భారత యువతకు విదేశీ ఉత్పత్తులపై మోజు
భారత యువత(18-34 వయసు వారు) విదేశీ ఉత్పత్తులకే మొగ్గు చూపుతోంది. దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల జరిగిన ఒక సర్వే నివేదికలో ఈ విషయాలు బయటపడ్డాయి. దీని ప్రకారం 59% యువత దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఫారిన్ ఉత్పత్తుల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఈ-కామర్స్ రాకతో యువత ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్లోనూ బ్రాండెడ్ దుస్తులు కొనడం, మాల్స్లో బ్రాండెడ్ వస్త్రాల వైపు మొగ్గుచూపుతుండటం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. నాణ్యతకు మొగ్గుచూపడం వల్లే ధరలతో సంబంధం లేకుండా యువత విదేశీ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పేపాల్ క్రాస్ బార్డర్ మిలినీయల్ పేరిట పేపాల్,పరిశోధనా సంస్థ ఇప్సోస్ సంయుక్తంగా నివేదికను రూపొందించాయి. 29 దేశాల్లో 23 వేల మంది ఇంటర్నెట్ వాడకందార్లతో ఈ సర్వే నివేదికను రూపొందించారు. ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్కు అమెజాన్పై ఆధారపడుతున్నారు. ఇంకా ఈవెంట్ టిక్కెట్ల కోసం సైతం భారతీయులు ఆన్లైన్పై ఆధారపడటం పెరుగుతోంది. ఆన్లైన్ పేమెంట్లు సులువుగా చేసే వీలున్నందువల్ల యువత చాలా సత్వరంగా ఆన్లైన్ షాపింగ్ను పూర్తిచేసేస్తున్నారు. అయితే తమ సొంత భాషల్లో ఈ-కామర్స్ వెబ్సైట్లు లేకపోవడం వల్ల 60 శాతం మంది అసౌకర్యంగా ఉన్నట్లు వెల్లడించారు. పేమెంట్ల విషయంలో 82 శాతం మంది తమ సొంత దేశ కరెన్సీల్లో చెల్లించేందుకు మొగ్గుచూపుతున్నారు.