దసరా నాటికి తెలంగాణలో 17 కొత్త జిల్లాలు
పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ముందుకెళుతోంది. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 10 నుంచి 27కు పెరగనుంది. అక్టోబర్ నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. జిల్లాలతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల సంఖ్య సైతం పెరగనుంది. రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం ఉన్న 44 నుంచి 58కి, మండలాల సంఖ్య 490కు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ను అలానే ఉంచారు. హైదరాబాద్ జిల్లా విభజన గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాల కోసమై ఒక నెల సమయమిచ్చారు. ప్రజలు 30 రోజుల్లోపు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి పంపవచ్చు. జిల్లా కలెక్టరు కార్యాలయాలు, హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయాల్లో తమ అభిప్రాయాలను తెలపవచ్చు. http://newdistrictsformation.telangana.gov.in/FirstPage.do వెబ్సైట్లో సైతం తమ అభ్యంతరాలను ఆన్లైన్లో తెలపవచ్చు.
మొత్తం ప్రక్రియను సెప్టెంబరు చివరి నాటికి పూర్తిచేసి కొత్తజిల్లాలను దసరా కల్లా ఉనికిలోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.