2015లో ఇండియాలో టాప్ 10 ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు
మిగతా వాటితో పోలిస్తే చాలా వేగంగా, కాస్త తక్కువ ధరకు అమ్ముడయ్యే వస్తువులు ఎఫ్ఎమ్సీజీ(ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్). ఇందులో ముఖ్యంగా పౌడర్, హ్యండ్వాష్, చిప్స్, పేస్ట్, సబ్బులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి వస్తాయి. దైనందిన జీవితంలో మనం వాడే వస్తువుల్లో ఎక్కువ భాగం ఎఫ్ఎమ్సీజీ ఉత్పత్తులే ఉంటాయి. వీటి వ్యాపారం ఎప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే పతంజలి మార్కెట్ను విస్తరిస్తూనే ఉండటాన్ని మనం చూస్తున్నాం. కోల్గేట్, హెచ్యూఎల్ లాంటి మార్కెట్ లీడర్లతో తాను పోటీపడనున్నట్లు పతంజలి ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంది. ఉత్పత్తులను తయారుచేయడంలో, పంపిణీలోనూ దేశంలో ఎన్నో కన్సూమర్ కేర్ ఉత్పత్తుల కంపెనీలు ఉన్నాయి. 2015 సంవత్సరానికి సంబంధించి 10 అగ్రశ్రేణి(టాప్) కంపెనీలను ఇక్కడ చూడొచ్చు.
1.ఐటీసీ
ఐటీసీ కోల్కత ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. మొదట టొబాకో(పొగాకు) రంగంతో వ్యాపారం మొదలెట్టిన ఈ సంస్థ తర్వాత ఎఫ్ఎమ్సీజీలో చాలా విభాగాలకు విస్తరించింది. అంతే కాకుండా హోటల్స్, పేపర్బోర్డ్స్; ప్యాకేజింగ్; అగ్రి బిజినెస్, ఐటీలో సైతం దీనికి ప్రవేశం ఉంది. సిగరెట్ వ్యాపారంలో దేశంలో ఐసీటీ మార్కెట్ లీడర్గా ఉంది. ఐటీసీ ప్రధాన బ్రాండ్లలో ఆశీర్వాద్, సన్ఫీస్ట్, క్యాండిమెన్, బింగో వంటి వాటిని మీరు వినే ఉంటారు. 2015 సంవత్సరంలో ఈ కంపెనీ అమ్మకాలు రూ. 33238.60 కోట్లు ఉండగా, లాభాలు రూ. 8785.21 కోట్లు. మరో వైపు ఆస్తుల విలువ రూ. 25293.47 కోట్లు కాగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,66,035 కోట్లుగా ఉంది.
2. హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్యూఎల్)
ఎక్కువగా కన్సూమర్స్ గూడ్స్ కలిగిన హెచ్యూఎల్ 1932లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. సంజీవ్ మెహతా దీని ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2014లో ఏసీనీల్సన్ జరిపిన సర్వే ప్రకారం వంద ట్రస్టెడ్ బ్రాండ్లలో 16 హెచ్యూఎల్కు చెందినవే ఉన్నాయి. ఈ కంపెనీకి చెందిన ప్రధాన ఉత్పత్తులు లక్స్, సర్ఫ్ ఎక్సెల్, క్లినిక్ ప్లస్, లైఫ్బాయ్, క్లోజప్, పాండ్స్, పెప్సొడెంట్, ఫెయిర్ అండ్ లవ్లీ, డవ్, సన్సిల్క్, విమ్,వీల్, పియర్స్, వ్యాసిలైన్,ల్యాక్మి వంటివి ఉన్నాయి. ప్రకటనలు, మార్కెటింగ్ ఈ కంపెనీ ప్రధాన బలం.
ఈ కంపెనీ అమ్మకాలు రూ. 28019 కోట్లు ఉండగా లాభాలు రూ. 3867.49 కోట్లు ఉన్నాయి.
మొత్తం ఆస్తులు రూ. 3204.67 కోట్లు కాగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,82,704.61 కోట్లు.
3. నెస్లే ఇండియా
స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీ నెస్లే. మన దేశంలో 1961లో పంజాబ్లోని మొగాలో ఈ సంస్థ మొదటి ఉత్పత్తి ప్లాంటును ప్రారంభించింది. అప్పటి నుంచి డైరీఫార్మింగ్లో స్థానిక రైతులకు మెలకువలను నేర్పుతూ వస్తోంది. తద్వారా స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తోంది.
కంపెనీ అమ్మకాలు రూ. 9854.84 కోట్లు ఉండగా, లాభాలు రూ. 1184.69 కోట్లుగా ఉన్నాయి.
ఆస్తుల మొత్తం విలువ 2841.56 కోట్లు కాగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 68310.53 కోట్లుగా ఉంది.
4. డాబర్
డా. ఎస్ కే బర్మన్ 1884లో డాబర్ సంస్థను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం యూపీలోని ఘజియాబాద్లో ఉంది. కంపెనీకి చెందిన కీలక వ్యక్తులు ఆనంద్బర్మన్(చైర్మన్), సునీల్ దుగ్గల్(సీఈవో). అమిత్ బర్మన్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఆయుర్వేదిక్ మందుల్లో అగ్రశ్రేణి ఉత్పత్తిదారుగా డాబర్ ముందుకెళుతోంది. ఇండియాలోనే కాకుండా ఈజిప్ట్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నైజీరియా, యూఏఈ, యూఎస్ దేశాల్లో దీనికి శాఖలున్నాయి.
కంపెనీ అమ్మకాలు రూ. 4870.08 కోట్లుండగా, లాభాలు రూ. 672.1 కోట్లు.
ఆస్తుల విలువ రూ. 1891.89 కోట్లు కాగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 46565 కోట్లు.
5. గోద్రెజ్ కన్సూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్
2001లో గోద్రెజ్ కన్సూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ను స్థాపించారు. ముంబయి ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. దీనికి ఉత్పత్తి కార్యాలయాలు మలన్పూర్(ఎంపీ), బడ్డీ-థానా(హెచ్పీ), బడ్డీ-కాథా(హెచ్పీ), పాండిచ్చేరి, చెన్నై, సిక్కింలలో ఉన్నాయి. దీని ముఖ్యమైన బ్రాండ్లు సింతాల్, గోద్రెజ్ షిక్కాయ్, కలర్సాప్ట్, ఈజీ వంటివి. మొత్తం ఆస్తుల విలువ పరంగా చూస్తే ఇది ఎఫ్ఎమ్సీజీల్లో ఇండియాలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈజీ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్తో పోటీ పడుతోంది.
కంపెనీ అమ్మకాలు రూ. 4079.84 కోట్లు ఉండగా, లాభాలు రూ. 564.84 స్థాయిలో ఉన్నాయి.
ఆస్తుల విలువ రూ. 3022.82 కోట్లు కాగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 39,435.67 కోట్లుగా ఉన్నది.
6. గ్లాక్సోస్మిత్కైన్(జీఎస్కే) కన్సూమర్ హెల్త్కేర్
కన్సూమర్ హెల్త్కేర్, ఫార్మాస్యుటికల్స్ ఉత్పత్తుల్లో ప్రత్యేకత కలిగిన బ్రిటన్ బహుళజాతి సంస్థ జీఎస్కే కన్సూమర్ హెల్త్కేర్. దేశంలో లీడింగ్ హెల్త్ కేర్ కంపెనీ ఇదే.
కంపెనీ అమ్మకాలు రూ. 4868.57 కోట్లు ఉండగా, లాభాలు రూ. 674.75 కోట్లుగా ఉన్నాయి .
ఆస్తుల విలువ రూ. 1679.93 కోట్లు కాగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 26860.87 కోట్లు.
7. బ్రిటానియా
ప్రాసెసింగ్ ప్రధాన వ్యాపకంగా కలిగిన బ్రిటానియా 1892లో స్థాపించబడింది. ప్రధాన కేంద్రం కోల్కతలో ఉంది. దీని ప్రసిద్ది చెందిన బ్రాండ్లు వీటామేరీగోల్డ్, టైగర్, న్యూట్రీచాయిస్ జూనియర్, గుడ్ డే, 50-50, ట్రీట్, ప్యూర్ మ్యాజిక్, మిల్క్ బికిస్, బౌర్బన్, లిటిల్ హార్ట్స్ వంటివి ఉన్నాయి. నిత్యజీవితంలో ఏదో ఒకటి వీటిలో మన ఇంట్లో కనిపిస్తూనే ఉంటుంది. దేశంలో 100 ట్రస్టెట్ బ్రాండ్లలో బ్రిటానియా ఒకటి.
ఈ కంపెనీ అమ్మకాలు రూ. 6307.39 కోట్లు ఉండగా, లాభాలు రూ. 369.83 కోట్లు ఉన్నాయి.
