పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయండిలా...
పిల్లలకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించాలని ప్రతి తల్లిదండ్రులకూ ఉంటుంది. చాలా మంది జీవిత లక్ష్యాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. అయితే ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారా? అంటే 100 శాతం అవునని చెప్పలేకపోవచ్చు. దాని కోసం అవసరమైన డబ్బును సమకూర్చుకుంటున్నారా? బీమా కంపెనీలు అందించే పిల్లల పాలసీల నుంచి ఆడ పిల్లలకు ఉండే సుకన్య సమృద్ది పథకం వరకూ పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిలోంచి మీరు ఏది ఎంచుకోవాలనేదే అసలు సమస్య.
అందుకోసం మీరు మొదట లక్ష్యాన్ని నిర్దారించుకోవాలి. ఉదాహరణకు ఇంజినీరింగ్ లేదా మంచి కాలేజీలో ఎంబీఏ చేయాలంటే రూ. 10 లక్షలు ఖర్చవుతుందనుకుందాం. ఇది ఈ రోజు మనం అనుకునే ఖర్చు. మీరు మీ లక్ష్యాన్ని బట్టి ఎప్పటికి మీ పిల్లలు ఆయా చదువులు చదువుతారో లెక్కించుకోవాలి. 10నుంచి 15 ఏళ్ల తర్వాత ఈ డబ్బు అవసరం అనుకుంటే అప్పటి ఖర్చులను పరిగణనలోకి తీసుకునేందుకు ద్రవ్యోల్బణాన్ని సైతం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతం రూ. 15 లక్షల ఖర్చు అవుతుందని భావిస్తే కనీసం 8 శాతం ద్రవ్యోల్బణం ఉంటుందనుకున్నా 15 ఏళ్ల తర్వాతి సమయానికి మీరు రూ. 46 లక్షలు పొదుపు చేయాల్సి ఉంటుంది. అంటే అప్పటి లెక్కల ప్రకారం చదువుల ఖర్చు అంతవుతుందన్నమాట.
పొదుపు చేసేముందు రెండు అంశాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. అవి: రిస్క్ ప్రొఫైల్, కాలపరిమితి
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు:
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించిన రాబడులనిస్తాయి. జులై 17,2016తో ముగిసిన పదేళ్ల కాలానికి షేర్ మార్కెట్లో వార్షిక రాబడి 11శాతంగా ఉంది. ఈక్విటీ రాబడులకు పన్ను ఉండదు కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా ఇవే ఉత్తమం
బ్యాలెన్స్డ్ ఫండ్లు
బ్యాలెన్స్డ్ ఫండ్ల ఆస్తులను కనీసం 65 శాతం ఈక్విటీలలోను మిగిలిన దాన్ని డెట్ షేర్లలోనూ పెడతారు. పన్ను ఉద్దేశంలో చూస్తే వీటిని ఈక్విటీ ఫండ్లుగానే లెక్కగడతారు. వీటికి కొంచెం తక్కువ ఈక్విటీ ప్రభావం ఉన్నప్పటికీ అంత ఎక్కువ రిస్క్ చేయని పెట్టుబడిదార్లకు ఇవి బాగానే సరిపోతాయి.
సుకన్య సమృద్ది పథకం:
ఎక్కువగా రిస్క్ చేయలేని పెట్టుబడిదారులకు ఇది ఉత్తమ మార్గం. అయితే ఇది ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు మాత్రమే. ఖాతా తెరిచేసరికి అమ్మాయి వయసు 10 ఏళ్లు మించకూడదు. ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద రూ. 1లక్షా 50 వేల వరకూ మినహాయింపులు పొందవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:
ఆడపిల్లలు లేని వారు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దిశగా ప్రయత్నించవచ్చు. దీనికి సైతం సుకన్య సమృద్దికి లభించే పన్ను ప్రయోజనాలే లభిస్తాయి. పీపీఎఫ్ మెచ్యూరిటీ 15 సంవత్సరాలుగా ఉంటుంది. ఇందులో ఏడాదికి రూ. 500 మొదలుకొని పెట్టుబడులు పెట్టేందుకు వీలుంది.
బంగారం:
ఈక్విటీ ఫండ్లు, షేర్ మార్కెట్ పెట్టుబడులు హెచ్చుతగ్గులు చూపుతున్నప్పుడు బంగారం స్థిరమైన రాబడినిస్తూ ఒక మంచి పెట్టుబడి సాధనంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నప్పుడు బంగారం పెట్టుబడిదారులను నష్టాల నుంచి బయటపడేయగలదు. ఇందుకోసం గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, బంగారం బాండ్ల వంటి వాటిని ప్రయత్నించవచ్చు.
బీమా :
పిల్లల భవిష్యత్తు కోసం మీకు టర్మ్ పాలసీ ఉండటం ఎంతైనా అవసరం. మనకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అనే అంశాన్ని అంత సులువుగా కొట్టిపారేయలేం. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మనకు ఏదైనా జరిగితే పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా మీ ఆదాయానికి 10 నుంచి 12 రెట్ల టర్మ్ పాలసీని తీసుకోవడం ఉత్తమం. పాలసీ కొనుగోలు సమయంలో పిల్లల చదువు, వివాహం, దినసరి ఖర్చులు దృష్టిలో ఉంచుకోవాలని ఆర్థిక ప్రణాళిక నిపుణులు సూచిస్తారు.
పిల్లలకు నైపుణ్యాలు నేర్పడం
చిన్నతనం నుంచే పిల్లలకు వారికి ఇష్టమైన, అభిరుచి కలిగిన రంగంలో శిక్షణ ఇప్పిస్తూ ప్రావీణ్యం పొందేలా చూడాలి. ఉదాహరణకు నృత్యం, ఆటలు, కళలు, మార్షల్ ఆర్ట్స్, కరాటే, డిజిటల్ మీడియా వంటి వాటిలో వారికి అన్ని విధాలుగా తోడ్పాటునందించాలి. పెద్ద చదువులు చదవకపోయినా టెక్నాలజీ ద్వారా చిన్న వయసులోనే కోట్లు గడిస్తున్నవారిని గురించి మనం వింటూంటాం. అందుకోసం పెట్టిన పెట్టుబడి దీర్ఘకాలంలో ఫలితాలను ఇవ్వవచ్చు. అంతే కాకుండా పిల్లలను క్రమంగా చిన్న మొత్తాల్లో పొదుపు చేసేలా ప్రోత్సహించాలి.