50 అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ
ఎస్బీఐ విలీనానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీంతో దేశ ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో భారతీయ మహిళా బ్యాంక్సహా ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి అవనుంది. బ్యాంకుల విలీనాలపై ఎన్ని అభ్యంతరాలు వస్తున్నా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మాత్రం విలీనాలకే సై అంటోంది. నాలుగు బ్యాంకులను విలీనం చేసుకోడానికి ఆ బోర్డు గురువారం నాడు ఆమోదం తెలిపింది. అయితే ఈ విలీనానికి ఇంకా చాలారకాల అనుమతులు రావల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్, భారతీయ మహిళా బ్యాంకుల విలీనానికి బోర్డు ఆమోదం తెలిపింది. శుక్రవారం స్టాక్మార్కెట్లో ఎస్బీఐ షేరు దాదాపు 5 శాతం లాభపడింది.
ఈ నేపథ్యంలో భారత బ్యాంకింగ్ రంగం గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ఎస్బీఐ విలీనం
బ్యాంకుల విలీనానికి ప్రధాన కారణంగా ఎస్బీఐ చెబుతున్న సమాధానం ఈ కలయిక ఉభయతారకంగా ఉండగలదనీ, ఖర్చులను తగ్గించవచ్చని. ఎస్బీహెచ్, ఎస్బీపీ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా) విలీనానికి ప్రత్యేక పథకాన్ని ప్రటించనున్నట్లు తెలుస్తోంది.
ఎస్బీఐ:
భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఎస్బీఐనే అతిపెద్దది. బ్రాంచీల సంఖ్య, వ్యాపారం పరంగా ప్రపంచ స్థాయి బ్యాంకులతో ఎస్బీఐ పోటీ పడుతోంది. ఇటీవలి కాలంలో ఎస్బీఐ రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేసే సిబ్బంది సంఖ్యను కుదిస్తూ,రెండోది కంప్యూటరీకరణ. ఈ క్రమంలో బ్యాంకు తక్కువ ఉద్యోగులతో ఎక్కువ సామర్థ్యాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది.
ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్
అనుబంధ బ్యాంకుల్లో ఎస్బీఐ వాటా 75 నుంచి 100 శాతం వరకూ ఉంది. మార్చి 2016 నాటికి ఎస్బీఐకి ఎస్బీఎమ్లో 90%, ఎస్బీటీలో 79.09%, స్టేట్ బ్యాంక్ ఆప్ బికనీర్ అండ్ జైపూర్లో 75.07%, ఎస్బీహచ్, ఎస్బీపీలలో 100 శాతం వాటా ఉంది.
విలీన ప్రయోజనాలు:
ప్రపంచంలో అతిపెద్ద 100 బ్యాంకుల్లో భారతదేశానికి సంబంధించిన బ్యాంకు ఒక్కటీ లేదు. జీడీపీ పరంగా ఏడో అతిపెద్ద దేశం, కొనుగోలు శక్తిపరంగా 3వ స్థానంలో ఉన్న దేశం ఈ విధంగా ఉండటం బాగోలేదని విధాన నిర్ణేతల వాదన. ఒకవేళ ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను కలిపితే ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటిగా కాగలదనే దీమాను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. రూ. 37 లక్షల కోట్ల వ్యాపారంతో 22,500 శాఖలు, 58వేల ఏటీఎమ్లు(డిసెంబరు 2015 లెక్కలు) మొదలైన వాటితో విదేశీ బ్యాంకు శాఖల్లో తన ప్రాబల్యాన్ని ఎస్బీఐ చాటుకోగలనేది అనుకూలుర వాదన.
మెర్జింగ్ వల్ల విపరిణామాలు:
అనుబంధ బ్యాంకులతో పోలిస్తే సాంకేతికంగా చాలా ముందంజలో ఉంది. అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు, వినియోగదారులు ఆ దిశగా అలవాటు పడేందుకు కొంచెం సమయం పడుతుంది.
అందుకే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ అనుబంధ బ్యాంకులన్నింటినీ కలిపి ఒక బ్యాంకుగా ఏర్పాటు చేయాలని వాదిస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ గురించి మాట్లాడుతూ మరోవైపు బ్యాంకులన్నింటినీ విలీనం చేస్తే ఇది ఎలా సాధ్యమవుతుందనేది బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రశ్నగా ఉంది.
ఉద్యోగుల భవిష్యత్తు కెరీర్ ఎలా ఉంటుందనేది ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత కావాలని వారు కోరుతున్నారు.
విలీనాల్లో తొలి అడుగులు
ఆగస్టు 13, 2008లో స్టేట్ బ్యాంక్ సౌరాష్ట్ర ఎస్బీఐలో కలిసిపోయింది. అప్పుడు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సంఖ్య ఆరుకు తగ్గింది. జూన్ 19,2009 నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనానికి ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రక్రియ ఏప్రిల్, 2010 నాటికి పూర్తయింది. ఆ ఏడాది ఆగస్టు నెల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ బ్రాంచీలన్నీ ఎస్బీఐ శాఖల్లగా వ్యవహరించసాగాయి.
వాటా షేర్ల కేటాయింపు
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్నాయి. దీంతో విలీన సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్కు చెందిన ప్రతి 10 షేర్లకుగాను ఎస్బీఐ 28 షేర్లను, ఎస్బీఎమ్,ఎస్బీటీకి చెందిన ప్రతి 10 షేర్లకు 22 షేర్లను కేటాయిస్తోంది.
50 అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత ప్రయివేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ కంటే 5 రెట్లు పెద్ద బ్యాంకుగా ఎస్బీఐ మారబోతుంది. రూ. 37 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్తో ప్రపంచంలో 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటిగా నిలుస్తుంది. బ్రాంచీల సంఖ్య సైతం బాగా పెరుగుతుంది