ఆస్తుల విలువ రూ. 845.96 కోట్లు కాగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 27871.96 కోట్లుగా ఉంది.
8. మ్యారికో
కన్సూమర్స్ గూడ్స్ ఇండస్ట్రీలో 1987లో మ్యారికో ప్రారంభమైంది. శాంతాక్రూజ్(తూర్పు), ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది.
కంపెనీ అమ్మకాలు రూ. 3682.49 కోట్లు ఉండగా, లాభాలు రూ. 577.22 కోట్లు.
ఆస్తుల విలువ రూ. 2199.66 కోట్లుగా ఉండగా, మార్కెట్ క్యాపిటలైషన్ రూ. 26360 కోట్లు.
9. కాల్గేట్ పామోలివ్(ఇండియా) లిమిటెడ్
ఎఫ్ఎమ్సీజీలో అమెరికాకు చెందిన కంపెనీ కాల్గేట్ పామోలివ్. 1806లో న్యూయార్క్లో స్థాపించిన ఈ సంస్థ 1902 కాలం నుంచి భారతదేశంలో దాని ప్రకటనలను మొదలుపెట్టింది. డెంటల్కేర్లో మిగతా అన్ని కంపెనీలకు ఇది గట్టి పోటీనిస్తోంది. 2014 వరల్డ్ సీఎస్ఆర్ కాంగ్రెస్లో ఎఫ్ఎమ్సీజీ రంగంలో ఎథికల్ బ్రాండుగా ఇది అవార్డు అందుకుంది. అలాగే అదే సంవత్సరంలో కంతార్ వరల్డ్ ప్యానెల్ బ్రాండ్ ఫుట్ప్రింట్ నివేదిక ప్రకారం అత్యధిక ఆదరణ కలిగిన కన్సూమర్ బ్రాండ్గా ఖ్యాతికెక్కింది.
అమ్మకాలు రూ. 3578.81 కోట్లు కాగా, లాభాలు రూ. 539.87 కోట్లు.
ఆస్తుల విలువ రూ. 596 కోట్లు ఉండగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 28211 కోట్లు.
10. ఇమామి
ఇద్దరు చిన్ననాటి స్నేహితులైన ఆర్.ఎస్. అగర్వాల్, ఆర్.ఎస్. గోయెంకాలు ఇమామి లిమిటెడ్ను 1974లో కోల్కతలో స్థాపించారు. దీనికి సంబంధించి మార్కెట్లో ప్రాచుర్యం పొందిన వాటిలో బోరోప్లస్ యాంటిసెప్టిక్, నవరత్న కూల్ ఆయిల్, ఫెయిర్ అండ్ హ్యాండసమ్, మెంతో ప్లస్ అండ్ ఫాస్ట్ రిలీఫ్ వంటివి కొన్ని. జండూ ఫార్మాస్యుటికల్స్ వర్క్స్ లిమిటెడ్లో దీనికి మెజారిటీ వాటా ఉంది. ఇమామి ఉత్పత్తులు చర్మ క్రీములు (స్కిన్ క్రీమ్స్), హెయిర్ కేర్, ఆయుర్వేదిక్ హెల్త్కేర్ రంగాల్లో ఉంది.
అమ్మకాలు రూ. 1705.08 కోట్లు కాగా, లాభాలు రూ. 398.23 కోట్లు.
మొత్తం ఆస్తుల విలువ రూ. 945.01 కోట్లుండగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 23808.90 కోట్లుగా ఉంది.
దేశంలో ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు
అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పన్నెండు అగ్రశ్రేణి ఎఫ్ఎమ్సీజీ కంపెనీలను ఎంపిక చేయడం జరిగింది. 100 పాయింట్ల శ్రేణిలో అన్ని కంపెనీలకు ర్యాంకులు ఇవ్వడం జరిగింది.
అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ క్యాపిటలైజేషన్ కేటగిరీల్లో ఒక్కోదానికి కొన్ని పాయింట్లు ఇచ్చి చివర్లో అన్నింటిని కలిపి ర్యాంకులను తయారు చేశారు. ఇవన్నీ 2015 సంవత్సరానికి చెందిన గణాంకాలు. ఎమ్బీస్కూల్.కామ్(http://www.mbaskool.com) ఇచ్చిన సర్వేను ఇక్కడ ఇస్తున్నాం. ఈ ర్యాంకింగ్లతో వన్ఇండియాకు, గుడ్రిటర్న్స్కు ఎటువంటి సంబంధం లేదు.