులువుగా వెరిఫై చేస్తారు. ఈ-కేవైసీకి సంబంధించి వినియోగదారులు లేదా లబ్దిదారుల వివరాలను ఏ విధంగా సేవ్ చేయాలో సంబంధిత ప్రభుత్వ శాఖలు, నియంత్రణ సంస్థలు సర్వీస్ ప్రొవైడర్లకు సూచిస్తాయి. దీంతో అటు సర్వీస్ ప్రొవైడర్లకు, నియంత్రణ సంస్థల మధ్య గందరగోళం తలెత్తే పరిస్థితి ఉండదు. ఇదంతా ఆన్లైన్ కాబట్టి సమయం కూడా ఆదా అవుతుంది.
3. అంతా మెషీనే చూసుకుంటుంది
డిజిటల్ సిగ్నేచర్ చేయబడిన ఆధార్ అనుసంధానిత ఈ-కేవైసీ మెషీన్కు అర్థమయ్యే విధంగా ఉంటుంది. దీంతో సర్వీస్ ప్రొవైడరుకు మీరు ఈ-కేవైసీ సబ్మిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వివరాలను డేటాబేస్ నుంచి సర్వీస్ ప్రొవైడరు తీసుకుంటారు. ఇందులో మనుషులు చేసే పని తక్కువగా ఉండటం వల్ల తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదు. ప్రస్తుతం ఆ విధానంలోనే ఆంధ్రప్రదేశ్లో పింఛను పంపిణీ జరుగుతున్నందు వల్ల సాధ్యమైనంత మేరకు మోసాలు తగ్గాయి.
2. నాన్-రెప్యుడియబుల్(తిరస్కరణకు వీలుండదు)
ఈ-కేవైసీ ఉపయోగించి చేసే లావాదేవీల్లో తిరస్కరణలకు తావుండదు. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. లబ్దిదారుకు సర్వీస్ ప్రొవైడర్ కచ్చితంగా ప్రయోజనాలను అందించాల్సిందే. గుర్తింపును సైతం తిరస్కరించేందుకు వీల్లేని విధంగా ఆధార్ ఈ-కేవైసీ విధానం ఉంది.
1. డాక్యుమెంట్ల ఫోర్జరీ నుంచి తప్పించుకోవచ్చు.
గుర్తింపు కార్డులకు సంబంధించి జరిగే మోసాల నుంచి తప్పించుకోవచ్చు. ఎన్నో గుర్తింపు కార్డులు ప్రతి చోటా ఇవ్వడం వల్ల మన వివరాలు ఎవరెవరికో వెళ్లే అవకాశాలు ఉంటాయి. అదే ఆధార్ ఈ-కేవైసీ ఉంటే ఎవరికైతే ఈ గుర్తింపును వెరిఫై చేయాల్సిన అవసరం ఉందే వారే ఆన్లైన్లో తనిఖీ చేసేలా చేసుకోవచ్చు. యూఐడీఏఐ ప్రకారం అయితే ఫోర్జ్డ్ డాక్యుమెంట్ల రిస్క్ దాదాపు లేదనే చెప్పాలి.