ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మంచి ఉద్యోగాలను కాదని పేరెన్నికగన్న స్టార్టప్ల్లో చేరేందుకు యువత ఉత్సాహం చూపుతుంటారు. అయితే నియామకాల సమయంలో బాగానే ఉన్నా కంపెనీలకు లాభాలు రాకపోతే ఆ ఉద్యోగులపై ప్రభావం ఉండక తప్పదు. దీంతో స్టార్టప్లే కాదు పెద్ద కంపెనీలు ఉద్యోగులను పక్కనపెడుతున్నాయి. టెక్నాలజీ, స్టార్టప్లు అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. కారణాలు ఏవైతేనేం ఎక్కడో సమస్య ఉండటం మూలంగా టెక్ స్టార్టప్లు, టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ మధ్య ఇలాంటి ఐదు అతి పెద్ద తొలగింపులను చూద్దాం.
సిస్కో
యూఎస్కు చెందిన నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో 5500 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. వీరి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 7 శాతం. మన దేశంలో ఆ కంపెనీ ఉద్యోగులు 11 వేల మంది ఉండటంతో దీని ప్రభావం ఇక్కడ కూడా ఉండనుంది.
ఓలా
దేశ పట్టణ రవాణా వ్యవస్థలో ఒక సంచలనంగా ఓలా ప్రారంభమైంది. ఓలా యాప్ ద్వారా కొన్ని లక్షల బుకింగ్లు జరుగుతున్నాయి. అయితే లాభాలు తగ్గడం, నిర్వహణ సమస్యల మూలంగా తాము కొనుగోలు చేసిన ట్యాక్సీఫర్సూర్ను మూసివేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. దీని ద్వారా 700 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. 18 నెలల క్రితం ట్యాక్సీఫర్ సూర్ క్యాబ్ కంపెనీని 200 మిలియన్ డాలర్లకు ఓలా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఫ్లిప్కార్ట్
దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఈ జాబితాలో ఉండటం విశేషం. తన కంపెనీలో సరిగా పనిచేయని వారిని వెళ్లిపోవాల్సిందిగా యాజమాన్యం ఉద్యోగులను కోరింది. అంటే పని సామర్థ్యం ఆధారంగా దాదాపు 300 ఉద్యోగులు(1నుంచి 2 శాతం) తమ ఉపాధిని కోల్పోనున్నట్లు తెలుస్తోంది.
మైక్రోసాఫ్ట్
స్మార్ట్ఫోన్ హార్డ్వేర్, అంతర్జాతీయ సేల్స్ విభాగాల నుంచి మైక్రోసాఫ్ట్ చాలా మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. దీని తర్వాత 2850 మందిని నియమించాలనేది కంపెనీ ప్రణాళిక. మొత్తం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జూన్ 2017 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
గ్రోఫర్స్
కిరాణా సరుకులను నేరుగా ఇంటికి చేర్చే స్టార్టప్ గ్రోఫర్స్. ఆ కంపెనీ 10 శాతం లేదా 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. వృద్ది లక్ష్యాల్లో మార్పులే ఉద్యోగుల తొలగింపుకు కారణం. ఈ సంస్థకు సాఫ్ట్బ్యాంక్, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ ఫండింగ్ ఇచ్చాయి.
ఆస్క్మీబజార్
ఈ కామర్స్ పోర్టల్ 'ఆస్క్ మీ డాట్ కాం' మూత పడటంతో దేశంలో దాదాపు నాలుగువేలమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తీవ్రమైన నగదులేమి, పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో తన కార్యకలాపాలను కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు జీ బిజ్ వెల్లడించింది. ఈ క్రమంలో ఆస్క్ మీ వెబ్సైట్ ఉనికిలో ఉన్నప్పటకీ ఎలాంటి కొత్త ఆర్డర్ లను తీసుకోవడం లేదు. ఆస్క్ మీ లో అతి పెద్ద వాటాదారు (97శాతం ) ఆస్ట్రో హోల్డింగ్స్ గత నెల నిష్క్రమణతో ఈ పరిణామం సంభవించింది.