జీఎస్టీ అమలు వల్ల ఏపీకి రూ. 4700 కోట్ల నష్టం
జీఎస్టీ అమలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏటా రూ. 4700 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రూ. 23,500 కోట్లను నష్టపరిహారం కింద చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగే అన్యాయానికి కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
జీఎస్టీ కౌన్సిల్ విషయమై కేంద్రం గురించి పలు వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సభ్యత్వం ఉన్నప్పటికీ కేంద్ర ఆధిపత్యాన్ని వీటో చేయడానికి ఉండదని యనమల అన్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రం గురించి కేంద్రం పట్టించుకోవాల్సి ఉందని, జీఎస్టీ అమలుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కేంద్రం వాటిని తీర్చాలని కోరారు.
అయితే రాజ్యాంగ సవరణ బిల్లును ఆయన స్వాగతించారు. దేశ విశాల ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీతో పాటు చాలా పార్టీలు దానికి మద్దతుగా నిలిచాయన్నారు. టీడీపీ ఎప్పుడూ పన్ను సంస్కరణకు మద్దతు తెలిపిందని చెప్పుకొచ్చారు. ఏకరీతి పన్ను వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాలకు మంచిదేనన్నారు. జీఎస్టీ అమలు వల్ల వస్తువులపై పన్ను తగ్గి, సేవలపై పన్ను పెరగగలదని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు.