ఉర్జిత్ పటేల్ ఎంపిక కారణాలు-సవాళ్లు
బ్యాంకు ఎన్పీఏలను 2017 కల్లా మార్చికల్లా కొలిక్కి తేవాలని రఘురామ్ రాజన్ భావించారు. ఆ లక్ష్యం నెరవేరకుండానే పదవి నుంచి వైదొలగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త గవర్నర్గా ఉర్జిత్ పటేల్ పేరును ప్రకటించింది. రూపాయి విలువ స్థిరత్వం మొదలుకొని, ఎన్పీఏల వరకూ పలు విషయాల్లో ఉర్జిత్ పటేల్ సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఆయన్ను ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసిందో, పగ్గాలు చేపట్టగానే ఏ ఏ విషయాలపై నిర్ణయాలు తీసుకొనాల్సి ఉందో చూద్దాం.
చదువు
ఉర్జిత్ పటేల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి బీఏ(ఎకనమిక్స్) పట్టా పొందారు. తర్వాత 1986లో ఆక్స్ఫర్డ్ నుంచి ఎం.ఫిల్ పూర్తి చేశారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనమిక్స్లో డాక్టరేట్ పొందారు. దీని తర్వాత 1991-94 మధ్య ఐఎంఎఫ్లో ఇండియా డెస్క్లో పనిచేశారు.
కెరీర్
అయన వృత్తి నైపుణ్యం ఆర్బీఐ గవర్నర్గా ఎంపికయ్యేలా చేసింది. 1900లో ఐఎంఫ్లో చేరిన డా. పటేల్ అమెరికా, భారత్, బహమాస్, మయన్మార్ డెస్క్లలో పనిచేశారు. 1995 తర్వాత డెప్యుటేషన్పై వెళ్లారు. డెట్ మార్కెట్, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, పింఛను ఫండ్ సంస్కరణలు, మారక రేటుకు లక్ష్యాలను నిర్దేశించే పనిచేశారు. ఈ మధ్యలో చాలా ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పనిచేశారు. 2013లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులయ్యారు.
రచనలు
మీడియా రిపోర్టుల ప్రకారం చూస్తే, పటేల్ ఆర్థిక విషయాలపై పలు కథనాలు, వ్యాసాలు రాశారు. స్థూల ఆర్థిక అంశాలు, పబ్లిక్ ఫైనాన్స్, మౌలికం, ఆర్థిక మధ్యవర్తిత్వం, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి వాటిపై ఆయన రచనలు సాగాయి.
మొదటి సవాల్
రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్గా నియమితులైన తర్వాత ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లకు అనుమతించారు. దీంతో దేశంలో విదేశీ మారక నిల్వలు పెరిగి రూపాయి స్థిరంగా ఉండేందుకు దోహదపడింది. ప్రస్తుతం ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్ల రిడెంప్షన్ సమయం వచ్చింది. ఒక వైపు ఆ డిపాజిట్ల తిరిగి చెల్లింపు, మరో వైపు బ్యాంకింగ్ నిరర్దక ఆస్తుల కేటాయింపులు జరపాల్సి ఉండటంతో రూపాయి విలువను బలంగా నిలబెట్టడం కత్తిమీద సామే
ద్రవ్యోల్బణం
ధరలను కట్టడి చేస్తూ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధిస్తూ ఉండాలి. ఇందులో ప్రభుత్వానికి, ఆర్బీఐకి పాత్ర ఉంటుంది. కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ 6.07 శాతానికి పెరిగిన తరుణంలో కూడా ప్రధాని ఆర్బీఐ నిర్ణయించుకున్న ద్రవ్యోల్బణ లక్ష్యంపై తన ప్రసంగంలో భరోసా వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వ ఆర్థిక అజెండాలో ధరల స్థిరత్వంపై పోరాటం ఉంటున్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయడం కత్తిమీద సామే. ఈ పనిని సమర్థవంతంగా ఉర్జిత్ చేయగలుగుతారనే విశ్వాసంతోనే ఆయన్ను ఆ పదవికి ఎంపిక చేశారు.
రేట్ల కోతపై నిర్ణయం
ఇప్పటివరకూ పాలసీ రేట్ల నిర్ణయంపై అన్ని అధికారాలు ఆర్బీఐ గవర్నర్కే ఉండేవి. అక్టోబర్లో మొదటిసారి రేట్ల కోతపై మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందులో ఆర్బీఐ నుంచి ముగ్గురు, ప్రభుత్వం నుంచి ముగ్గురు ప్రతినిధులు ఉంటారు. వీరి ఉమ్మడి నిర్ణయంలో రేట్ల కోతపై స్పష్టత లేకపోతే అంతిమ నిర్ణయం ఆర్బీఐ గవర్నర్దే.
మొండి బకాయిలు
బ్యాంకింగ్ వ్యవస్థలో క్రమంగా పెరుగుతున్న మొండి బకాయిల సమస్యలపై సత్వరం దృష్టి పెట్టాల్సి ఉంది. ఉర్జిత్ నియమాకంపై పారిశ్రామిక, వాణిజ్య, బ్యాంకింగ్ రంగాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. కొత్త గవర్నర్ దేశ ఆర్థిక వృద్దికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.